Pages

Cinema reviews లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Cinema reviews లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జులై 2026, మంగళవారం

ఒడిస్సీ చిత్రం : ఒక పరిశీలన


క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం లో ఇటీవల వచ్చిన ఒడిస్సీ సినిమా అన్నీ ప్రధానమైన భారతీయ భాషల్లోకి అనువదింపబడి మంచి కలెక్షన్లు రాబడుతోంది. క్రీ.పూ.8 వ శతాబ్దం లో గ్రీకు కవి హోమర్ 700 పద్యాల్లో రాసిన ఒడిస్సీ అనే మహాకావ్యం యొక్క సారాంశం ఈరోజున మన దేశం లోని ప్రతి మూలకి ఈ సినిమా ద్వారా విస్తరించింది.

నూటికి నూరు పాళ్ళు ఆ కావ్యం లో ఉన్నట్లు సినిమా తీయడం అసాధ్యం. కాబట్టి కొంత స్వేచ్ఛని దర్శకుడు తీసుకున్నా తప్పుబట్టనవసరం లేదు. గతం లో అనేక సినిమాలు,వెబ్ సిరీస్ లు ఇదే కథ ని ఆధారంగా చేసుకుని వచ్చాయి.

 అయినప్పటికీ ప్రస్తుత సినిమా ప్రత్యేకత వేరు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన మహా కావ్యాలు అన్నిటి లోనూ ఒక దగ్గరితనం,పోలిక ఉంటుంది.అందుకనే అవి ఏ భాష లో వచ్చినా మనిషి మనసు ని ఆకట్టుకుంటాయి.కథానాయకుని ధీరోదాత్త గుణం, ఎన్నో కష్టాల్ని ఎదుర్కుని చివరకి విజయం సాధించడం,నమ్మిన విలువల కోసం చివరికంటా నిలబడటం ఇవన్నీ ఆయా కావ్యాల్లో అంతర్లీనం గా ఉంటాయి.

ఒడిస్సీ చూసిన చాలామంది రామాయణం కి దగ్గరగా ఉంది అనడం వినబడుతోంది. దానికి కారణం అదే. ఆ విశ్వజనీనమైన ఆకాంక్షల్ని ప్రేక్షకులు అనుభూతించడమే దాన్నికి కారణం.

కథ విషయానికి వస్తే,ఇథాకా దేశపు రాజు ఒడిస్యూస్ ట్రోజన్ యుద్ధం లో ఎన్నో మాయోపాయాలతో గెలుస్తాడు.చెక్క గుర్రం లో తన అనుచరులతో పాటు దాక్కుని తగిన సమయం లో బయటకి వచ్చి శత్రు రాజ్యాన్ని గెలుస్తాడు.

ఇదంతా ఒక ఎత్తయితే అక్కడి నుంచి మళ్ళీ తన రాజ్యానికి రావడం లో ఎన్నో పరీక్షల్ని ఎదుర్కుంటాడు.తిరిగివచ్చే క్రమం లో 20 ఏళ్ళు పడతాయి.ఈలోపు రాజ్యం లో ప్రధాన నాయకుడు కుట్ర చేసి అంతహపురం ని తన చేతిలోకి తెచ్చుకుండానికి ప్రయత్నిస్తుంటాడు. రాణి,తన కుమారుడు,పాత అనుచరులు తనని ఏ మేరకు ఆమోదిస్తారో తెలియదు.

ఇలాంటి క్లిస్ట పరిస్థితుల్లో ఒడిస్యూస్ ఏ విధం గా తన రాజ్యం లోకి ప్రవేశించాడు,ఎలా తిరిగి రాజ్యాన్ని వశపరుచుకున్నాడు అన్నదే కథ. సినిమా లో గ్రాఫిక్స్ కంటే సహజత్వానికే ప్రాధాన్యతనిచ్చారు.హీరో మాట్ డామన్ ఒడిస్యూస్ పాత్ర కి చక్కగా సరిపోయాడు.పెనెలోప్ గా అన్నా హాథవే నటించింది.

గ్రీకుల నగర రాజ్య స్వరూపాన్ని దర్శకుడు మన కళ్ళముందుంచాడు.యూరోపియన్లు గాని,అమెరికన్లు గాని,ఇతర పశ్చిమ దేశాల వారు గాని ఈ గ్రీకు కావ్యాలే జాతీయ కావ్యాల వంటివి.అయితే మన దేశం లో సైతం ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అంటే సార్వజనీన కథాంశం.చక్కని సంగీతం.హృదయాన్ని ఆకట్టుకునే సన్నివేశాలు.అన్ని వయసుల వారు హాయిగా చూడవచ్చు.  

--- మూర్తి కెవివిఎస్ 


#Odyssey #review #opinion

14, జులై 2026, మంగళవారం

ఎంతసేపు పుచ్చు పాలిటిక్స్ తప్పా కళ ని గౌరవించడం అనేది జాంతా నై

 


సుప్రసిద్ధ గాయని ఎస్.జానకి గారు జూలై 11 వ తేదీనాడు మైసూరు లోని ఓ ప్రైవేట్ వైద్యశాల లో మరణించారు. ఆమె చివరి శ్వాస మైసూరు లోనే వదలాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.అక్కడ కూడా లో ప్రొఫైల్ లోనే జీవించినట్లు తెలుస్తోంది. బాలు మరణాంతరం ఆయనకి తెలుగు రాష్ట్రాలు ఇచ్చిన గొప్ప గౌరవం తెలుసు గనక ఆ కన్నడనాడు లోనే చివరి దినాలు ఆమె గడిపారు. నిస్సందేహంగా కళాకారుల్ని గౌరవించడం లో మన తెలుగు వాళ్ళ కంటే మిగతా దక్షిణాది రాష్ట్రాలు మిన్న అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.పోయిన తర్వాత లేనిపోని రాద్ధాంతాలు చేసి, అప్పుడు కూడా పుచ్చు పొలిటిక్స్ చేసి సంతోషించే జీవులు తెలుగులు తప్పా మరెవరూ ఉండరు.  

నోటి తో కబుర్లు చెప్పడం తప్పా చేతల్లో గౌరవం ఇవ్వడం ఉండదు.మన దగ్గర గల్లీల దగ్గర్నుంచి,ఎయిర్పోర్ట్ ల వరకు అన్నీ రాజకీయ పక్షుల పేర్లే తప్పా మిగతా ఎవరి గొప్పదనాన్ని అంగీకరించం.అదే తెలుగు ప్రజల ప్రత్యేకత.బాలు పోయినప్పుడు తమిళులు గాని,జానకి గారు పోయినప్పుడు కన్నడిగుల ఆవేదన గాని కళ కి వారు ఇచ్చే గౌరవానికి మచ్చుతునక.దక్షిణాది లోని ఆ మూడు రాష్ట్రాల్లో బాలు కి ఇంకా విగ్రహాలు పెడుతూనే ఉన్నారు.అనేక నిర్మాణాలకి కూడా ఆయన పేర్లు పెడుతున్నారు.  

30, ఏప్రిల్ 2025, బుధవారం

నారాయణింటె మూణ్ణాన్ మక్కల్ (మళయాళ సినిమా రివ్యూ)

 


ఈ సినిమా ప్రస్తుతం ప్రైం అమెజాన్ లో ఉంది. ఈ సినిమా టైటిల్ అర్థం ఏమిటంటే నారాయణి యొక్క ముగ్గురు కుమారులు అని. చాలా వాస్తవికంగా, రోజువారీ మన చుట్టూ జరిగే సంఘటనలతో మంచి కథ అల్లుకుని ఒక దృశ్యకావ్యంగా చిత్రీకరించారు. ఒక చక్కని గ్రామం. తెలుసు కదా,కేరళ గ్రామాలు పచ్చదనం తో ఎంత కనువిందుగా ఉంటాయో. అలాంటి ఓ గ్రామం లో ,కొయిలాండి అనే గ్రామం లో , నారాయణి అనే వృద్ధురాలు ఉంటుంది. ఆమె చివరి దశకి వస్తుంది.అన్నీ మంచం మీదనే అనేంత అనారోగ్యం తో ఉంటుంది.

ఆమెకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఆ గ్రామం లోనే ఉన్న ఆస్తిపాస్తుల్ని చూసుకుంటూ గడుపుతుంటాడు. అతని పేరు విశ్వనాథన్.తనకి భార్య, ఓ కుమార్తె ఉంటారు. రెండవ కొడుకు సేతు ,అతను అదే ఊళ్ళో కిరాణా షాపు నడుపుతుంటాడు. ఇక మూడవ కొడుకు భాస్కరన్. మతాంతర వివాహం చేసుకుని లండన్ లో సెటిల్ అవుతాడు. తల్లి కి బాగా లేకపోవడం తో ఈ ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఆమె కోసమే భాస్కరన్ లండన్ నుంచి వస్తాడు.

వీరికి అంతకు ముందే దాదాపు అన్ని కుటుంబాల్లో ఉన్నట్లు చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి. తప్పక ఒక గూటి కింద ఉంటూంటారు. మళ్ళీ అవి సెగలు రేపుతుంటాయి.కాని రెండో కొడుకు వాటిని సరిదిద్దుతుంటాడు. భాస్కరన్ కొడుకు , విశ్వనాథన్ కుమార్తె తో ప్రేమ లో పడటం దుమారం లేపుతుంది. ఈ ఇద్దరు పిల్లలు అంతకు ముందు ఓసారి ప్రేమ లో పడి ఫెయిల్ అయి ఉంటారు. తల్లి తొందరగా మరణిస్తే తను విమానం ఎక్కొచ్చని భాస్కరన్ చూస్తుంటాడు. ఈ మధ్య కాలం లో జరిగిన సంఘటనల్ని ఫేమిలీ డ్రామా గా తీర్చిదిద్దాడు దర్శకుడు శరణ్ వేణుగోపాల్. 

ఈ సినిమా లో చెప్పుకోవలసినదేమిటంటే మన జీవితాల్లో ఎదురయ్యే వాస్తవిక ఘటనల్ని ఎలా చక్కని కథ గా మలుచుకోవచ్చు అని. ప్రత్యేకించి హీరోలు గాని విలన్లు గాని ఎవరూ ఉండరు. జీవితం లోని కొన్ని ముక్కలు ఏరి ఆసక్తిదాయకంగా మలిచారు. మళయాళీ సమాజం లోని జీవన వైఖరి ని , చక్కని లొకేషన్లు ఉన్న గ్రామం లో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సినిమాటోగ్రఫీ జ్యోతి స్వరూప్ పండా , సంగీతం రాహుల్ రాజ్ సినిమాకి తమ పనితనం తో నిండుతనం కలిగించారు. సేతు గా నటించిన జోజు జార్జ్ అదనం గా మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చు. సూరజ్, అలెన్షియర్ లే లోపెజ్ వారి పాత్రల్ని గుర్తుండిపోయేలా నటించారు.  

--- murthy

21, మే 2023, ఆదివారం

బిచ్చగాడు 2 సినిమా పై నా అభిప్రాయం

 ఒక్కమాటలో చెప్పాలంటే ఒకసారి చూడవచ్చు. మరీ సూపర్ కాదు. మరీ చెత్త అనలేము. ఎంతోకొంత లేనివాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ మీద ఓ సాఫ్ట్ కార్నర్ వచ్చేలా సినిమా తీసినందుకు విజయ్ ఆంటోనీ ని అభినందించాలి. బిచ్చగాడు మొదటి పార్ట్ లో తల్లి కొడుకు సెంట్ మెంట్ బాగా వర్కవుట్ అయింది. అలాగే అన్నీ బాగా కుదిరి సూపర్ హిట్ అయింది. అది ఇచ్చిన ఊపు లో దానికి సీక్వెల్ గా ఇది తీశారు.

అయితే దానికి దీనికి కథ పరంగా పెద్దగా పొంతన లేదు. ఇది మొత్తం కార్పోరెట్ కుటుంబం,కుట్రలు,ఇంకా ఇంకో వైపు అన్న చెల్లి సెంట్ మెంట్.విజయ్ ఆంటోనీ మరియు నాయిక కావ్య థాపర్ బాగా చేశారు.అయితే కొన్ని సన్నివేశాలు మరీ లాగదీసినట్లు అనిపించాయి.ముఖ్యంగా చిన్నప్పటి సెంట్ మెంట్ సీన్లు కొన్ని తగ్గించవలసింది. చూసేవాళ్ళకి కొద్దిగా రిలీఫ్ వుండేది.కాని చివరకి వచ్చేసరికి సెంట్మెంట్ తో కన్నీళ్ళు వచ్చేలా చేశాడు.

ప్రతి ఉన్నవాడు ఎంతో కొంత ఈ సినిమా లో చెప్పినట్లు అంత స్థాయి లో కాకపోయిన ఏంతో కొంత ఇతరుల గురించి ఆలోచించి తోచింది చేస్తే సమాజం లో చాలా బాధలు పేదవారికి ఉండవు.అది కన్విన్సింగ్ గా చెప్పిన దర్శకుడు విజయ్ ఆంటోనీ అభినందనీయుడు.ఆ కోణం లో అతడిని మెచ్చుకోకుండా ఉండలేము. బ్రెయిన్ మార్పిడి ఆసక్తి గానే ఉంది గాని కొన్ని సందేహాలు రాకమానవు. బిచ్చగాడు రిచ్ మేన్ స్టేజ్ కి వచ్చిన తర్వాత తన పలుకుబడి,డబ్బు తో తన చెల్లిని ఈజీ గా వెతికవచ్చు గదా.మళ్ళీ తను బిచ్చగాడి గా మారడం ఏమిటి అనిపిస్తుంది.

ఏది ఏమైనా ఓ సారి చూడవచ్చు.సంగీతం,ఎడిటింగ్,నిర్మాత,దర్శకత్వం ఈ బాధ్యతల తో బాటు హీరో గా కూడా నటించి విజయ్ ఆంటోనీ కొంత మేరకు విజయవంతం అయ్యాడనే చెప్పాలి.దేవ్ గిల్,రాధా


రవి ఇంకా ఇతరులు బాగా చేశారు.డైలాగులు కూడా ఫర్లేదు.నిడివి కొన్ని చోట్ల తగ్గిస్తే సినిమా ఇంకా హిట్ అయ్యి ఉండేది.చివరి సన్నివేశాల్లో కన్నీళ్ళు రాని ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.    


15, మే 2023, సోమవారం

పొన్నియన్ సెల్వన్-2 సినిమా పై నా అభిప్రాయం

 మొత్తానికి నిన్ననే చూశాను "పొన్నియన్ సెల్వన్-2" మొదటి పార్ట్ తో పోల్చితే మరీ అంత బోరు గా అనిపించలేదు. కట్టు కథల్ని అయితే అటుది ఇటు మార్చి గూస్ బంప్స్ వచ్చేలా ఏదో తీయచ్చు.కాని చరిత్ర కథ. ఇష్టం వచ్చినట్టు తీయడం కుదరదు.కొన్ని లిమిట్స్ ఉంటాయి ఊహలకి కూడా. అలా సర్దుకు పోవాలి. అందునా తమిళ సగటు పాఠకుడి కి కూడా ఎంతో కొంత చోళుల చరిత్ర తెలుసు.

కొన్ని తమిళ యూట్యూబుల్లో ఈ సినిమా మీద ఆధారపడి ఇంటర్వ్యూలు గట్రా బాగా వచ్చాయి.ఒక్కొకళ్ళది ఒక్కో వెర్షన్. భారతీ రాజా లాంటి దర్శకుడు కూడా ఓచోట, అయ్యా మణిరత్నం గారు మీకు సంస్కృతం అంటే ఎందుకు అంత మోజు..? చోళులు దైవ స్త్రోత్రాల్ని కూడా అచ్చ ప్రాచీన తమిళం లోనే రాశారు,రాయించారు గదా అంటూ ఓ చురక వేశాడు. అట్లా తమిళ సమాజం లో చాలా చర్చ సినిమా బయట కూడా జరిగింది. డబ్బింగ్ చేయడం లో ఒరిజినాలిటి కొంత పోవడం సహజమే గదా.

సాహిత్యం,సంగీతం,శిల్ప శాస్త్రం,సముద్రం పై పయనించి దండయాత్రలు చేయడం,ఇలా ఎన్నో విషయాల్లో తమిళుల పై ప్రభావం చూపారు.ఇంకా చూపుతూనే ఉన్నారు.భావ పరం గా. ఆ మనసుల్లో ఉన్న బరువు మనకి తెలియదు. కాబట్టి మనకి చోళులు అంటే అనేకమంది రాజుల్లో వాళ్ళూ ఒకరు.అంతే కాదు,చోళులు,పాండ్యులు వీళ్ళని ఓన్ చేసుకునే కులాలు కొన్ని తమిళనాడు లో ఉన్నాయి.వాళ్ళ గొడవ వాళ్ళది.రకరకాల ఆధారాలు చూపిస్తూ మా వాళ్ళని చూపించవలసింత గా చూపించలేదని.

 శ్రీ లంక లో చనిపోయాడనుకున్న అరుళ్ మొళి వర్మ రక్షింపబడటం దగ్గరనుంచి ఈ సినిమా లో కథ మొదలు అవుతుంది. సుందర చోళుడు కూడా రక్షింపబడతాడు.వీళ్ళిద్దర్నీ సేవ్ చేసినవారు నందిని యొక్క తల్లి.

ఓ సీక్రెట్ రివీల్ అయింది.కరికాళుడు చనిపోవడాన్ని స్పష్టం గాచూపించలేదు.చరిత్ర పరంగా కూడా ఆయన మరణం ఎలా జరిగింది అనేది ఎవరికీ తెలియదు.రాష్ట్రకూటుల కుట్ర యత్నాలు అదనం గా దీనిలో చూడవచ్చు.అప్పుడూ,ఇప్పుడూ అధికారం దగ్గరకి వచ్చేసరికి దగ్గర వాళ్ళతోనే అసలైన గొడవలూ,కుతంత్రాలు.అవి బాగా చూపించారు.మణిరత్నం చాలా సీన్లని చాలా Subtle గా ప్లే చేశాడు దాన్ని తమిళ ఆడియన్స్ బాగా ఆస్వాదన చేస్తారు. చివరకి మధురాంతకుడికి కిరీటం ఇవ్వడం,ఆ తర్వాత 13 ఏళ్ళకి అరుళ్ మొళి వర్మ (రాజరాజ చోళుడు) రాజ్యానికి రావడం జరిగిందని చెప్పి సినిమా ముగిస్తారు.

 చారిత్రక నవలని సుందరమైన దృశ్య కావ్యం గా తీసిన మణిరత్నం అభినందనీయుడు. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం బావుంది.సినిమాటోగ్రఫీ గొప్ప అస్సెట్. నటీ నటులు అందరూ జీవించారు.వాళ్ళు మిగతా ఎన్ని సినిమాల్లో నటించినా ఆ పాత్రలు మాత్రం నిలిచిపోతాయి.ముందే చెప్పా,ఇది తమిళుల నేల మరియు ఉద్వేగానికి సంబందించిన సినిమా.ఆ పరం గా గొప్ప విజయం. మిగతా అన్ని భాషల వారికి ఇది చేరగలగడం మాత్రం బోనస్.అంతే.