ఈ సినిమా ప్రస్తుతం ప్రైం అమెజాన్ లో ఉంది. ఈ సినిమా టైటిల్ అర్థం ఏమిటంటే నారాయణి యొక్క ముగ్గురు కుమారులు అని. చాలా వాస్తవికంగా, రోజువారీ మన చుట్టూ జరిగే సంఘటనలతో మంచి కథ అల్లుకుని ఒక దృశ్యకావ్యంగా చిత్రీకరించారు. ఒక చక్కని గ్రామం. తెలుసు కదా,కేరళ గ్రామాలు పచ్చదనం తో ఎంత కనువిందుగా ఉంటాయో. అలాంటి ఓ గ్రామం లో ,కొయిలాండి అనే గ్రామం లో , నారాయణి అనే వృద్ధురాలు ఉంటుంది. ఆమె చివరి దశకి వస్తుంది.అన్నీ మంచం మీదనే అనేంత అనారోగ్యం తో ఉంటుంది.
ఆమెకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఆ గ్రామం లోనే ఉన్న ఆస్తిపాస్తుల్ని చూసుకుంటూ గడుపుతుంటాడు. అతని పేరు విశ్వనాథన్.తనకి భార్య, ఓ కుమార్తె ఉంటారు. రెండవ కొడుకు సేతు ,అతను అదే ఊళ్ళో కిరాణా షాపు నడుపుతుంటాడు. ఇక మూడవ కొడుకు భాస్కరన్. మతాంతర వివాహం చేసుకుని లండన్ లో సెటిల్ అవుతాడు. తల్లి కి బాగా లేకపోవడం తో ఈ ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఆమె కోసమే భాస్కరన్ లండన్ నుంచి వస్తాడు.
వీరికి అంతకు ముందే దాదాపు అన్ని కుటుంబాల్లో ఉన్నట్లు చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి. తప్పక ఒక గూటి కింద ఉంటూంటారు. మళ్ళీ అవి సెగలు రేపుతుంటాయి.కాని రెండో కొడుకు వాటిని సరిదిద్దుతుంటాడు. భాస్కరన్ కొడుకు , విశ్వనాథన్ కుమార్తె తో ప్రేమ లో పడటం దుమారం లేపుతుంది. ఈ ఇద్దరు పిల్లలు అంతకు ముందు ఓసారి ప్రేమ లో పడి ఫెయిల్ అయి ఉంటారు. తల్లి తొందరగా మరణిస్తే తను విమానం ఎక్కొచ్చని భాస్కరన్ చూస్తుంటాడు. ఈ మధ్య కాలం లో జరిగిన సంఘటనల్ని ఫేమిలీ డ్రామా గా తీర్చిదిద్దాడు దర్శకుడు శరణ్ వేణుగోపాల్.
ఈ సినిమా లో చెప్పుకోవలసినదేమిటంటే మన జీవితాల్లో ఎదురయ్యే వాస్తవిక ఘటనల్ని ఎలా చక్కని కథ గా మలుచుకోవచ్చు అని. ప్రత్యేకించి హీరోలు గాని విలన్లు గాని ఎవరూ ఉండరు. జీవితం లోని కొన్ని ముక్కలు ఏరి ఆసక్తిదాయకంగా మలిచారు. మళయాళీ సమాజం లోని జీవన వైఖరి ని , చక్కని లొకేషన్లు ఉన్న గ్రామం లో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సినిమాటోగ్రఫీ జ్యోతి స్వరూప్ పండా , సంగీతం రాహుల్ రాజ్ సినిమాకి తమ పనితనం తో నిండుతనం కలిగించారు. సేతు గా నటించిన జోజు జార్జ్ అదనం గా మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చు. సూరజ్, అలెన్షియర్ లే లోపెజ్ వారి పాత్రల్ని గుర్తుండిపోయేలా నటించారు.
--- murthy
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి