దక్షిణ కొరియన్లు భారతీయుల్ని చిన్నచూపు చూస్తున్నారా ?
-------------------------------------------------------------------------
ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. దక్షిణ కొరియా దేశస్తులు భారతీయుల్ని చిన్న చూపు చూస్తున్నారని, వారు ఆసియా వాసులే అయినప్పటికీ మనల్ని అలా ట్రీట్ చేయడం ఏమిటి అని ఎవరికైనా కోపం వస్తుంది. మన దేశం లో వాళ్ళ పరిశ్రమలు ఉన్న చోట వాళ్ళ క్యాంటిన్ ల లోకి కూడా అడుగుపెట్టనివ్వరని కూడా చదివాము. ఈ మాట నిజమే అయినప్పటికీ దీని వెనుక కొన్ని నిజాలు ఉన్నాయి. అవి మనం అర్థం చేసుకోవాలి. 50 వ దశకం వరకు పెద్దగా అభివృద్ధి చెందని ఈదేశం, ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రగతి పథం లో పయనిస్తూ ఎల్.జి., హ్యూండాయ్, సాం సంగ్, పోస్కో లాంటి వ్యాపార దిగ్గజాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగిపోతోంది.
అంతేకాదు కొరియన్ సినిమాలు, డ్రామాలు, మ్యూజిక్ ఈ మధ్య మన దేశం లో బాగా ఆదరణ పొందుతున్నాయి. దక్షిణ కొరియా దేశం మొత్తం మీద ఒకే భాష,ఒకే సంస్కృతి లా ఉంటుంది.మొన్న మొన్నటి దాకా ఇంగ్లీష్ భాష కూడా ఎవరికీ రాదు. ఈ తరం వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పోటీ పడుతున్నారు. దాని కోసం ఇబ్బడి ముబ్బడి గా సంస్థలు ఆవిర్భవించి డబ్బు చేసుకుంటున్నాయి. మరి మీరు ఇండియన్స్ ని చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు, రంగు తక్కువ అని అహంకారం ప్రదర్శిస్తున్నారా అని మన వాళ్ళు అడిగితే వాళ్ళ సమాధానం ఏమిటంటే , మా దేశస్తులు తరతరాలుగా విదేశాలు వెళ్ళింది తక్కువ. మా కంటే భిన్నంగా ఉన్నవారిని ఎలా ట్రీట్ చేయాలి అనేది తెలియదు.
వియాత్నం , ఫిలిప్పిన్స్ వాళ్ళని కూడా చిన్న చూపు చూస్తారు ,ఎందుకంటే ఆర్ధికంగా వాళ్ళు వెనకబడి ఉన్నందువల్ల అలా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నవాళ్ళలో అలా ఎవరూ లేరు. ఉంటే గింటే చాలా తక్కువ. ఇండియన్స్ చాలా కాలం నుంచి విదేశాలకి వెళ్ళడం,ఇంగ్లీష్ నేర్చుకొని ఎక్కువ బయటి ప్రపంచం తో మెలగడం ఇవన్నీ ఉన్నాయి,కానీ మా దక్షిణ కొరియా వాళ్ళకి అలాంటి కోణం లేదు. నిజానికి మాకు ఇండియా గురించి చాలా తక్కువ తెలుసు. గత తరాల వాళ్ళ విషయానికొస్తే మరీ దారుణం. బుద్ధుడు , యోగా లాంటి ఏవో కొన్ని అంశాలు తప్పా ఇంకేమీ తెలియదు. చైనా , జపాన్ వాళ్ళ ని కూడా ఇండియన్స్ మాదిరిగానే చూస్తాం అంటూ దక్షిణ కొరియా వ్యక్తి చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం దక్షిణ కొరియా దేశం లో యువత కి ప్లాస్టిక్ సర్జరీ మోజు బాగా ముదిరింది. ఏ మాత్రం అవయవం బాగా లేదనుకున్నా ఆపరేషన్ తో సరిజేయించుకుంటున్నారు. సియోల్ లో ఈ కాస్మటిక్ సర్జరీ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా ఉన్నది. ప్రపంచం లో అతి తక్కువ ఒబేసిటి ఉన్న జనాలు ఈ దేశం లోనే ఉన్నారు.శరీరం గురించి అంత శ్రద్ధ అన్నమాట. మగవాళ్ళు గానీ ఆడవాళ్ళు గానీ మేకప్ లేనిదే బయటకి రారు. బాగా పరిశీలించి చూసినట్లయితే సాంస్కృతికంగా మన దేశానికి దక్షిణ కొరియా కి దగ్గరి బాంధవ్యం ఉన్నది.
తరతరాలుగా ఇక్కడ ఆచారం ఏమిటంటే తమ కన్నా పెద్ద వయసు వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడతారు. అందుకే ఎదుటి వారిని కలిసిన వెంటనే వాళ్ళ వయసు అడుగుతారు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు బయట విడుస్తారు. ఏదీ ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా రెండు చేతులతో చేస్తారు. ఒక్క చెయ్యి ఉపయోగిస్తే అమర్యాద గా భావిస్తారు. పౌర్ణమి రోజున బుద్ధ జయంతి జరుపుకుంటారు. కంఫ్యూషియస్ బోధనల ప్రభావం ఎక్కువ గా ఆ సమాజం మీద ఉన్నది.
----- మూర్తి కెవివిఎస్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి