Pages

20, ఫిబ్రవరి 2025, గురువారం

కాకి ని తక్కువ అంచనా వేస్తున్నారా ?

కాకి ని తక్కువ అంచనా వేస్తున్నారా ?

-------------------------------------------------


 కాకి ని చూడని వారు అంటూ బహుశా ఎవరూ ఉండరు. కాకి మీద ఎన్నో సామెతలు ఉన్నాయి. ఆ పక్షి మన పిట్టగోడ మీద నుంచి అరిస్తే చాలు ఈరోజు మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నట్లు భావిస్తాం. అంతే కాదు,పితృ దేవతలకి మనకి సంధానకర్త గా అనుకోవడం కద్దు. మనం పెట్టిన పిండం కాకి ముట్టకపోయినట్లయితే పై లోకం లో ఉన్న పెద్దలు మనపై కోపం గా ఉన్నారేమో అనుకుంటాం. ఇవన్నీ నిజమా,కావా అన్నది అటుంచితే కాకి తో మానవుడి జీవితం ఎంతగా పెనవేసుకుపోయిందో ఈ ఉదంతాలు తెలుపుతాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత గల ఆ జీవులు గూర్చి కొంతైన తెలుసుకోవాలి. కాకులు మంద లోనూ, ఒంటరి గానూ జీవిస్తాయి. వీటి జీవిత కాలం రమారమి ఇరవై ఏళ్ళు.

ఇవి మనుషుల మొహాల్ని బాగా గుర్తుంచుకోగలవు. దాదాపు అయిదేళ్ళ పాటు గుర్తుంచుకుంటాయంటే ఆశ్చర్యం గా లేదూ!ఏడు ఏళ్ళ పిల్లలకి ఉండేంత తెలివి వీటికి ఉంటాయి.అంటే ముఖ్యం గా సమస్య ని పరిష్కరించుకోవడం లో,కమ్యూనికేట్ చేయడం లో కాకి కి ఉండే నైపుణ్యం ఆ స్థాయి లో ఉంటుంది. దాని మెదడు లో కూడా మనకి మల్లే  చిక్కగా అల్లుకుని ఉండే న్యూరాన్లు ఉంటాయి. మనుషులు చేసే మంచి పనులు,చెడ్డ పనులు కూడా అవి గుర్తు పెట్టుకోగలవు. అంటే కాకి కి మీరు అన్నం పెట్టినా,ప్రేమ గా చూసినా అవి మిమ్మల్ని చాలా కాలం గుర్తుంచుకుంటాయి. మీకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తాయి.

మీరు గనక వాటి పిల్లల కి రాళ్ళు వేసినా లేదా వాటి గూడు కి దగ్గరగా వెళ్ళినా, పాడు చేసినా మిమ్మల్ని గుర్తు పెట్టుకుని తగిన గుణపాఠం కూడా చెబుతాయి. అప్పుడప్పుడు పేపర్ల లో చదువుతుంటాం. కాకి పగబట్టి వేధిస్తున్నదని,బయటకి వచ్చినప్పుడల్లా కాళ్ళతో నెత్తి మీద తన్ని పోతున్నాయని ఆవేదన తో ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు కూడా ఉన్నారు.   

మరి అలాంటి సమయం లో ఏం చేయాలి అంటే మనం ఉండే ప్రదేశాన్ని గాని, ఊరిని గాని మార్చడమే చేయగల పని. అంతే తప్పా వేరే దారి లేదు. ఒక్కోసారి కాకులు బాగా అరుస్తుంటాయి. రొద పెడుతుంటాయి. వాటిలో వాటికి కోపం వచ్చినప్పుడు  లేదా ఇతర సంగతుల్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి అలా అరిచి గోల చేస్తుంటాయి. రాత్రి పూట ఆలశ్యంగా గూళ్ళకి వచ్చిన కాకులు చెట్టు కి కింద ఉన్న కొమ్మల మీద కి వెళ్ళవలసిందిగా మిగతా వాటిని అడుగుతుంటాయి.అవి మనకి గోల గా అనిపించడం సహజమే.

సాధారణం గా కాకులు మర్రి చెట్ల మీద,ఇతర పెద్ద చెట్ల మీద, తోటల్లో నివసిస్తాయి.పండ్లను,చిన్న పురుగుల్ని,ధాన్యాల్ని,చేపల్ని తింటాయి. కోడి పిల్లల్ని ఎత్తుకుపోతుంటాయి. ఇతర పక్షుల గూళ్ళని పాడు చేసి వాటి గుడ్లని కూడా తినేస్తాయి.మనం వాటికి ఏదైనా ఆహారం వేసినా గుర్తు పెట్టుకుని అవి మనల్ని విష్ చేస్తాయి.అయితే వాటి భాష మనం అర్థం చేసుకోలేము కనక పట్టించుకోము. ఏ కాకి అయినా మనల్ని చూసి తల ని బౌ చేసినట్లుగా ఊపితే థాంక్యూ అని అర్థం అన్న మాట. అంతే కాదు, వాటికి బాగా నచ్చినట్లయితే కొన్ని బహుమతుల్ని కూడా మనకి ఇస్తుంది. రంగు రంగుల చిన్న రాళ్ళు,మెరిసే ఆకులు ఇలాంటి వాటిని మనకి దగ్గర్లో పారేసి పోతుంది. చూశారా, మనం రోజూ చూసే కాకి వెనుక ఎంత కథ ఉన్నదో !     


19, జనవరి 2025, ఆదివారం

Game Changer సినిమా గురించి రెండు ముక్కలు


 Game changer  ఏం చేంజ్ చేశాడో అని వెళ్ళాను. తెలుగు సినిమా కథ పెద్దగా ఏం మారలేదు. కాకపోతే పొలిటికల్ మాయా మంత్రాలు ,వాటిని తెలివి గా తనకి అనుకూలంగా మార్చుకునే బ్యూరోక్రాట్. అసలు ఇది ఇప్పట్లో సాధ్యమా ? మనం చూస్తూనే ఉన్నాం...ఎంత గొప్ప సివిల్ సర్వెంట్ అయినా రాజకీయ వ్యవస్థ కి మడుగులు ఒత్తవలసిందే లేదా వాళ్ళని జైల్లోకి పంపించి లేదా కేసుల్లో ఇరికించే రోజులు ఇవి. ఎన్ని రాష్ట్రాల్లో చూడటం లేదూ? అలాంటిది ...కొద్దిగా అయినా వాస్తవానికి దగ్గరగా ఉండద్దా..?

సినిమా ని సినిమా గా చూడాలి.ఈకలూ పీకలూ ఇలా లాగితే ఎట్లా అనేవాళ్ళూ మనపక్కనే ఉంటారు. అలా చూస్తూ పోతే బాగా డబ్బులు ఖర్చు పెట్టి పాటల్ని రిచ్ గా తీసిన సినిమా గా తోచింది. ఒక్క పాటా గుర్తు ఉండదు.అది వేరే మాట.ఈ బోటి దానికి కార్తీక్ సుబ్బరాజ్ కథ,శంకర్ డైరెక్షన్ ఏంటో వాళ్ళ గత సినిమాలకి దీనికీ పొంతనే లేదు. హీరోయిన్ అందాల ఆరబోత షరా మామూలే. మామూలు మషాళా సినిమా కొద్ది పాటి తేడాలతో, అని చెప్పాలి.

ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు.ఇంతే సంగతులు.చిత్తగించవలెను.     

13, జనవరి 2025, సోమవారం

థాయ్ లాండ్ లోని మరో కోణం

 థాయ్ లాండ్ లోని మరో కోణం


ఇటీవల థాయ్ లాండ్ వెళ్ళే పర్యాటకులు బాగా పెరిగారు. గత ఏడాది మన దేశం నుంచి 12,55,358 మంది ఆ దేశాన్ని సందర్శించారు.ఆ దేశం లో లభించే విహార,వినోద కార్యక్రమాలు నచ్చడం తో వెళ్ళిన వాళ్ళే వెళుతుండడం గమనించవచ్చు. చక్కని బీచ్ లు, రాత్రి పూట విందులు,అబ్బురపరిచే గతకాలపు నిర్మాణాలు ఇలాంటివి అన్నీ ఆ దేశానికి వెళ్ళేలా చేస్తున్నాయి. అన్నిటికీ మించి అందర్నీ నవ్వుతూ పలకరించే థాయ్ ప్రజల స్వభావం మరింతగా ఆకట్టుకునే అంశం. మన గోవా లో జరిగే టూరిస్టుల దోపిడి అక్కడ లేదు.టాక్సీలు,హోటల్స్ ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.దానివల్ల కూడా మన వాళ్ళు థాయ్ లాండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ఆ దేశం 59.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని టూరిజం వల్ల పొందగలిగింది.


పట్టాయ, ఫుకెట్, బ్యాంకాక్ నగరాలు అనేక సౌకర్యాల్ని టూరిస్ట్ లకి అందిస్తున్నాయి. పట్టాయ లో 24 గంటలు సందడిగానే ఉంటుంది. నిద్రపోని ప్రదేశం అని దీన్ని పిలుస్తారు.ఫుకెట్ గూర్చి చెప్పాలంటే అందమైన బీచ్ లు,సాహసోపేత క్రీడలకి నిలయం. ఇంకా కొన్ని ఆసక్తికరమైన పట్టణాలున్నాయి. మన దేశం నుంచి రమారమి ఫ్లైట్ ద్వారా నాలుగున్నర గంటల ప్రయాణం ,కనుక ఏ మాత్రం ఖాళీ దొరికినా చాలామంది వెళ్ళివస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే థాయ్ లాండ్ కి మన దేశానికి ఉన్న మరో కోణం ఏమిటంటే ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఉన్న సాంస్కృతిక అనుబంధం. దీన్ని మరి ఎంత మంది పట్టించుకుంటున్నారో తెలియదు గానీ కొన్ని విశేషాలు ఇక్కడ చెప్పక తప్పదు.


థాయ్ లాండ్ రాజవంశం ఇప్పటికీ తాము రాముని వారసులు గా పరిగణించుకుంటుంది. రామా అనే బిరుదు తో వారి కి అభిషేకం జరుగుతుంది. ప్రస్తుతం రామా - 10 గా పరిగణింపబడే వాజీరా లాంగ్కోర్న్ 2019 లో రాజు గా అభిషిక్తుడయ్యాడు. బ్రిటన్ లో మాదిరి గానే ఇక్కడి రాజవంశానికీ సంప్రదాయపరమైన గౌరవం లభిస్తుంది. ప్రపంచం లోని ధనిక కుటుంబాల్లో ఒకటి. రాజు కి అభిషేక కార్యక్రమాల్ని నిర్వహించే వారిని బ్రాం లువాంగ్ లుగా పిలుస్తారు.వీరు ఒకానొక కాలం లో భారత దేశం నుంచి వచ్చిన బ్రాహ్మణులుగా వాళ్ళు భావించుకుంటారు. రామాయణాన్ని థాయ్ రామాకియాన్ అనే పేరు తో వ్యవహరిస్తారు. హనుమంతుని శిల్పాలు అనేక చోట్ల కనిపిస్తాయి.శక్తికి,విజయానికీ గుర్తుగా ఆయన పేరు ని చెబుతారు.


ఇక్కడి సాహిత్యం లో థాయ్ రామాకియన్ కి విశిష్ట స్థానం ఉన్నది. ఆయుర్వేదం ని అభివృద్ది చేయడానికి కట్టిన పట్టణానికి అయోధ్య అనే పేరు పెట్టారు. బౌద్ధ మతాన్ని పాటించేవారు దాదాపు 94 శాతం మంది ఉన్నప్పటికీ బౌద్ధ,హిందూ సంప్రదాయాలు కలగలిసిపోయి కనిపిస్తాయి. శివుడు,విష్ణువు,బ్రహ్మ ఈ ముగ్గురు తమ పేర్లు మార్చుకుని ఇక్కడ కనిపిస్తారు.వాళ్ళ ముగ్గురుని ఫ్రా కువాన్,ఫ్రా నరాయ్, ఫ్రా ఫరోన్ గా వ్యవహరిస్తారు. గణేషుడు సైతం నాట్యం చేస్తూన్న భంగిమ లో కనిపిస్తాడు. థాయ్ వంటకాలు ప్రపంచ ప్రసిద్ది పొందాయి. ఆ దేశం ప్రత్యేకంగా తమ చెఫ్ ల్ని ఇతర దేశాలకి అంబాసిడర్ లుగా పంపిస్తుంది. అంటే వారి ద్వారా తమ దేశానికి టూరిజం ఇంకా పెరుగుతుందని వాళ్ళ ప్రణాళిక.


ఆసియా, యూరపు దేశాలతో పోలిస్తే బంగారం ఖరీదు ఇక్కడ తక్కువ. అయితే విదేశీయులు కొనడానికి పరిమితి ఉన్నది.సుగంధద్రవ్యాలు,థాయ్ సిల్క్, స్పా ప్రోడక్ట్స్, షర్టులు,ఇలా చాలా వాటిని మన వాళ్ళు ఎక్కువ గా కొనుగోలు చేస్తుంటారు. అరవై రోజుల దాకా ఎలాంటి వీసా లేకుండా థాయ్ లాండ్ లో భారతీయులు ఉండవచ్చు. గతం లో ఈ పరిమితి తొంభై రోజులుగా ఉండేది. బ్యాంకాక్ లో ఎనభై వేలకి పైగా భారతీయ మూలాలు ఉన్న ప్రజలు ఉన్నారు. థాయ్ కరెన్సీ ని భాట్ అంటారు. మన రూపాయికి రెండు భాట్ లు వస్తాయి.ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల పరంగా చెప్పాలంటే థాయ్ దేశానిది 26 వ స్థానం. 1970 లో టూరిజం ని ప్రధాన వనరు గా ఎన్నుకున్న ఆ దేశం అప్పటి నుంచి ఇప్పటిదాకా వెనక్కి చూడకుండా పురోగమిస్తున్నదనే చెప్పాలి. 


-----       

29, డిసెంబర్ 2024, ఆదివారం

బౌన్సర్ కావాలంటే ఎలా ? వారి విధులు ఎలా ఉంటాయి ?

 బౌన్సర్ కావాలంటే ఎలా ? వారి విధులు ఎలా ఉంటాయి ?

---------------------------------------------------------------------------------

ఇవాళా రేపు బౌన్సర్ అనే పేరు బాగా వినిపిస్తోంది. అంతెందుకు,ప్రముఖుల చుట్టూ వలయం లా ఉంటూ వాళ్ళ ని కాపాడే వారిని చూస్తూనే ఉంటాం. సినిమా ప్రముఖులు అయితే ఇహ చెప్పక్కర్లేదు.అదో సందడి. జనాలు తోసుకు వస్తూంటే వాళ్ళని కంట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.అసలు ఈ బౌన్సర్ అనే ఉద్యోగం ఎప్పుడు మొదలయింది,ఎందుకు మొదలయింది వాళ్ళ జాబ్ చార్ట్ ఎలా ఉంటుంది ఇలాంటివి తెలుసుకుందాం. మొట్ట మెదటిగా హొరాషియో ఆల్గర్ అనే రచయిత బౌన్సర్ అనే నవల 1875 లో రాశాడు. ఆ తర్వాత నుంచి ఆ పేరు బాగా ప్రసిద్ధి పొందింది. ప్రముఖుల రక్షణ కే కాకుండా పబ్ ల వద్ద, జనాలు బాగా వచ్చే ఈవెంట్ల వద్ద,రెస్టారెంట్ల వద్ద, రకరకాల కంపెనీ ఆఫీసుల వద్ద ఇలా చాలా చోట్ల వీరి అవసరం ఉంటుంది. 

అమెరికా వంటి దేశాల్లో బౌన్సర్ జాబ్ కి విపరీతమైన రాబడి ఉంటుంది. చాలా మంది ప్రముఖులు బౌన్సర్లు లేకుండా బయటకి రారు.ప్రస్తుతం మన దేశం లో కూడా ఈ జాబ్ కి బాగా గిరాకీ ఉంది.అయితే అందరకీ ఒకే రకమైన ఆదాయం ఉంటుందని చెప్పలేము.మంచి నైపుణ్యం, అనుభవం ఉన్నవారికి నెలకి 4 లక్షల రూపాయల పైనే ఉంటుంది. కొత్తగా వచ్చేవారికి 20 వేల రూపాయల నుంచి మొదలవుతుంది.బౌన్సర్ వృత్తి అంత సులభమనదేమీ కాదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి.ప్రతి రోజు తమ బాడీ నీ ఫిట్ గా ఉంచుకోవాలి. దానితో పాటుగా స్వయం నియంత్రణ ఉండాలి. తమ తోటి బౌన్సర్ లతో నెట్ వర్క్ కలిగి ఉండాలి.అప్పుడు మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే నోటిమాట తో పెద్ద పెద్ద కంపెనీలు ఆయా నైపుణ్యాలు ఎక్కువ ఉన్నవారిని నియమించుకుంటాయి.

కనీసం ప్లస్ టూ చదువు ఉండాలి.ఏదైనా డిగ్రీ ఉంటే మరీ మంచిది. ఇంగ్లీష్ భాష పై మంచి పట్టు ఉండాలి. ప్రముఖులతో మెలిగేటప్పుడు అది చాలా అవసరం.ఎంట్రీ లెవెల్ లో చిన్న చిన్న రెస్టారెంట్ల వద్ద పనిచేయడానికి వెనుదీయకూడదు.దానివల్ల అనుభవం వస్తుంది. మాబ్ సైకాలజీ తెలుసుకోవడం, వాళ్ళని నియంత్రించడం లో ఆ అనుభవం ముందు ముందు పనికొస్తుంది. గేట్ల వద్ద నిలబడి వచ్చీపోయే వారిని పరిశీలించడం,ఎవరు గొడవ చేసే మూడ్ లో ఉన్నారు అనేది కనిపెట్టడం, వాళ్ళని అదుపు చేయడం ఇలాంటివన్నీ వారు చేయాలి.తాము చేసే పని కి ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయి అనేది గుర్తించి వాటిని క్రమం తప్పక సాధన చేయాలి. ప్రఖ్యాత అమెరికన్ నటుడు విన్ డీసెల్ కూడా కొంత కాలం బౌన్సర్ గా పనిచేశాడు.    

త్రాగుబోతులు గా మారినా, విధుల పట్ల నిర్లక్ష్యం గా ఉన్నా సెక్యూరిటీ సంస్థలు వీరిని సహించవు. వెంటనే తొలగిస్తాయి,కాబట్టి జాగ్రత్త గా ఉండాలి. మన దేశం లో మిరాజ్ సెక్యురిటాస్ అనే సంస్థ ఎక్కువ గా బౌన్సర్ లని అవసరం ఉన్న సెలెబ్రెటీలకి ఇతర కంపెనీలకి సరఫరా చేస్తుంది. ఢిల్లీ కి దగ్గర లో ఉన్న అసోలా ఫతేపూర్ అనే గ్రామం నుంచి మన దేశం లో ఎక్కువ గా బౌన్సర్ వృత్తి లోకి వస్తున్నారని గణాంకాల్లో తేలింది. వీళ్ళు అంతా చాలావరకు గుజ్జర్ కమ్యూనిటీ కి చెందినవారు. ప్రస్తుతం స్త్రీలు కూడా ఈ జాబ్ వైపు మక్కువ చూపుతున్నారు. మెహరున్నీసా షౌకత్ అలీ అనే షహరన్ పూర్ కి చెందిన ఆమె మన దేశం లో మొదటి లేడీ బౌన్సర్. ప్రస్తుతం ఈమె పాపులర్ కేఫ్ అనే ఢిల్లీ కి చెందిన సంస్థ కి రక్షణ కల్పిస్తోంది. ఇంకా సెలెబ్రెటీస్ కి కూడా బౌన్సర్ గా తన సేవల్ని అందిస్తున్నది.   

--- 

24, నవంబర్ 2024, ఆదివారం

"క" సినిమా ఎలా ఉందంటే...


క అనేపేరే ఓ సినిమా కి పెట్టడం వెరైటీ గా ఉంది. డైరెక్ట్ తెలుగు సినిమా ల్లో కొత్తదనం లేదనే వాళ్ళకి సమాధానం లా ఉంది. ఇలాంటి ప్రయోగాలు చేసే యువతరాన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత అందరి మీదా ఉంది. సినిమా రెండు లేయర్ల లో సాగుతుంది.ఒకటి తనలో తనకి జరిగే ఘర్షణ.అది గదుల్లో బంధించి మనషుల్ని టార్చర్ చేసే సీన్లు.అవి నిజానికి ఎవరో కాదు.ఎవరికి వాళ్ళే. అది అందరికీ అర్ధం కావడానికి కొద్దిగా కిందికి దిగి కథ చెప్పడం జరిగింది.

అనాథ పిల్లవాడి గా బాల్యం గడిపిన హీరో తన అలవాట్లు ఏ విధంగా కర్మ బంధమై తనకి చుట్టుకున్నాయి అనేది ఇంకో ఉపకథ లో జోడించి చక్కగా చెప్పారు దర్శకులు.రెండు కథల్ని కలపడం దానికి తగిన నేపథ్యాన్ని రూపొందించడం మామూలు విషయం కాదు.గ్రామీణ వాతావరణం,పోస్టల్ శాఖ పని,అక్కడ నుంచి జరిగే గర్ల్స్ ట్రాఫికింగ్ సహజత్వానికి దగ్గరగా ఉండి మన పక్కనే కథ నడుస్తున్న అనుభూతి కలుగుతుంది.

ఇటీవల కాలం లో తెలుగు లో వచ్చిన ఓ ఆలోచనాత్మక సినిమా అని చెప్పాలి.చెన్నయ్ లో కూడా ఆడియన్స్ బాగుందని రాస్తున్నారు.అక్కడ థియేటర్లు కొన్ని పెంచమని ఈ సినిమా వాళ్ళు అడిగితే నో అన్నారట.తమిళ సినిమా ఏ మాత్రం వెరైటీ గా ఉన్నా మనం బ్రహ్మరథం పడతాం. కానీ మన తెలుగు సినిమా కి తగినన్ని థియేటర్లు ఇవ్వకపోవడం శోచనీయం.

క సినిమా లోని సైడ్ పాత్రలు కూడా బాగున్నాయి.హీరోయిన్ గా వేసిన అమ్మాయి,అలాగే టీచర్ గా నటించిన అమ్మాయి బాగున్నారు.సస్పెన్స్ ని అనేకచోట్ల పెట్టడం తో సీట్ల కి అతుక్కుపోయి చూసే పరిస్థితి ఉంటుంది.కృష్ణగిరి అనే ఆ గ్రామం సినిమా అయిపొయిన తర్వాత కూడా ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతుంది.సంగీతం,ఫోటోగ్రఫీ బావున్నాయి.పాటలు లేకపోయినా సినిమా కి పెద్ద లోటు ఏమీ ఉండదు.     

14, జులై 2024, ఆదివారం

"కల్కి " సినిమా పై నా అభిప్రాయం

 "కల్కి 2898"  అనే సినిమా ని ఎట్టకేలకు నిన్న చూశాను. తర్వాత ఈ నా అభిప్రాయాన్ని రాయలేకుండా ఉండలేకపోతున్నాను. కాశీ-కాంప్లెక్స్-శంబల ...మొత్తానికి మూడు ప్రదేశాల్ని అడ్డు పెట్టి మనల్ని ఏవో లోకాలకి తీసుకుపోయారు.

 ప్రతి పాత్ర అదేమిటో అప్పుడే తెలుగు నేర్చుకుని వచ్చి , వచ్చీ రాని భాషలో ఏదో మాట్లాడిపోయారు. ఆ యాస ఓరి నాయనో. ఒక్క ప్రభాస్ మాత్రం ప.గో.జీ. యాస లో యమ స్పీడు గా మాట్లాడుకుంటూ పోయాడు,కొన్ని డైలాగులు స్పీడు లో అర్థమవ్వవు. 

అదంతే. ఇక గ్రాఫిక్స్ గురించి, ఇలాంటివి హాలీవుడ్ లో ఎన్ని వచ్చాయి, ఎన్ని చూశాం...కానీ ప్రపంచం లో ఇంతవరకు ఎక్కడా రానట్టు ప్రచారాలు.


అశ్వత్థామ కి సంభందించిన మహా భారతం లోని ఎపిసోడ్ ని కల్కి కి ముడిపెట్టి ,ఆపై కాంప్లెక్స్ లో జరిగే ప్రయోగాలు ఈ రెంటికీ ముడివేసి చేసిన ప్రయోగం పరమ కృతకం గానూ,ఎబ్బెట్టు గానూ తోచింది.

సినిమా లో సంగీతం గురించి చెప్పాలంటే ,అసలు ఆ పాటలు ఒక్కటీ మనకి అర్థం కావు.అది తెలుగా ,తెలుగు లాంటి మరో భాషా అనిపిస్తుంది. 

పెద్ద తారల్ని ఖర్చు కి వెరవకుండా పెట్టారు బానే ఉంది గాని అసలైన ఆత్మ అది మాత్రం ఘోరంగా మిస్ అయింది.సినిమా మొత్తం అంతు పొంతూ లేని కలగా పులగం లా ఉంది.

మిలటరీ ట్రక్కుల్లాంటి టక్కు టమార వాహనాలు వాటి మధ్య జరిగే పోరాటాలు చందమామ కథ ల్ని తలపింపజేస్తాయి. ఆసక్తి కరం గా ఏ మాత్రం లేకుండా గ్రాఫిక్స్ ని, పెద్ద తారల్ని నమ్ముకుని సినిమా తీశారు. 

ఆ రెండూ ఏ మాత్రం రంజింప జేయవు సరికదా పరమ బోర్ పుట్టిస్తాయి.ఎంతో హైప్ క్రియేట్ చేసిన మూవీ ప్రేక్షకుడిని సంతృప్తి పరచలేకపోయింది.బాహుబలి తో పోల్చడం అవివేకం. 

దీపికా పడుకునే ఇంకా కాంప్లెక్స్ దృశ్యాలు వెగటు పుట్టిస్తాయి. అసలు సినిమా కథ నే తలా తోక లేని యవ్వారం లా అనిపిస్తే అది చూసేవాళ్ళ తప్పు కాదు.  

20, మే 2024, సోమవారం

రస్కిన్ బాండ్ ఇంగ్లీష్ లో రాసినప్పటికీ భారతీయ సాహిత్యం లో మరువరాని ఓ ప్రత్యేక సంతకమని చెప్పకతప్పదు.

 కేంద్ర సాహిత్య అకాడెమీ ఇటీవల రస్కిన్ బాండ్ అనే రచయిత కి అత్యున్నతమైన ఫెలోషిప్ ని ఇచ్చి గౌరవించింది. రస్కిన్ బాండ్ అనగానే ఇంగ్లీష్ పాఠకులకి వేరే చెప్పనవసరం లేదు. కానీ మన తెలుగు పాఠకులకి తెలియవలసినంత తెలియదేమో ! 

కావలసినన్ని అనువాదాలు కాకపోవడమే కారణం కావచ్చు. ఈ నెల లో 90 వ యేటి లోకి ప్రవేశిస్తున్న ఆయన మౌలికంగా పిల్లల కోసం రాసినప్పటికీ పెద్దవాళ్ళని కూడా బాగా ఆకట్టుకుంటాయి. 

దాదాపుగా 500 కథలు రాశారు.ఇవి కాక నవలలు,ట్రావెలోగ్ లు,వ్యాసాలు ఇలా ఇతర ప్రక్రియల్లోనూ సిద్ధహస్తులు.

1938 లో బ్రిటీష్ దంపతులకి హిమాచల్ ప్రదేశ్ లోని కాసూలి లో జన్మించారు. అయితే మన దేశాన్నే ఆవాసంగా చేసుకున్నారు.

 ప్రస్తుతం ముస్సోరి లో హిమాలయ సానువుల్లో నివసిస్తున్నారు.ఆయన రచనలన్నీ ఆ అడవులు,జంతువులు,కీటకాలు,పక్షులు అన్నీ ఆ ప్రాంతాలనుంచే ఆధారంగా చేసుకొని రాయబడ్డాయి. 

బ్రిటీష్ వారు ఉన్నప్పటి కాలం లోకి వెళ్ళి మనకి అప్పటి జీవితాన్ని చూపిస్తారు. తన జీవితాన్నే చాలామటుకు తన రచనల్లో వెల్లడించారు. ద రూం ఇన్ ద రూఫ్ అనే నవలిక ద్వారా ఆయనకి మంచి ప్రొత్సాహం లభించింది.

ఇక ఆ తర్వాత నుంచి ఆపకుండా రాస్తూనే ఉన్నారు. ముంబాయి నుంచి వచ్చే ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక కి సంపాదకులు గా పనిచేశారు. ఆ తర్వాత దాన్ని విరమించుకొని పూర్తి స్థాయి రచయిత గా ఉండిపోయారు. 

అనేక ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల్లో ఆయన కథలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి ఓ నాస్టాల్జిక్ అనుభూతి ఉంటుంది.కొన్ని నవలల్ని ,కథల్ని సినిమాలుగా తీశారు.జునూన్ సినిమా ఆ కోవలోనిదే. బాండ్ ఇంగ్లీష్ భాష కూడా సింపుల్ గా ఉంటుంది. 

అదే విషయాన్ని ప్రస్తావిస్తే క్లారిటీ గా ఉండటం తనకి ముఖ్యమని దానిలో భాగం గానే నా రచనలు అలా ఉంటాయని అంటారు.

బాండ్ అభిమానులు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు.అంతా కలిసి ఆయన రచనల మీద ఓ డిజిటల్ పత్రిక నడుపుతున్నారు. ముస్సోరి లో ఉన్నకేంబ్రిడ్జ్ బుక్ డిపో లో ఆయన తన అభిమానుల్ని కలిసి ముచ్చటించడం, పుస్తకాలకి సైన్ చేయడం చేస్తుంటారు.

 ఈ మధ్య ఆరోగ్య కారణాల వల్ల ఇంటికే పరిమితమయ్యారని తెలుస్తోంది. అకాడెమీ అధికారులు కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఫెలోషిప్ ని అందజేశారు. రస్కిన్ బాండ్ ఇంగ్లీష్ లో రాసినప్పటికీ  భారతీయ సాహిత్యం లో మరువరాని ఓ ప్రత్యేక సంతకమని చెప్పకతప్పదు.