గత శుక్రవారం సుప్రీం కోర్ట్ ఒక తీర్పు ఇచ్చింది. అదేమిటంటే రష్యా వెళ్ళి అక్కడి యుద్ధం లో ఫాల్గొని మరణించిన మరియు గాయపడిన వ్యక్తులకి సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ఒక నోడల్ ఆఫీసర్ ని నియమించమని విదేశాంగ శాఖ ని కోరింది. ఈ వార్త చూడగానే అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళి ఆ యుక్రెయిన్ రష్యా యుద్ధం లో ఫాల్గొన్నారు అనే సందేహం రావడం ఎవరికైనా సహజం. కొన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీ లు వీరిని కార్పెంటరీ,కన్స్ట్రక్షన్ ఇంకా చిన్నా చితకా ఉద్యోగాలకి మంచి జీతం వస్తుందని రష్యా తీసుకెళ్ళి వదిలేశారని,అక్కడ వీరిని బలవంతంగా ఆర్మీ లోకి వినియోగించుకున్నారని ఆ తర్వాత వార్తలు వచ్చాయి.ముఖ్యంగా రాజస్థాన్,హర్యానా,పంజాబ్ నుంచి వెళ్ళారు.
అయితే ఇది పూర్తిగా నమ్మదగినదా అంటే కూడా సందేహమే. రష్యా కి ప్రస్తుతం ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడే సోల్జర్స్ కావాలి.స్థానికులు ఆర్మీ లో చేరడానికి నిరాసక్తత చూపించడం వల్ల రష్యా మాత్రమే కాదు యుక్రెయిన్ కూడా విదేశాల నుంచి ముఖ్యంగా ఆసియా,ఆఫ్రికా ఇంకా ఇతర ప్రాంతాల నుంచి సైనికుల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు.రకరకాల డిసెప్టివ్ నెట్ వర్క్ ల ద్వారా పెద్ద ఎత్తున వేతనాల్ని ఇంకా సిటిజెన్ షిప్ ని ఆశ చూపి చేర్చుకుంటున్నారు. అయితే వీళ్ళు చనిపోతే కనీసం శవాల్ని కూడా తిరిగి ఇవ్వడం లేదు. మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళలో 41 మంది చనిపోతే, శవాలు యుద్ధభూమి లో వెదకి ఇవ్వడం కష్టమైన పని రష్యన్ అధికారులు చెప్పారు.
ఉక్రెయిన్ దేశం దాదాపు 100 దేశాల నుంచి విదేశీ సైనికుల్ని రిక్రూట్ చేసుకుంది.కెన్యా,జింబాబ్వే,ఈజిప్ట్,ఘనా లాంటి పేద దేశాల నుంచి ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంది. వీరిలో ఎక్కువమంది వారం కూడా బ్రతకడం కష్టం.ఎందుకంటే ఫ్రంట్ లైన్ లో ఉండే వారిపై ముందుగా దాడులు జరుగుతాయి.ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే తమ పౌరుల్ని సాధ్యమైనంత ఎక్కువమందిని కాపాడుకోవడానికి ఈ వ్యూహం అవలంబిస్తున్నారు. ఇప్పటి దాకా ఉక్రేయిన్ 4000 మందిని విదేశాల నుంచి రిక్రూట్ చేసుకోగా,రష్యా 18000 మందిని రిక్రూట్ చేసుకుంది. ఇవి ఇంకా సాగుతూనే ఉంటాయని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
నార్త్ కొరియా కి చెందిన ఇలాంటి కిరాయి సైనికులు మూడు వారాల్లో పదివేలమంది చనిపోయారు. ఆఫ్రికన్ దేశాల నుంచి వెళ్ళిన వారిలో కూడా కొన్ని వందల మంది మరణించినట్లు భోగట్టా. వెనిజులా నుంచి వెళ్ళిన వారిలో కొంతమంది మరణించగా,వారి బంధువులు యుక్రెయిన్ దేశం ఇస్తామన్న పరిహారం కోసం వెళ్ళగా రిక్తహస్తం చూపారు. మొదటి,రెండవ ప్రపంచ యుద్ధాల్లో ధనిక దేశాల ప్రయోజనాల కోసం మన దేశం లాంటి బడుగు దేశాలు ఎలా సైన్యం లో చేర్పించబడి ప్రాణాలు పోగొట్టుకున్నారో మనకి తెలుసు. అలాంటి సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయనడానికి ప్రస్తుతం జరుగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధమే సాక్షి అని చెప్పవచ్చు.
--- మూర్తి కెవివిఎస్

.jpg)

.jpg)
