Pages

9, మార్చి 2019, శనివారం

118 సినిమా పై ఓ రివ్యూ


కె.వి.గుహన్ కొత్తదనం కోరుకునే దర్శకుడని ఈ సినిమా చూసిన వారికి అనిపిస్తుంది.ఇప్పటికే చాయాగ్రాహకునిగా పేరు తెచ్చుకున్న తను ఈ సినిమా తో దర్శకుని గా అరంగేట్రం చేశాడు.కధ పరం గా ఒక్క మాట లో చెప్పాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ గా చెప్పాలి.అయితే స్క్రీన్ ప్లే తో చేసిన మాయాజాలం వల్ల సీటు లోనుంచి ప్రేక్షకుడు లేవలేడు.కెమేరా పనితనం నీటుగా ఉంది.కల ఆధారం గా విలన్ లని పట్టించే వైనం కొంత అదోలా అనిపించినా క్రమేపి కన్విన్సింగ్ చూపెట్టాడు.కళ్యాణ్ రాం నటన కూడా పాత్ర కి తగినట్లుగా ఉంది.సంగీతం బాగుంది.హీరోయిన్ నివేదా థామస్ ఎక్కువ మార్కులు కొట్టేసింది.ఆమె స్నేహితురాలిగా చేసినామె ఎస్తేర్ గా బాగుంది.

ఎంత బాగున్నా కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి.ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మరీ అంత ఫైటర్ అవ్వ వలసిన అవసరం ఉందా అనే సందేహం రావచ్చు.సీనియర్ నటుడు నాజర్ కొన్ని సన్నివేశాల్లో అతి గా నటించడం చికాకు పుట్టిస్తుంది.అయితే అతని పాత్ర పెద్ద గ లేకపోవడం మంచిదయింది.ఓవరాల్ గా ఒకసారి చూడవచ్చు.సస్పెన్స్ ని కొనసాగించడం లో మంచి ఊపు వచ్చింది.అనవసరమైన డాన్స్ లు ఎక్కువ గా లేకపోవడం ఓ ఊరట.షాలిని పాండే గ్లామర్ అంశాలకి ఉపయోగపడింది.వీలయితే ఓ మారు చూడవచ్చు. 

15, జనవరి 2019, మంగళవారం

"ఎన్ టి ఆర్ కధానాయకుడు" సినిమా పై ..నా రివ్యూ!



రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తాయి ఈ సినిమా మీద.చూద్దాం అని చెప్పి ఈ రోజు వీలు చేసుకొని చూశా.మరీ అంత చెత్త గా లేదు అలాగని నభూతో నభవిష్యతి లాగానూ లేదు.బాలకృష్ణ నటించిన బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు.ఆ కాలం లోకి తీసుకెళ్ళడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.కీరవాణి సంగీతం ప్రాణం పోసిందని చెప్పాలి.అయితే రాముడు మంచి బాలుడు లాగా మొదటినుంచి చివరి దాకా మితి మీరిన పొగడ్తలు,పైకి ఎత్తే కార్యక్రమం కూడా సినిమా సన్నివేశాల్లో అడ్డూ ఆపూ లేకుండా సాగింది.కొన్నిసార్లు అది చికాకు కూడా కలిగిస్తుంది.

ఎన్ టీ ఆర్ గొప్ప నటుడు ,దానిలో సందేహం లేదు.కాని ఆ స్థాయికి తను చేరడం లో అతని సోదరుడు త్రివిక్రమ రావు పాత్ర చాలా గణనీయమైనది బయట అందరకీ తెలుసు.ముఖ్యంగా ఎన్ టీ ఆర్ కి పోటీ గా ఎదిగే నటులని అణచి వేయడం లో ఆయన పాత్ర ఉందని అంటారు.ఇక్కడనే కాదు కన్నడం లో రాజ్ కుమార్ సూపర్ స్టార్ అయినా దాని వెనుక కీలక పాత్ర పోషించింది అతని సోదరుడే.అసలు ఏ వ్యక్తి అలాంటి ఒక టాప్ పోజిషన్ లోకి వెళ్ళినా దానికి సహకరించే యోధులు తెరవెనుక తమ పాత్ర పోషించడం వల్లనే.

రాజకీయ క్షేత్రం లో ఎన్ టీ ఆర్ దెబ్బతినడం దానివల్లనే.ఆవేశం,గ్లామర్ ,మాటకారితనం వీటికి మించి రాజకీయం లో ఇంకా కొన్ని లక్షణాలు ఉండాలి.అవన్నీ పుష్కలం గా ఉండబట్టే చంద్రబాబు మాయావ్యూహం లో చిక్కుకుని అమర్యాదకరమైన రీతి లో మరణించాడు.మన తెలుగు వాళ్ళ తో చిక్కు ఏమిటంటే బయో పిక్ అంటే తీస్తే సూపర్ మేన్ లా తీస్తారు.లేదా పరమ దుర్మార్గం గా తీస్తారు.ఎంత గొప్ప మనిషి అయినా అతనికి మంచి,చెడు అనే రెండు కోణాలు ఉంటాయి.అది అర్ధమయ్యి తీసే రోజు ఎప్పడొస్తుందో చూద్దాం.  

30, డిసెంబర్ 2018, ఆదివారం

ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే తెలంగాణా రాష్ట్రం లో కమ్మ కులానికి గడ్డు కాలం ఎదురైంది.

BLF అనగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని అట.విచిత్రం ఏమిటంటే దీనికి హెడ్ గా ఉండేవ్యక్తి మాత్రం ఉన్నత కులానికి చెందిన తమ్మినేని వీరభద్రం.ఇది ఎక్కడి గోల..జనాన్ని అంత తక్కువ అంచనా వేస్తున్నారా అని అనుమానం వచ్చింది. పైగా ఈయన కమ్మ్యూనిస్ట్.ఏ రోజునైనా ఇలాంటిది ఊహించామా..?కాని జనం మాత్రం చాలా తెలివైన వాళ్ళు. అందుకనే ఒక్క అభ్యర్దిని కూడా గెలిపించలేదు,మొన్న తెలంగాణా అసెంబ్లీ నుంచి..! 

ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే తెలంగాణా రాష్ట్రం లో కమ్మ కులానికి గడ్డు కాలం ఎదురైంది.ఒక్క ఖమ్మం జిల్లాలో తప్ప మిగతా తెలంగాణా లో  అన్ని జిల్లాల్లో ఆ సామాజిక వర్గం కి బలం లేకుండా పోయింది.కాబట్టి బి.సి.ల తో కలిసి ముందుకి వెళ్ళవలసిన అగత్యం ఆ వర్గానికి దాపురించింది.అయినా సరే..నాయకత్వం  మిగిలిన బి.సి.లకి ఇచ్చే ఉద్దేశ్యం వారికి లేదు.అందుకే తమ్మినేని ని ముందు పెట్టింది.అయితే తెలంగాణా ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు. ఫలితం చూశారుగదా ఎలా వచ్చిందో..!   

23, డిసెంబర్ 2018, ఆదివారం

"అంతరిక్షం" సినిమా రివ్యూ..!

అంతరిక్షం సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం పంచుకోవాలని రాస్తున్నాను.హాలీవుడ్ నుంచి వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీస్ తో పోల్చుకోకుండా చూస్తే ఒక తెలుగు సినిమా గా దీన్ని అభినందించవలసిందే.ఎంతో కొంత కొత్తదనం చూపించాలనే తపన తెలుగు సినిమా జనాల్లో వస్తున్నందుకు ఇది ఒక శుభ సూచకమే.మొదటి పార్ట్ కొద్ది గా బోర్ అనిపించింది.ఆ తర్వాత ఇంటర్వెల్ నుంచి అసలు కధ లోకి వచ్చి ఫరవాలేదనిపించింది.పిల్లలు,యువతరం లో మంచి ఆలోచన ని రేకెత్తించే సినిమా.సాంకేతికం గా కొన్ని లోటు పాట్లు ఉన్నా ఈ మాత్రం టెంపో ని రేకెత్తించడం ,అదీ ఇలాంటి డ్రై కధ తో ..అది చెప్పుకోవలసిన అంశమే.

వరుణ్ తేజ్ నటన లో తనదైన ఈజ్ చూపించినా డైలాగ్ డెలివరి కొన్ని చోట్ల అర్ధం కాలేదు.సంగీతం ఓ మాదిరి గా ఉంది.ఆదితి హైదరి ఇంకా రెహమాన్ లాంటి వాళ్ళు పాత్రోచితం గా నటించారు.డైలాగ్స్ లో ఇంగ్లీష్ పాలు బాగా ఎక్కువ అయింది.కొన్ని సాంకేతిక విషయాలు,ఆసక్తికరమైనవి తెలుగు లో అర్ధమయ్యేట్లు చెబితే ఇంకా బాగుండేది.

11, డిసెంబర్ 2018, మంగళవారం

టి ఆర్ ఎస్ ని గెలిపించిన టి డి పి,కాంగ్రెస్ లు..!


వినడానికి అదోలా అనిపించవచ్చు గాని ఈ సారి జరిగింది అదే..!నేను ఓ సగటు పౌరుడిని.ఏ పార్టీ మీద వీర భక్తి గాని ఆరాధన గాని నాకు లేదు.నిజానికి ఈసారి తెరాస పార్టీ అధికారం లోకి వచ్చినా హంగ్ లాగా ప్రభుత్వం వస్తుందని అనుకున్నాను.కాని మహాకూటమి రూపం లో జతలు కట్టిన ఆయా పార్టీల్ని చూసి తెరాస మీద సగటు పౌరునికి ఒక జాలి లాంటిదే కలిగింది.ఇన్ని కలిసి ఓ పార్టీని టార్గెట్ చేస్తున్నాయంటే తప్పనిసరి గా కెసియార్ నాయకత్వం బలమైనదే అనే ఊహ జనం లో కలిగింది.ఇంకా తెలంగాణా సగటు పౌరుని విచాక్షణా శక్తి ని చంద్ర బాబు అండ్ కో తక్కువ అంచనా వేశారు.లేకపోతే సుహాసిని ని నిలబెట్టి హరి కృష్ణ మరణం సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలని చూడటం ఏమిటి..?పచ్చి చవకపారుతనం కాకపోతే..!వంశాల పేరు చెప్పి తొడలు గొట్టి బాలకృష్ణ లాంటి వాళ్ళు ఓట్లు అడిగితే అసలు వెయ్యాలి అనుకొనేవాడు కూడా వెయ్యడు.ఆంధ్రా లో ఉన్నంత కుల బానిసత్వం తెలంగాణా లో ఉండదు.అది గ్రహించలేక పోయారు.

ప్రస్తుతం తెదేపా తెలంగాణా లో ముగిసిన చరిత్ర.అది ఒప్పుకోనందుకే తెలంగాణా ప్రజలు ఘోరమైన ఓటమి ని చవి చూపించారు. కాంగ్రెస్ కి ఫైనాన్స్ చేసి మరీ తెలంగాణా లో తిష్ట వెయ్యాలని చూసే బాబు రేపు అధికారం లోకి కాంగ్రెస్ వచ్చినా ప్రాజెక్ట్ ల విషయం లో తెలంగాణా కి అన్యాయం చేస్తాడని ఒక మెసేజ్ పంపడం లో తెరాస సక్సెస్ అయింది.అది బాంబు లా పేలింది.పైగా తెలంగాణా లోని ప్రతి అభివృద్ది పని తానే చేశానని కాబట్టి నాకు రైట్ ఉంది చచ్చినట్టు ఓటు వేయండి అని ధోరణి లో మాట్లాడడం ఓటర్లకి చిర్రెత్తించింది.సోషల్ మీడియా అనేది రావడం తో సొంత గప్పాలు కొట్టే పత్రికల్ని ఇప్పుడు జనాలు నమ్మడం మానేశారు అనేది కూడా ఈ ఎన్నికల ద్వారా తెలిసింది. 

19, ఆగస్టు 2018, ఆదివారం

తెలంగాణా ప్రభుత్వం 25 కోట్లు విరాళం గా ప్రకటించడం కొంత అతి గానే ఉంది.

కేరళ లో వచ్చిన వరదలు భీబత్సమైనవే.కాదనడం లేదు.కాని తెలంగాణా ప్రభుత్వం 25 కోట్లు విరాళం గా ప్రకటించడం కొంత అతి గానే ఉంది.దేశం లోనే వాణిజ్య రాజధాని గా పేరుబడి ఉన్న ముంబాయి ని కలిగి ఉన్న మహారాష్ట్ర యే 20 కోట్లు విరాళం ప్రకటించింది.అలాగే ఢిల్లీ మరో సూపర్ వాణిజ్య కేంద్రం ..వాళ్ళూ 10 కోట్లు ప్రకటించారు.మిగతావాళ్ళు 10,5,2 కోట్ల చొప్పున ప్రకటిస్తూ పోయారు.ఇలాంటి అప్పుడు సాధ్యమైనంత దాకా కేంద్రమే దెబ్బ తిన్న రాష్ట్రాన్ని ఆదుకుంటుంది.అది సహజంగా జరగాలి. 

గతం లో అంటే 1999 లో ఒరిస్సా లో తుఫాను ఇంకా వరదల భీబత్సానికి దాదాపు 30 వేల మంది దాకా చనిపోయారు.దివిసీమ లో వరదలప్పుడూ దాదాపు గా ఆ సంఖ్య కి మించే చనిపోయారు.అయితే అధికారికంగా వేలల్లోనే చావులు జరిగాయి.అలాంటప్పుడు గాని ,ఆ తర్వాత వచ్చిన వరదలప్పుడు గాని (ఏ రాష్ట్రం లో గాని) కేరళ రాష్ట్రం ఎప్పుడూ లక్షల్లో నే తప్ప కోట్ల లో ఎప్పుడూ విరాళం ఎవరికీ ఇచ్చినట్లు గుర్తు లేదు.

మన తాహతు చూసుకునే దానాలు ఇవ్వాలి తప్పా ఏదో గొప్పలు కోసం ఇవ్వకూడదు.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి.ఇంకా అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉన్నాయి.అవన్నీ ఎవరి నెత్తిన చివరకి పడేది..అది ఆలోచించాలి. 

27, జూన్ 2018, బుధవారం

రమణానంద మహర్షి కధ ఏమిటి..?



ఇటీవల కొన్ని రోజుల క్రితం ఫేస్ బుక్ లో రమణానంద మహర్షి ఫోటోలు చూసి ఆశ్చర్య పోవడం జరిగింది.ఏదో దేశం లో బీచ్ లో పడక మంచం లాటి దాని పైన ఓ ఫోజు తో,షార్ట్స్ లో ఓ ఫోజు తో ఇలా యమా ఆధునిక రీతి లో దిగిన ఫోటోలు నివ్వెర పోయేట్లు చేశాయి.సరే..అవి వేసుకోవద్దని ఎవరూ అనట్లేదు గాని..విభూతి బోట్లు పెట్టుకొని కాషాయం కట్టుకొని ..శక్తి పాతం ఇస్తా అదీ ఇదీ అంటూ మీటింగ్ లు గట్రా పెట్టి బ్రాంచ్ ల వారీ గా వసూళ్ళు చేస్తూ తరించే ఈ మనిషి ఉన్నట్లుండి ఇలా దర్శనం ఇవ్వడం కొద్ది గా షాక్ పుట్టించింది.ఈ మహానుభావుడి ప్రసంగాన్ని ఓ సారి అనుకోకుండా విని ఇక మీదట ఎప్పుడూ ఈ యన గారి మీటింగ్ కి ఎంతమాత్రం రాకూడదని అనుకున్నాను.

అసలు మహర్షి అనే పదాన్ని పేరు లో పెట్టుకోడానికి ఎంత ధైర్యం..?రమణ మహర్షి లాంటి వారే తనని తాను మహర్షి అని ఎప్పుడూ చెప్పుకోలేదు.ఆ తర్వాత ఆయన శిష్యులు అలా పిలిచారు.అది స్థిరపడిపోయింది.ఈ నయా మహర్షి ప్రసంగం వింటే అనిపించింది ఏమిటంటే యోగం గురించి గాని,ఆధ్యాత్మిక విషయాల గురించి గాని ఈయనకి తెలిసింది శూన్యం.అయితే వాచాలత ఎక్కువ.వెనకది ముందుకి ముందుది వెనక్కి చెప్పి మాటల గారడి చేస్తుంటాడు.పైగా శక్తి పాతం ఇవ్వడం అంత తేలికా..?మరీ వెర్రివాళ్ళను చేయడం కాకపోతే..!జనానికి ఇలాంటి అంశాల మీద పెద్దగా అవగాహన లేకపోవడం తో ఇలాంటి ఆషాఢభూతులు ఆడింది ఆటగా సాగిపోతోంది.

నిజంగా యోగసాధన లో పురోగమించిన వారి ధరణి యే వేరు గా ఉంటుంది.సంస్కృతమే మాటాడనవసరం లేదు.సామాన్యమైన మాటల్లో చెప్పినా దాని పరిమళాలు గుండెల్లో తాకుతాయి.ఈ రమణానంద కి విపరీతమైన వాగాడంబరమే తప్పా తెలుగు కూడా వంకర టింకర గా మాటాడుతుంటాడు.చదువు వల్ల వచ్చే సంస్కారం గాని సాధన వల్ల వచ్చే సంస్కారం గాని ఈ వ్యక్తి లో మచ్చుకి కనిపించవు.కాని ఇంత బిజినెస్ ఎలా అభివృద్ధి చేశాడో భక్తి పేరు తో...మార్కెటింగ్ టెక్నిక్స్ బాగానే ఉన్నాయి ఈ లెక్కన..!