Pages

2, మార్చి 2024, శనివారం

మొట్ట మొదటిసారిగా అమెరికా వెళ్ళేవారు ఈ విషయాల్ని గమనిస్తే మంచిది.

 మొట్ట మొదటిసారిగా అమెరికా వెళ్ళేవారు ఈ విషయాల్ని గమనిస్తే మంచిది. వీటిని రాసింది ఓ ఒరియా అమ్మాయి, తను నాలుగేళ్ళ కిందట ఆ దేశం వెళ్ళినపుడు పరిశీలించి రాసిన కొన్ని విశేషాలు.


1.అమెరికా లో ఎక్కువ గా ఉండేది చెక్క తో నిర్మించిన ఇళ్ళే.సిమెంట్,ఇటుకలు లాంటి వాటితో మన దేశం లో ఎక్కువ గా ఇళ్ళు నిర్మించుకున్నట్లే అక్కడ ఆ విధంగా నిర్మించుకుంటారు.


2. ప్రతి ఇంట్లో ఫ్లోర్ మీద రగ్గులు పరుస్తారు. కార్పెట్ ల మాదిరిగా అన్నమాట. బాత్ రూం లు అన్నిట్లో కూడా. తుడవడానికి మాపింగ్ కంటే వాక్యుమింగ్ కి ప్రాధాన్యత ఉంటుంది.


3.వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకోవడం అంటే మనకి మనం చేతితో కొట్టుకోవడమే. కార్డ్ తో చెల్లించాలి. సెల్ఫ్ సర్వీస్ అన్నమాట.


4. ట్రాఫిక్ రూల్స్ పాటించడం లో ఎలాంటి వాళ్ళకీ సడలింపులు ఉండవు. ఉల్లంఘిస్తే  ఫైన్ లు విపరీతంగా ఉంటాయి.


5. ఎక్కడో న్యూయార్క్ లాంటి నగరాల్లో తప్పా జనాలు చాలా తక్కువ గా రోడ్ల మీద కనిపిస్తారు. కార్లు ఎక్కువ గా కనిపిస్తాయి.


6.ఇంచు మించు చాలా చిన్న ఊర్లలో కూడా రోడ్లు చాలా వెడల్పుగా ఉండి మన నేషనల్ హైవే ల మాదిరిగా ఉంటాయి.


7. జనాలు స్ట్రైట్ గా ఉంటారు. మీరు నచ్చితే అడగడానికి వెనకాడరు. ఇతరత్రా సమయం వృధా చేయడం ఉండదు. 


8. హోటళ్ళ లో రేట్లు ఎక్కువ. ఆహారం ఎక్కువ క్వాంటిటి లో పెడతారు. 


9. హోటళ్ళ లో కాంప్లిమెంటరి వాటర్ బాటిల్స్ ఇవ్వరు.


10.హై ప్రొఫైల్ చూసి ప్రత్యేకం గా ఎవరికీ ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం ఉండదు. రెస్టారెంట్ లో క్లీనింగ్ పనిచేసే వ్యక్తికైనా, పెద్ద అధికారి అయినా సహజంగా సాటి మనిషికి ఇచ్చే గౌరవం ఇస్తారు.


11. పెంపుడు జంతువుల్ని మనుషులతో సమానం గా ట్రీట్ చేస్తారు.


12. కొత్త ఆలోచన దేన్నైనా స్వాగతిస్తారు.     


 

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

గద్దర్ పేరు మీద సినిమా అవార్డులా...ఓర్నీ

 

గద్దర్ పేరు ని సినిమా వాళ్ళ కి ఇచ్చే అవార్డ్ లకి పెడదామనే టాక్ ఒకటి బయటకి వచ్చింది. జన బాహుళ్యం లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. అసలు ఆ పేరు ని పెడదామనే ఊహ రావడమే విచిత్రం. ఆయన కొన్ని సినిమాల్లో పాటలు పాడాడు. కొన్ని సినిమాల్లో కనిపించాడు. కాని మౌలికంగా తెలుగు సినిమా కి చేసినది ఏముందని..? పెద్దగా ఏమీ లేదు. అంతకంటే సినిమా కి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

గద్దర్ ప్రధానంగా ప్రభుత్వ విధాన వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు. విప్లవ గీతాలతో ఉర్రూతలూగించి యువత ని అడవుల్లోకి వెళ్ళేలా చేశాడు.అనేకమంది చావులకి పరోక్షం గా కారణమయ్యాడు. తను వయసు లో ఉన్నప్పుడు అలా చేసి వయసు మళ్ళిన కాలం లో ఏ పార్టీలనైతే తిట్టాడో అదే పార్టీల్లో చేరాడు. ఇంకా ఆ తర్వాత జరిగినవి అన్నీ అందరకీ తెలిసినవే. భద్రం కొడుకో...అనే పాట గాని , మదనా సుందరి ..అనే పాటగాని...ఇంకా ఆయనకి పేరు తెచ్చిన చాలా పాటలు ఆయన రాసినవి కావు.

అంజయ్య ఇంకా మిగతా వాళ్ళు రాసినవి.కాని వాళ్ళు రాసినట్లు స్టేజ్ ల మీద ఎక్కడా చేప్పేవాడు కాదు. ఆ విధంగా చాలా పేరు తెచ్చిన పాటలు ఆయన సొంత రచనలే అనుకుంటారు చాలామంది. ఇక సొంత కుటుంబం లో పిల్లలు మాత్రం ఉద్యమం లోకి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. ఎంతో మంది చావులకి కారణమై,మళ్ళీ ఉద్యమం నుంచి బయటకి వచ్చి పాత పాపులారిటి తో కొత్త జీవితాన్ని గ్లామర్ ని సాధించుకునే వీళ్ళు , వీళ్ళ ప్రభావం వల్ల గర్భశోకం అనుభవించిన తల్లిదండ్రులకి ఏం సమాధానం చెబుతారు. 

కనక సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డ్ లకి గద్దర్ పేరు పెట్టడం నూటికి నూరు పాళ్ళు తలతిక్క పని. ఈ ఆలోచన ఎందుకు ఎవరకి వచ్చిందో మరి.సరైన వాళ్ళ పేర్లు దొరక్కపోతే ప్రభుత్వం పేరు మీద ఇవ్వండి. నష్టం ఏముంది.      

6, డిసెంబర్ 2023, బుధవారం

అమెరికా నుంచి ఒక గుజరాతి విద్యార్థి రాసిన అనుభవాలు

 


జెనిల్ దేశాయ్ అనే గుజరాతి విద్యార్థి అమెరికా లో ఎం.ఎస్. చదువుతూ తన అనుభవాల్ని ఈ విధంగా రాశాడు. ఇంకా రాయడానికి ఓ బుక్ అంత ఉంది గానీ ముఖ్య అంశాలు మాత్రం ప్రస్తావించడం జరిగింది.


యు.ఎస్. లో మీరు గొప్ప రాక్ స్టార్ అయినా, మామూలు మనిషి అయినా గొప్ప తేడా ఏమీ ఉండదు.మామూలు గానే చూస్తారు.

ప్రతి విషయాన్ని సొంతగానే నేర్చుకోవాలి.

జీవితం ఇక్కడ స్ట్రగుల్ గా ఉంటుంది. కాని దానికి తగ్గ వినోదం కూడా ఉంటుంది. నిజమైన ప్రపంచం ఏ సూత్రాల మీద పని చేస్తుందో అర్థమవుతుంది.
ఏ ఫీల్డ్ లో గానీ అనుభవం అనేదానికి ఎక్కువ విలువ ఉంటుంది.

లైబ్రరీ లో చదువుతూ ఎక్కువ సమయం గడపవలసిందే. ప్రతి చిన్న విషయాన్ని ప్రొఫెసర్స్ చెప్పరు.

ఏదీ ఉచితం గా రాదు. ప్రతిదాన్ని శ్రమించి పొందవలసిందే.

చాలామందికి మనకన్నా ఎక్కువ విషయాలు తెలిసిఉంటాయి.అది మనకి తెలిసిపోతూనే ఉంటుంది.

ఇక్కడ ఏ భారతీయునికి ఇంకో భారతీయుడు సాయపడడు. ఇదొక చేదు నిజం.
సీనియర్స్ ముందు కొద్దిగా హెల్ప్ చేసినా, సెమిస్టర్ మొదలయితే వాళ్ళు ఆ తర్వాత హెల్ప్ చేయరు.కాబట్టి సీనియర్స్ మీద ఎక్కువ ఆధారపడకూడదు.

మనతో ఏదైనా పని ఉంటేనే జనాలు పిలుస్తారు. దేనికి ప్రతిస్పందించాలో మనం నిర్ణయించుకోవాలి.

29, నవంబర్ 2023, బుధవారం

మెడిసిన్ చదవడానికి కిర్గిస్తాన్ వెళుతున్నారు, సరే... అక్కడ క్వాలిటి ఎలా ఉందో ?


 ఈ మధ్య వైద్యశాస్త్రం చదవాలంటే చాలామంది విదేశాలు వెళ్ళిపోతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. మన దేశం లోని చాలా మెడికల్ కాలేజీలు ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు వసూలు చేసే ఫీజులు భయంకరం గా ఉండి మధ్య తరగతి కుటుంబాలు భరించలేని స్థితిలో విదేశాలకి వెళ్ళిపోతున్నారు.  ప్రతి ఏటా ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు నీట్ పాసవుతున్నారు. కానీ ఉన్న సీట్లు దేశం మొత్తం మీద తొంభై వేలు మాత్రమే..!

హంగరీ,కజాన్, బెలారస్, కిర్గిస్థాన్, చైనా ,ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకి మన వాళ్ళు వైద్యవిద్య కోసం వెళుతున్నారు. కిర్గిస్తాన్ లాంటి దేశాల్లో ఒక సంవత్సరం కి గాను మూడన్నర నుంచి అయిదు లక్షలు చెల్లించవలసి ఉంటుంది.ఎక్కువ లో ఎక్కువ ఇరవై లేదా పాతిక లక్షల్లో వైద్య విద్య మొత్తం అయిపోతుంది. కానీ అదే మన దగ్గర ఒక్క సంవత్సరానికి గాను పాతిక లక్షల నుంచి కోటి రూపాయలకి పైగా ప్రైవేట్ కాలేజీల్లో చెల్లించాలి.కిర్గిస్తాన్ లో వైద్యవిద్య అభ్యసించిన గ్రాడ్యుయేట్ కి ఎం సి ఐ, డబ్ల్యు హెచ్ ఓ  లాంటి సంస్థలు సైతం గుర్తింపు నిస్తున్నాయి.

మన నీట్ స్కోర్ ని  కూడా ఆ దేశాలు గుర్తిస్తున్నాయి. నాణ్యత పరంగా కూడా మంచి విద్యనే అవి తక్కువ ధర లో అందిస్తున్నాయి.కనుకనే మనవాళ్ళు క్యూ కడుతున్నారు.ఆసియా దేశాల్లో పాకిస్తాన్,బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళుతున్నారు. ప్రతి ఏటా సుమారు పాతికవేలమంది వైద్యవిద్య నిమిత్తం మన దేశం నుంచి బయటకి వెళుతున్నారు. అదే విధం గా మన మెడికల్ గ్రాడ్యుయట్ లు ప్రతి ఏటా అయిదువేల మంది ఇతర దేశాలకి ఉద్యోగనిమిత్తం వెళుతున్నారు.ఆస్ట్రేలియా,కెనడా,ఇంగ్లాండ్,అమెరికా,నెదర్ లాండ్స్ లాంటి దేశాల్లో మెరుగైన వేతనాల కోసం వెళుతున్నారు.   




    

1, అక్టోబర్ 2023, ఆదివారం

ఆయన అరెస్ట్ అయిన తర్వాత బాల కృష్ణ గారి ధోరణి సినిమా మూస లోనే .....

 అప్పుడప్పుడు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. చంద్రబాబు జైలు కెళతారని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే అలా అనిపించడం సహజం. న్యాయ వ్యవస్థ లో తిరుగులేని పట్టు కలిగి ఇదిగో ఈ విషయం లో దొరికిపోతాడు అనుకునేలోపు దాంట్లోచి బయటకి రాగలగడం మనం అనేకసార్లు చూడలేదా..? స్వతహగా ఎన్ టీ ఆర్ లాగా గొప్ప స్పీచ్ లు అవీ ఇచ్చే చరిష్మా లేకపోయినా తన మనుషుల్ని ఎక్కడ ప్లాంట్ చేయాలో అక్కడ ప్లాంట్ చేసి కార్యాల్ని గంధర్వుల మాదిరి గా మూడో కంటికి తెలియకుండా నడిపించడం బాబు గారి చతురత కి నిదర్శనం.

ఆయన అరెస్ట్ అయిన తర్వాత బాల కృష్ణ గారి ధోరణి సినిమా మూస లోనే తప్పా మారకపోవడం చిత్రం. మమ్మల్ని ఏమీ పీకలేవు అంటూ బూతులు అందుకోవడం అసెంబ్లీ లో అలాంటి చేతి సైగలు చేయడం ఆయన రాజకీయ అపరిపక్వత కి నిదర్శనం. ఆల్ రెడీ అక్కడ పీకి చూపించాడు ప్రత్యర్థి ...అయినా ఏం పీకుతావు అంటూ మాట్లాడటం ఏమిటో అర్థం కావట్లేదు. ఇక పవన్ పయనం ఏమిటో గందరగోళం గా ఉంది.

రాజకీయ క్షేత్రం లో పవర్ ఎప్పుడూ ఒకే వైపు ఎల్లకాలం ఉండదు. గతం లో జగన్ ని అరెస్ట్ చేయడం , అతని కుటుంబాన్ని వేధించడం కళ్ళున్న ప్రతి ఒక్కరు చూశారు. ప్రస్తుతం జరిగింది దానికి టిట్ ఫర్ టాట్ లాంటిది తప్పా మరొకటి కాదన్నట్లు సామాన్యుడు భావిస్తున్నాడు. అందుకనే పవర్ చేతి లో ఉన్నప్పుడు ఎదుటి పక్షాన్ని ఒక స్థాయి దాటి వేధించరు నిజం గా తెలివైనవాళ్ళు. ఎందుకంటే పవర్ చేతులు మారినపుడు పదింతలై వెనక్కి తిరిగి వస్తుంది. తల్చుకుంటే సోనియమ్మ ని,రాహుల్ బాబు ని జైల్లో పెట్టించలేరా మోడీ షాలు...కానీ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు పవర్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదని.      

3, సెప్టెంబర్ 2023, ఆదివారం

కొన్ని టివి. చానెళ్ళ లో ముస్లిం ప్రేమికుని పేరు కూడా వేయడం లేదు. ఎందుకు..? ఎవరైనా నేరస్థుడేగా ...ఎందుకా భయం..?

 కోరుట్ల ఉదంతం కొన్ని ప్రశ్నల్ని మన ముందు ఉంచింది. దీప్తి,చందన ఇంకా ముస్లిం ప్రేమికుడు. ముస్లిం ప్రేమికుడు, సోదరి చందన ఇద్దరు పారిపోతూ దీప్తి అనే అమ్మాయిని చంపేసి వెళ్ళిపోయారు. కొన్ని టివి. చానెళ్ళ లో ముస్లిం ప్రేమికుని పేరు కూడా వేయడం లేదు. ఎందుకు..? ఎవరైనా నేరస్థుడేగా ...ఎందుకా భయం..?


ఇదే ఉదంతం రివర్స్ లో జరిగింది అనుకోండి...ఒకసారి ఊహించుకొండి...ఏం జరిగి ఉండేది..? ఖచ్చితం గా ఆ హిందూ కుర్ర ప్రేమికుడి ని వెంటాడి చంపేవారు. ఏమైనా అంటే అది మా మత సంప్రదాయానికి విరుద్ధం అంటారు. దాన్ని కొంతమంది హిందువులు కూడా సమర్థిస్తారు. 


సోషల్ మీడియా లో చూస్తే ఒక్క ముస్లిం వ్యక్తి కూడా ఆ కుర్రాడు చేసింది తప్పు అన్న పాపాన పోలేదు. ఏ నాయకుడు బహిరంగంగా ఖండన చేసినట్లు లేదు. ఎందుకింత హిపోక్రసీ..?


హిందువులకి మత భావన లేదు ...ఇదొక కారణం.

అసలు తమని ఓ మతం కింద జమ కడతారనే విషయం కూడా కొంతమందికి తెలియదు.


ఎవడెట్లా పోతే నాకేంటి...అనుకునే తత్వం. ఇంకా ప్రమాదకర విషయం. కొంతమంది దళితులు కూడా ముస్లిం ల చేష్టల్ని సమర్థించడం. సవర్ణ హిందువులు ...మిమ్మల్ని ఆ రోజుల్లో అలా చేశారు కాబట్టి మాతో కలవండి అని వాళ్ళని తమ వేపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.


హిందూ మతం లో ఉన్న జాడ్యాలపై నిస్సందేహంగా పోరాడవచ్చు. తప్పు లేదు. హిందూ మతం ఓ వెయ్యి ఏళ్ళ క్రితం ఉన్నట్లు ఇప్పుడు లేదు. ఇంకా మార్పులకి లోనయినా వచ్చిన ముప్పు లేదు. కానీ శత్రువు పక్షం లో ఉండి సొంత ఇంటి వారిపై పోరాడతా అంటే ఎలా..?


సవర్ణ హిందువులు తప్పనిసరిగా ఇకనైనా తమ అభిజాత్యాల్ని తగ్గించుకోవాలి. రకరకాల కారణాలతో దూరమైన వర్గాల్ని చేరదీయాలి. అప్పుడే హిందూ మతం కి బలం.  

25, ఆగస్టు 2023, శుక్రవారం

"జైలర్" సినిమా పై నా అభిప్రాయం


రజనీకాంత్ లో మేజిక్ మళ్ళీ ఈ సినిమా ద్వారా బయటపడింది. ఈ మధ్య సరైన హిట్ లేక ఉన్న ఆయనకి సమయానికి ఓ హిట్ పడింది. ఇదేదో అనాలోచితం గా వచ్చింది కాదు. తన వయసు కి తగిన పాత్ర ని ఎంచుకున్నాడు. అంతే గాక భుజ బలం తో గాకుండా బుద్ధిబలం తో ఎలా ఓ సీనియర్ సిటిజన్ తనకి ఎదురైన సవాళ్ళను అధిగమించాడు అన్నది దీంట్లో ప్రధాన విషయం. అందుకే చిన్నా,పెద్దా అందరూ సినిమా కి కనెక్ట్ అయ్యారు.

సన్నివేశాల్ని తీర్చిదిద్దటం లో సహజత్వానికి దగ్గరగా ఉండటం అనేది తమిళ దర్శకుల్లోని గొప్ప ప్లస్ పాయింట్. అది ఈ సినిమా లో మరింత బాగుంది. సినిమా మొదట్లోనే రిటైర్ అయిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో బాగా చూపెట్టడం జరిగింది. మనవడి తో చిన్న చిన్న యూట్యుబ్ వీడియోలు తీసుకోవడం అనేది అందర్నీ అలరిస్తుంది.మామూలు గానే తన వయసు కి అది నప్పింది. యోగిబాబు కేరక్టర్ లాంటి వారు ఇంచు మించు ప్రతి వీథి లోనూ ఉంటారు.పైగా ఆ హాస్యం చాలా మృదువు గా గిలిగింతలు పెడుతుంది.

ఇక ప్రధాన విలన్ వినాయగం కలకాలం గుర్తుండేలా చేశాడు.చిన్నా చితకా పాత్రలు వేసే అతగాడి లో ఇంత కోణం ఉందని కనిపెట్టిన దర్శకుని అభినందించాలి.మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ఇద్దరూ తమ ప్రత్యేక పాత్రల్లో విరగదీశారు.చప్పట్లు పడ్డాయి. ఆయా భాషల్లో కూడా వీరి ప్రభావం బాగా ఉంటుంది.సందేహం లేదు. డైలాగ్స్ బావున్నాయి. ఫైటింగ్ సన్నివేశాల్ని చాలా విన్నూత్నం గా తీశారు.కొత్తదనం అనేది సినిమా చూసే ప్రేక్షకుడు ఫీలవుతాడు. మెంటల్ హాస్పిటల్ సన్నివేశాలు సైతం కడుపుబ్బా నవ్విస్తాయి. 

సినిమా కి డైలాగులు ప్రాణం పోశాయి. అదే విధం గా క్లైమాక్స్ లో వచ్చే కొడుకు ద్రోహం చేసే సీను ఎవరూ ఊహించలేరు. దానికి శిక్ష ని కూడా వెరైటీ గా తీశారు. సినిమా ఏ దశ లోనూ బోర్ కొట్టకుండా నడిపించడం ఈ సినిమా జైత్ర యాత్ర కి తోడ్పడింది.తీహార్ జైలు సన్నివేశాలు అదరహో అనిపించాయి.సంగీతం ఫర్వాలేదు. కథా, కథనం ఈ సినిమా కి నిజమైన హీరోలు.రమ్యకృష్ణ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి.ఏది ఏమైనా రజనీకాంత్ నిస్సహందేహం గా ఈసారి తెలివి గా హిట్ కొట్టాడని చెప్పాలి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ని అభినందించకుండా ఉండలేము ఇటువంటి ఎంటర్టైనర్ ఇచ్చినందుకు. 

--- EM