Pages

22, జూన్ 2025, ఆదివారం

దక్షిణ కొరియన్లు భారతీయుల్ని చిన్నచూపు చూస్తున్నారా ?


దక్షిణ కొరియన్లు భారతీయుల్ని చిన్నచూపు చూస్తున్నారా ? 

-------------------------------------------------------------------------

 ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. దక్షిణ కొరియా దేశస్తులు భారతీయుల్ని చిన్న చూపు చూస్తున్నారని, వారు ఆసియా వాసులే అయినప్పటికీ మనల్ని అలా ట్రీట్ చేయడం ఏమిటి అని ఎవరికైనా కోపం వస్తుంది. మన దేశం లో వాళ్ళ పరిశ్రమలు ఉన్న చోట వాళ్ళ క్యాంటిన్ ల లోకి కూడా అడుగుపెట్టనివ్వరని కూడా చదివాము. ఈ మాట నిజమే అయినప్పటికీ దీని వెనుక కొన్ని నిజాలు ఉన్నాయి. అవి మనం అర్థం చేసుకోవాలి. 50 వ దశకం వరకు పెద్దగా అభివృద్ధి చెందని ఈదేశం, ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రగతి పథం లో పయనిస్తూ ఎల్.జి., హ్యూండాయ్, సాం సంగ్, పోస్కో లాంటి వ్యాపార దిగ్గజాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగిపోతోంది.

అంతేకాదు కొరియన్ సినిమాలు, డ్రామాలు, మ్యూజిక్ ఈ మధ్య మన దేశం లో బాగా ఆదరణ పొందుతున్నాయి. దక్షిణ కొరియా దేశం మొత్తం మీద ఒకే భాష,ఒకే సంస్కృతి లా ఉంటుంది.మొన్న మొన్నటి దాకా ఇంగ్లీష్ భాష కూడా ఎవరికీ రాదు. ఈ తరం వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పోటీ పడుతున్నారు. దాని కోసం ఇబ్బడి ముబ్బడి గా సంస్థలు ఆవిర్భవించి డబ్బు చేసుకుంటున్నాయి. మరి మీరు ఇండియన్స్ ని చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు, రంగు తక్కువ అని అహంకారం ప్రదర్శిస్తున్నారా అని మన వాళ్ళు అడిగితే వాళ్ళ సమాధానం ఏమిటంటే , మా దేశస్తులు తరతరాలుగా విదేశాలు వెళ్ళింది తక్కువ. మా కంటే భిన్నంగా ఉన్నవారిని ఎలా ట్రీట్ చేయాలి అనేది తెలియదు.

వియాత్నం , ఫిలిప్పిన్స్ వాళ్ళని కూడా చిన్న చూపు చూస్తారు ,ఎందుకంటే ఆర్ధికంగా వాళ్ళు వెనకబడి ఉన్నందువల్ల అలా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నవాళ్ళలో అలా ఎవరూ లేరు. ఉంటే గింటే చాలా తక్కువ. ఇండియన్స్ చాలా కాలం నుంచి విదేశాలకి వెళ్ళడం,ఇంగ్లీష్ నేర్చుకొని ఎక్కువ బయటి ప్రపంచం తో మెలగడం ఇవన్నీ ఉన్నాయి,కానీ మా దక్షిణ కొరియా వాళ్ళకి అలాంటి కోణం లేదు. నిజానికి మాకు ఇండియా గురించి చాలా తక్కువ తెలుసు. గత తరాల వాళ్ళ విషయానికొస్తే మరీ దారుణం. బుద్ధుడు , యోగా లాంటి ఏవో కొన్ని అంశాలు తప్పా ఇంకేమీ తెలియదు. చైనా , జపాన్ వాళ్ళ ని కూడా ఇండియన్స్ మాదిరిగానే చూస్తాం అంటూ దక్షిణ కొరియా వ్యక్తి చెప్పుకొచ్చాడు.         

 ప్రస్తుతం దక్షిణ కొరియా దేశం లో యువత కి ప్లాస్టిక్ సర్జరీ మోజు బాగా ముదిరింది. ఏ మాత్రం అవయవం బాగా లేదనుకున్నా ఆపరేషన్ తో సరిజేయించుకుంటున్నారు. సియోల్ లో ఈ కాస్మటిక్ సర్జరీ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా ఉన్నది. ప్రపంచం లో అతి తక్కువ ఒబేసిటి ఉన్న జనాలు ఈ దేశం లోనే ఉన్నారు.శరీరం గురించి అంత శ్రద్ధ అన్నమాట. మగవాళ్ళు గానీ ఆడవాళ్ళు గానీ మేకప్ లేనిదే బయటకి రారు. బాగా పరిశీలించి చూసినట్లయితే సాంస్కృతికంగా మన దేశానికి దక్షిణ కొరియా కి దగ్గరి బాంధవ్యం ఉన్నది. 

తరతరాలుగా ఇక్కడ ఆచారం ఏమిటంటే తమ కన్నా పెద్ద వయసు వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడతారు. అందుకే ఎదుటి వారిని కలిసిన వెంటనే వాళ్ళ వయసు అడుగుతారు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు బయట విడుస్తారు. ఏదీ ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా రెండు చేతులతో చేస్తారు. ఒక్క చెయ్యి ఉపయోగిస్తే అమర్యాద గా భావిస్తారు. పౌర్ణమి రోజున బుద్ధ జయంతి జరుపుకుంటారు. కంఫ్యూషియస్ బోధనల ప్రభావం ఎక్కువ గా ఆ సమాజం మీద ఉన్నది. 

----- మూర్తి కెవివిఎస్ 

19, మే 2025, సోమవారం

కొకైన్ తయారి లో ఆ మూడు దేశాల పాత్ర

కొకైన్ తయారి లో ఆ మూడు దేశాల పాత్ర

------------------------------------------------------

 ఈ మధ్య కాలం లో ఓ మహిళా వైద్యురాలు 53 గ్రాముల కొకైన్ తో పట్టుబడడం తో అసలు ఈ మత్తు పదార్థానికి ఇంతటి అధికారం ఏమిటి మానవ దేహం మీద, అనే అనుమానం రాకమానదు. కొకైన్ డోస్ 30 నుంచి 70 మిల్లీగ్రాములు తీసుకుంటే చాలు, రెండు లేదా మూడు నిమిషాల్లో మెదడు లో స్వైర కల్పనలు మొదలయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. పోను పోను అలవాటు ముదిరితే 1 గ్రాము వరకు ఒకే దెబ్బ లో తీసుకోగలరు. అంతకి మించి 2 గ్రాముల వరకు ఒకేసారి తీసుకుంటే చావు బ్రతుకుల మధ్య ఉన్నట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు.

ప్రతిరోజు 5 గ్రాముల దాకా విడతలు విడతలుగా తీసుకునే వారి శరీరం లో అనేక అవయవాలు దెబ్బతింటాయి.కిడ్నీలు, ప్రేవులు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కేంద్ర నాడీమండల వ్యవస్థ పాడయి మానసిక భ్రాంతులు కలగడం,వణుకు రావడం,ఊపిరి పీల్చడం లో ఇబ్బందులు ఇలా ఎన్నో రుగ్మతలు వస్తాయి. సాధారణం గా కొకైన్ ని ముక్కు తో పీల్చడం ద్వారా,ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా, సిగరెట్లలో పెట్టి తీసుకుంటారు. తీసుకున్నతర్వాత ఒక్కొక్కరికి రకరకాల తేడాలతో భ్రాంతులు కలుగుతాయి. ఆ హాయి కోసమే ముందు అలవాటయి అది ముదిరిన తర్వాత వారి జీవితం ఎలా ముగుస్తుందో తెలియని దశ కి చేరుకుంటారు.

కోకా ఆకులు నుంచి కొకైన్ ని తయారు చేస్తారు. కొలంబియా, పెరూ, బొలీవియా వంటి దేశాల్లో ఈ కోకా పంట విరివిగా పండుతుంది.మొట్టమొదట స్థానికులు అజీర్ణానికి, చురుకు గా ఉండటానికి ఈ ఆకుల్ని మందుగా నమిలేవారు.అయితే జర్మన్ రసాయన శాస్త్రవేత్త అల్బర్ట్ నీమన్ ఒకసారి ఈ ఆకుల్ని నమలగా విచిత్ర అనుభూతి కలిగింది. దాంతో ఆయన కోకా ఆకుల్లోనుంచి రసాన్ని పిండి , దానికి కొన్ని రసాయనాలు కలిపి కొకైన్ అనే తెల్లటి పదార్థాన్ని 1860 లో తయారు చేశాడు.ఆ విధం గా ఇపుడు మనం చూసే కొకైన్ పుట్టింది. ఫ్రెంచ్ రసాయన శాస్రవేత్త ఏంజిలో మరియాని దీనితో ఓ టానిక్ ని తయారు చేశాడు.

మొదట్లో కోకా కోల పానీయం లో కూడా వాడేసిన కోకా ఆకుల్ని వినియోగించేవారు.1920 తర్వాత నుంచి దీన్ని నిలిపివేశారు.ఒక కిలోగ్రాం కొకైన్ తయారు చేయాలంటే వెయ్యి కిలోగ్రాముల కోకా ఆకులు కావాలి. దానికి మరిన్ని రసాయనాలు కలుపుతారు.ప్రపంచం లోని మొత్తం కొకైన్ లో 70 శాతం పైగా ఒక్క కొలంబియా లోనే తయారవుతుంది. ఆ తర్వాత స్థానం పెరూ, బొలీవియా దేశాలది. కేవలం ఈ కొకైన్ వల్లనే కొలంబియా దేశం వారానికి 400 మిలియన్ డాలర్లు ఆర్జిస్తుంది. దక్షిణ అమెరికా ఖండం లోని ఆ మూడు దేశాలు కొకైన్ ని బయటకి పంపిన తర్వాత ప్రపంచ మార్కెట్ లో దాని విలువ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది.           

మత్తు పదార్థాలు అన్నిటిలోనూ దీనికి గల ప్రాముఖ్యత వల్ల షాంపేన్ ఆఫ్ డ్రగ్స్ అని ముద్దుగాపిలుస్తారు. 1970 వరకు కేవలం మందుల తయారీ లోనే ఎక్కువగా వాడేవారు. అమెరికా లో కొకైన్ కి లభించిన పాపులారిటీ వల్ల , ముఖ్యంగా పాప్ సంగీతకారులు, ప్రముఖులు తీసుకోవడం వల్ల మీడియా లో హైప్ వచ్చి దేశదేశాలు విస్తరించింది. ఒక దశలో అంటే 1982 ప్రాంతం లో కోటి నలభై లక్షల మంది అమెరికా లోని ప్రజలు దీనికి బానిసలయ్యారు. ప్రస్తుతం ఈ కొకైన్ డ్రగ్ మాఫియా ప్రపంచం లోని చాలా దేశాలకి విస్తరించింది. వివిధ మత్తు పదార్థాల సేవనం లో ఉత్తర్ ప్రదేశ్, బీహార్,కేరళ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర వరుసగా ముందంజ లో ఉన్నాయి. 

----- మూర్తి కెవివిఎస్ 

30, ఏప్రిల్ 2025, బుధవారం

నారాయణింటె మూణ్ణాన్ మక్కల్ (మళయాళ సినిమా రివ్యూ)

 


ఈ సినిమా ప్రస్తుతం ప్రైం అమెజాన్ లో ఉంది. ఈ సినిమా టైటిల్ అర్థం ఏమిటంటే నారాయణి యొక్క ముగ్గురు కుమారులు అని. చాలా వాస్తవికంగా, రోజువారీ మన చుట్టూ జరిగే సంఘటనలతో మంచి కథ అల్లుకుని ఒక దృశ్యకావ్యంగా చిత్రీకరించారు. ఒక చక్కని గ్రామం. తెలుసు కదా,కేరళ గ్రామాలు పచ్చదనం తో ఎంత కనువిందుగా ఉంటాయో. అలాంటి ఓ గ్రామం లో ,కొయిలాండి అనే గ్రామం లో , నారాయణి అనే వృద్ధురాలు ఉంటుంది. ఆమె చివరి దశకి వస్తుంది.అన్నీ మంచం మీదనే అనేంత అనారోగ్యం తో ఉంటుంది.

ఆమెకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఆ గ్రామం లోనే ఉన్న ఆస్తిపాస్తుల్ని చూసుకుంటూ గడుపుతుంటాడు. అతని పేరు విశ్వనాథన్.తనకి భార్య, ఓ కుమార్తె ఉంటారు. రెండవ కొడుకు సేతు ,అతను అదే ఊళ్ళో కిరాణా షాపు నడుపుతుంటాడు. ఇక మూడవ కొడుకు భాస్కరన్. మతాంతర వివాహం చేసుకుని లండన్ లో సెటిల్ అవుతాడు. తల్లి కి బాగా లేకపోవడం తో ఈ ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఆమె కోసమే భాస్కరన్ లండన్ నుంచి వస్తాడు.

వీరికి అంతకు ముందే దాదాపు అన్ని కుటుంబాల్లో ఉన్నట్లు చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి. తప్పక ఒక గూటి కింద ఉంటూంటారు. మళ్ళీ అవి సెగలు రేపుతుంటాయి.కాని రెండో కొడుకు వాటిని సరిదిద్దుతుంటాడు. భాస్కరన్ కొడుకు , విశ్వనాథన్ కుమార్తె తో ప్రేమ లో పడటం దుమారం లేపుతుంది. ఈ ఇద్దరు పిల్లలు అంతకు ముందు ఓసారి ప్రేమ లో పడి ఫెయిల్ అయి ఉంటారు. తల్లి తొందరగా మరణిస్తే తను విమానం ఎక్కొచ్చని భాస్కరన్ చూస్తుంటాడు. ఈ మధ్య కాలం లో జరిగిన సంఘటనల్ని ఫేమిలీ డ్రామా గా తీర్చిదిద్దాడు దర్శకుడు శరణ్ వేణుగోపాల్. 

ఈ సినిమా లో చెప్పుకోవలసినదేమిటంటే మన జీవితాల్లో ఎదురయ్యే వాస్తవిక ఘటనల్ని ఎలా చక్కని కథ గా మలుచుకోవచ్చు అని. ప్రత్యేకించి హీరోలు గాని విలన్లు గాని ఎవరూ ఉండరు. జీవితం లోని కొన్ని ముక్కలు ఏరి ఆసక్తిదాయకంగా మలిచారు. మళయాళీ సమాజం లోని జీవన వైఖరి ని , చక్కని లొకేషన్లు ఉన్న గ్రామం లో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సినిమాటోగ్రఫీ జ్యోతి స్వరూప్ పండా , సంగీతం రాహుల్ రాజ్ సినిమాకి తమ పనితనం తో నిండుతనం కలిగించారు. సేతు గా నటించిన జోజు జార్జ్ అదనం గా మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చు. సూరజ్, అలెన్షియర్ లే లోపెజ్ వారి పాత్రల్ని గుర్తుండిపోయేలా నటించారు.  

--- murthy

1, ఏప్రిల్ 2025, మంగళవారం

బీహారీలు ఎందుకు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారు?


బీహారీలు ఎందుకు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారు? 

---------------------------------------------------------------------------------

 బీహార్ రాష్ట్రానికి చెందిన శ్రామికులు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో బాగా కనిపిస్తున్నారు. మొత్తం వలస వెళ్ళిన ఆ రాష్ట్రీయులు రెండు కోట్ల డబ్భై రెండు లక్షల పై చిలుకు ఉన్నారు.ఇది 2011 గణాంకాల ప్రకారం చెబుతున్నది. అంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయవచ్చు. బుద్దుడు జ్ఞానోదయం పొందిన భూమి,చాణక్యుడు నడయాడిన నేల,నలంద వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు వర్ధిల్లిన చోట ఏమిటి ఈ వైపరీత్య పరిస్థితులు అంటే అనేక కారణాలు ఉన్నాయి. వలస బాట పడుతున్న వారి లో ఎక్కువ గా అహిర్,కుర్మీ,కల్వర్,భర్,దుసాద్,నునియ, బైండ్, చమర్ వంటి సామాజిక వర్గాల వారు ఉన్నారు.

బ్రిటీష్ వారి హయాం లో వర్ధిల్లిన జమీందారీ వ్యవస్థ లో దీనికి అంకురార్పణ జరిగింది. అప్పటి జమీందారులు కింది స్థాయి లో ఉన్న రైతులకి నీటి వనరులు కల్పించడం లో గాని,పంటలు పండించే విషయం లో విత్తనాలు,పెట్టుబడి లాంటివి అందించడం చేయలేదు.క్రమేణా గ్రామీణా వ్యవస్థ కుప్ప కూలుతూ వచ్చింది. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చిన తర్వాత కూడా సరైన ముందుచూపు ఉన్న రాజకీయ నాయకులు రాలేదు.దానికి తోడు కరుడు కట్టిన కులతత్వ ప్రయోజనాలు చూసుకునే వారి హయాం లో కింది, మధ్య తరగతి వర్గాలు దారిద్ర్యం లో కునారిల్లాయి. ధనం కోసం హత్యలు,కిడ్నాపులు చేయడం రోజువారీ కార్యక్రమాలయ్యాయి. వారందరికీ ప్రభుత్వం లోని పెద్దల ఆశీస్సులు ఉండేవి.

బీహార్ లో పరిశ్రమలు పెట్టడం అంటే కత్తి మీద సాము వంటిది. చిన్న, పెద్ద ఏ బిజినెస్ నడవాలన్నా లోకల్ మాఫియా కి రంగ్ ధారి అనే టాక్స్ చెల్లించాలి.లేకపోతే ఏ వ్యాపారాన్ని చేసుకోనివ్వరు. ఒకప్పుడు రాజ్ పుత్ ల, భూమి హార్ బ్రాహ్మణుల హవా నడిచేది. ప్రస్తుతం యాదవ్ లేదా కుర్మీ వర్గాల హవా నడుస్తున్నది. లల్లూ ప్రసాద్,నితీష్ కుమార్ వంటి వెనుకబడిన వర్గాల నేతలు ముఖ్యమంత్రులు అయిన తర్వాత కొంత మార్పు వచ్చినప్పటికీ పెట్టుబడులు మిగతా రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నట్లుగా ఇక్కడ జరగడం లేదు. దానితో జీవనోపాధి కోసం ప్రజలు వలస బాట పడుతున్నారు.

కేరళ వంటి రాష్ట్రం లో ఈరోజున బీహారీలు 30 లక్షల మంది దాకా ఉన్నారు. నిర్మాణ రంగం లోనూ, ఇతర రోజువారీ పనులు చేయడం లోనూ ఉపాధి పొందుతున్నారు.అక్కడి యువత గల్ఫ్ దేశాలకి,ఇతర ప్రాంతాలకి ఎక్కువగా వెళుతుండటం తో వారి లేని లోటు ని బీహారీలు పూరిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్,అస్సాం,ఢిల్లీ, మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్,ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాల్లోనూ గణనీయం గా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పనుల్లోకి కూడా ఆయా సీజన్ లలో వస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లో 12 లక్షలమంది బీహారీలు నివసిస్తున్నారు.      

పరిశ్రమలు పెద్దగా లేకపోవడం,కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ గా వరదలు రావడం,సరైన మౌలిక వసతులు లేకపోవడం,రాజకీయాల్లో నేరస్వభావం ఎక్కువగా పెరగడం ఇలా అనేక కారణాల వల్ల చదువుకున్న వాళ్ళు , చదువుకోని వాళ్ళు కూడా రాష్ట్రం విడిచిపెట్టి వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేవారు ఎక్కువ సంఖ్య లో ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి స్వగ్రామం వచ్చేటపుడు కూడా బీహారీలు ఒంటరిగా రారు. గుంపు గా వస్తారు. 

లేదంటే దారి కాచి దోపిడీ చేసే దొంగలు వీరు సంపాదించినదంతా తుపాకీ చూపించి దోచుకుంటారు. భూమి తగాదాల్లో ఎక్కువ మర్డర్లు,కిడ్నాప్ లు జరిగేది ఇక్కడే. డబ్బున్న కుటుంబం అని తెలిస్తే చాలు పిల్లల్ని,మహిళల్ని కిడ్నాప్ లు చేస్తారు. చాలా వరకు తగినంత సెక్యూరిటీ లేకుండా బయటకి రావడానికి సాహసించరు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తమ రాష్ట్రం కూడా అభివృద్ధి లో ముందుకు సాగాలని , శాంతి భద్రతలు మెరుగుపడాలని వలసవెళ్ళిన ఆ బీహారీలకి మాత్రం అనిపించదా? ఆ మంచి రోజులు రోజులు రావాలని ఆశిద్దాం.

----- మూర్తి కెవివిఎస్

 

16, మార్చి 2025, ఆదివారం

ఏనుగు గురించి తెలుసుకుందాం!


ఏనుగు గురించి తెలుసుకుందాం!

-------------------------------------------------------

 భూమి మీద నడిచే అతి పెద్ద జంతువు ఏది అంటే ఏనుగు అని చెప్పవలసిందే! ఎన్నో వందల ఏళ్ళ క్రితం నుంచే మనిషికి, ఏనుగు కి విడదీయరాని అనుబంధం ఉంది.ఇతిహాసాల్లో, పురాణాల్లో సైతం ప్రముఖ స్థానమున్నది.పూర్వం రాజులు గజబలం పేరిట ఏనుగుల్ని యుద్ధాల్లో వినియోగించేవారు. ఒక్క మన దేశం లోనే కాదు థాయ్ లాండ్ వంటి దేశాల్లో ఏనుగు కి ఎంతో గౌరవం ఇస్తారు. బౌద్ధ మతం లో కూడా గజరాజు కి పవిత్ర స్థానం ఉన్నది. బుద్ధుడు జన్మించడానికి కొన్ని రోజులు ముందు ఆయన తల్లిగారికి ఓ తెల్ల ఏనుగు స్వప్నం లో దర్శనమిచ్చినందున బౌద్ధ సాహిత్యం లో,శిల్పాల్లో ఏనుగు కి ఎనలేని ప్రాముఖ్యమున్నది. ఇహ మన వినాయక స్వామి గురించి తెలియనిదెవరికి? 

అటువంటి ఏనుగు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఏనుగు కి ఉండే దంతాలు నిజానికి దానికి ఉండే పండ్లు, కాకపోతే అవి పెద్దగా బయటకి వచ్చి కనబడతాయి.దానివల్ల ఆ జంతువు కి ఎన్ని ఉపయోగాలో !ఏనుగు కి మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది.మీరు అద్దం లో దాని రూపాన్ని చూపిస్తే అది తనదే అని గుర్తుపడుతుంది.కేవలం అయిదు జంతువులు మాత్రమే అలా గుర్తుపడతాయి.స్పర్శించడం ద్వారా,శబ్దం చేయడం ద్వారా మిగతా వాటితో మాట్లాడతాయి.ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఆడ ఏనుగు గుంపు కి పెద్ద గా ఉంటుంది. 14 లేదా 15 ఏళ్ళు వచ్చినతర్వాత మగ ఏనుగులు ఆ మంద కి దూరం గా వెళ్ళిపోతాయి.

ఏనుగు మెదడు అయిదు కిలోల పైనే ఉంటుంది. సాధ్యమైనంత వరకు నీటి కి దగ్గర లో నివసిస్తాయి.వాటి దంతాల కోసం చాలా కాలం నుంచి మానవుడు వేటాడుతూనే ఉన్నాడు. అడవి లో 70 ఏళ్ళ పాటు జీవిస్తుంది. తోటి ఏనుగు కి దెబ్బ తగిలినా,జబ్బు చేసినా అవి బాధపడతాయి.తమ మంద లో ఉన్న ఏనుగు ఏదైనా చనిపోతే ,ఆ ప్రదేశానికి తరచు వెళ్ళి అంజలి ఘటించినట్లు ప్రవర్తిస్తాయి. ఏనుగులు తమ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాయి. ఏనుగు పిల్ల పుట్టిన తర్వాత మంద లో మిగతా ఏనుగులు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి. ఏనుగులు అడవి లో అయితే 200 కిలోల ఆహారం ,40 లీటర్ల నీటిని రోజూ తీసుకుంటాయి.

మూడు లేదా నాలుగు గంటల నిద్ర చాలు.అవి నిలబడి కూడా జోగుతుంటాయి. పుట్టిన అరగంట లోనే ఏనుగు పిల్ల నడుస్తుంది.కాని సరిగ్గా పాదం మోపడం,తొండం తో తినడం,నీళ్ళు తాగడం అనేవి చేయడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది.  అంటే తొమ్మిది నెలల దాకా ఆగవలసిందే. బుల్లి ఆడ ఏనుగులు ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ ఆటాడుకుంటాయి. బుల్లి మగ ఏనుగులు మాత్రం ఫైటింగులు చేసుకుంటూంటాయి. అయితే మంద లోని పెద్ద ఏనుగులన్నీ వీటి మీద ఓ కన్ను వేసి ఉంచుతాయి. ఆసియా జాతి ఏనుగులు,ఆఫ్రికా జాతి ఏనుగులు అని ప్రపంచం లోని ఏనుగుల్ని రెండు రకాలుగా విడదీశారు.

మనం తరచూ ఏనుగు మనుషుల మీద దాడిచేసినట్లు వార్తల్లో చూస్తుంటాం. ఏనుగు ఆకారం లో భారీ గా ఉన్నప్పటికీ సున్నిత స్వభావం గల జంతువు. స్ట్రెస్,ఆందోళన,రక్షణ లేకపోవడం,వాటి పిల్లల కి హాని కలుగుతుందనే భావన ఇలాంటి కారణాల వల్ల ఏనుగులు మనుషుల మీద దాడి చేస్తాయి.మన ఆసియా ఖండం లోని ఏనుగుల్ని శ్రీలంక,బోర్నియా,ఇండియా,సుమత్రా రకాలుగా విభజించారు. ఆఫ్రికా ఖండం లోని ఏనుగుల్ని పొదల్లో,అడవుల్లో నివసించే రకాలుగా విభజించారు.ఆఫ్రికా ఏనుగులు నాలుగు లక్షల పదిహేనువేల దాకా ఉండగా ఆసియా రకం ఏనుగులు నలభైవేల నుంచి యాభై వేలు మాత్రమే ఉన్నాయి.

----- మూర్తి కెవివిఎస్ 

9, మార్చి 2025, ఆదివారం

పానీ పూరి కి సైతం ఓ చరిత్ర ఉంది

పానీ పూరి కి సైతం ఓ చరిత్ర ఉంది

-------------------------------------------------

 పానీ పూరి అంటే తెలియనిది ఎవరికి ? రోడ్డు పక్కన అమ్మే ఈ తినుబండారాన్ని  యువతీ యువకులు ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. అసలు ఈ పానీ పూరి ఎక్కడ పుట్టిందో తెలుసా, ఖచ్చితం గా దక్షిణాది లో మాత్రం కాదని చాలా మందికి తెలుసు.అవును, ఇది ఉత్తర్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఆవిర్భవించింది. అక్కడి జానపదులు మహా భారతం లోని కుంతీ దేవికి,ద్రౌపది కి దీని తయారీ లో చోటిచ్చారు అంటే ఈ పానీ పూరి అనేది కొన్ని వందల ఏళ్ళ నుంచే తయారింపబడుతున్నదని అర్థం. 

ఒకరోజున కుంతీ దేవి కొంత గోధుమ పిండి,చిక్కుళ్ళు,కొత్తిమీర,ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు కోడలైన ద్రౌపది కి ఇచ్చి పాండవులందరికి నచ్చేలా ఏదైన వంటకం చేయమన్నదట. దాంతో ఆ కోడలు ఈ పానీ పూరి ని చేయడం తో అందరికీ విపరీతం గా నచ్చడం తో , నీ ఈ వంటకం ఎప్పటికీ భూలోకం లో నిలిచిపోతుందని కుంతీ దేవి ఆశీర్వాదం ఇచ్చిందని ఉత్తరాది లో ఓ కథ ఉన్నది.

అలా ప్రయాణం మొదలు పెట్టిన పానీ పూరి ముంబాయి,ఢిల్లీ,కోల్కత,బెంగళూరు,హైదరా బాద్,అహ్మదా బాద్,పూనే ఇలా మన దేశం లో అన్ని నగరాలకి పరుగులు తీసి , అంతటితో ఆగకుండా చిన్న పట్టణాలకి ,గ్రామాలకి సైతం వ్యాపించి ఎంతోమంది కి ప్రీతిపాత్రమైన స్ట్రీట్ ఫుడ్ గా నిలిచింది. చక్కని శుభ్రమైన నీరు,తాజా ఆలు,గోధుమ పిండి,చింతపండు, ఇంకా అవసరమైన కొత్తిమీర,ఉల్లి లాంటివి వాడితే పానీ పూరి తినడానికి చాలా బాగుంటుంది. అలా కాకుండా చవక రకం వి వాడితే మటుకు రుచి లో తేడా వస్తుంది. అంతే కాదు కడుపు లో నొప్పి కూడా వస్తుంది. దీంట్లో 51 కిలోకేలరీల శక్తి ఉంటుంది.58.3 శాతం కార్బో హైడ్రేట్స్,9.3 శాతం ప్రోటీన్స్ ఉంటాయి.

చాలా రాష్ట్రాల్లో రోడ్డు పక్కనే కాకుండా హోటల్స్ లా పెట్టి కూడా అమ్ముతుంటారు. కొన్ని ప్రాంతాల్లో గోల్ గప్పా అని అంటారు. మధ్య ప్రదేశ్ లో దీన్ని ఫుల్కీ అని,అస్సాం లో పుస్కా అని, బెంగాల్ లో పుచుక అని వ్యవహరిస్తారు. బీహార్ లో మాత్రం జల్ పూరీ అంటారు.గోధుమ పిండి తో చేసిన గుండ్రటి బంతి ,దాంట్లో ఉపయోగించే ఉడికించి నలిపేసిన ఆలు ,చిన్న చిక్కుళ్ళు,తరిగిన కొత్తిమీర,ఉల్లి ఇంకా ఇతర పదార్థాలు పానీ పూరి లో ఉపయోగిస్తారు. 

దీంట్లోనూ ఎన్నో ప్రయోగాలు చేసినవారున్నారు. చిన్నా పెద్ద,పేద ధనిక అనే తేడా లేకుండా ఎంతోమంది ఈ పానీ పూరి ని లాగిస్తుంటారు. దీనివల్ల సాఫీ విరోచనం అవుతుందని ప్రతీతి. ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళ లలో ఈ తినుబండారాన్ని అతిథులకి సప్లయ్ చేస్తారు.అలాంటి కాంట్రాక్టులు పొంది ఇబ్బడి ముబ్బడిగా సంపాదించిన వ్యాపారస్తులు ఎందరో!

మహారాష్ట్ర లోని జల్నా అనే పట్టణం లో  అలాంటి ఓ వ్యాపారి కాశీనాథ్ వామన్ రావు గాలీ! ఈయన గత 18 ఏళ్ళుగా ఈ పానీ పూరి వ్యాపారం చేస్తూ కోటీశ్వరుడయ్యాడు. వ్యాపారం పెట్టిన మొదట్లో 250 రూపాయల దాకా వచ్చేవి. క్రమేణా నాణ్యమైన వస్తువుల్ని ఉపయోగిస్తూ, ప్రయోగాలు చేస్తూ కష్టమర్లని ఆకట్టుకున్నాడు.అంతే గాక ఆ చుట్టుపక్కల ఎక్కడ పెళ్ళి ఉన్నా ఈయనే పానీపూరి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. 

ఈయన గూర్చి ఎన్నో జాతీయ పత్రికల్లో కథనాలు వచ్చాయి. కాబట్టి పానీ పూరి ని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే! రుచికరం గా చేయాలే గాని కష్టమర్ల రద్దీ మామూలుగా ఉండదు. ఆ విషయం మనకి రోడ్ల పక్కన కొన్ని పానీ పూరి బండ్లని చూస్తుంటేనే తెలిసిపోతుంది. 

----- మూర్తి కెవివిఎస్ 

20, ఫిబ్రవరి 2025, గురువారం

కాకి ని తక్కువ అంచనా వేస్తున్నారా ?

కాకి ని తక్కువ అంచనా వేస్తున్నారా ?

-------------------------------------------------


 కాకి ని చూడని వారు అంటూ బహుశా ఎవరూ ఉండరు. కాకి మీద ఎన్నో సామెతలు ఉన్నాయి. ఆ పక్షి మన పిట్టగోడ మీద నుంచి అరిస్తే చాలు ఈరోజు మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నట్లు భావిస్తాం. అంతే కాదు,పితృ దేవతలకి మనకి సంధానకర్త గా అనుకోవడం కద్దు. మనం పెట్టిన పిండం కాకి ముట్టకపోయినట్లయితే పై లోకం లో ఉన్న పెద్దలు మనపై కోపం గా ఉన్నారేమో అనుకుంటాం. ఇవన్నీ నిజమా,కావా అన్నది అటుంచితే కాకి తో మానవుడి జీవితం ఎంతగా పెనవేసుకుపోయిందో ఈ ఉదంతాలు తెలుపుతాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత గల ఆ జీవులు గూర్చి కొంతైన తెలుసుకోవాలి. కాకులు మంద లోనూ, ఒంటరి గానూ జీవిస్తాయి. వీటి జీవిత కాలం రమారమి ఇరవై ఏళ్ళు.

ఇవి మనుషుల మొహాల్ని బాగా గుర్తుంచుకోగలవు. దాదాపు అయిదేళ్ళ పాటు గుర్తుంచుకుంటాయంటే ఆశ్చర్యం గా లేదూ!ఏడు ఏళ్ళ పిల్లలకి ఉండేంత తెలివి వీటికి ఉంటాయి.అంటే ముఖ్యం గా సమస్య ని పరిష్కరించుకోవడం లో,కమ్యూనికేట్ చేయడం లో కాకి కి ఉండే నైపుణ్యం ఆ స్థాయి లో ఉంటుంది. దాని మెదడు లో కూడా మనకి మల్లే  చిక్కగా అల్లుకుని ఉండే న్యూరాన్లు ఉంటాయి. మనుషులు చేసే మంచి పనులు,చెడ్డ పనులు కూడా అవి గుర్తు పెట్టుకోగలవు. అంటే కాకి కి మీరు అన్నం పెట్టినా,ప్రేమ గా చూసినా అవి మిమ్మల్ని చాలా కాలం గుర్తుంచుకుంటాయి. మీకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తాయి.

మీరు గనక వాటి పిల్లల కి రాళ్ళు వేసినా లేదా వాటి గూడు కి దగ్గరగా వెళ్ళినా, పాడు చేసినా మిమ్మల్ని గుర్తు పెట్టుకుని తగిన గుణపాఠం కూడా చెబుతాయి. అప్పుడప్పుడు పేపర్ల లో చదువుతుంటాం. కాకి పగబట్టి వేధిస్తున్నదని,బయటకి వచ్చినప్పుడల్లా కాళ్ళతో నెత్తి మీద తన్ని పోతున్నాయని ఆవేదన తో ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు కూడా ఉన్నారు.   

మరి అలాంటి సమయం లో ఏం చేయాలి అంటే మనం ఉండే ప్రదేశాన్ని గాని, ఊరిని గాని మార్చడమే చేయగల పని. అంతే తప్పా వేరే దారి లేదు. ఒక్కోసారి కాకులు బాగా అరుస్తుంటాయి. రొద పెడుతుంటాయి. వాటిలో వాటికి కోపం వచ్చినప్పుడు  లేదా ఇతర సంగతుల్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి అలా అరిచి గోల చేస్తుంటాయి. రాత్రి పూట ఆలశ్యంగా గూళ్ళకి వచ్చిన కాకులు చెట్టు కి కింద ఉన్న కొమ్మల మీద కి వెళ్ళవలసిందిగా మిగతా వాటిని అడుగుతుంటాయి.అవి మనకి గోల గా అనిపించడం సహజమే.

సాధారణం గా కాకులు మర్రి చెట్ల మీద,ఇతర పెద్ద చెట్ల మీద, తోటల్లో నివసిస్తాయి.పండ్లను,చిన్న పురుగుల్ని,ధాన్యాల్ని,చేపల్ని తింటాయి. కోడి పిల్లల్ని ఎత్తుకుపోతుంటాయి. ఇతర పక్షుల గూళ్ళని పాడు చేసి వాటి గుడ్లని కూడా తినేస్తాయి.మనం వాటికి ఏదైనా ఆహారం వేసినా గుర్తు పెట్టుకుని అవి మనల్ని విష్ చేస్తాయి.అయితే వాటి భాష మనం అర్థం చేసుకోలేము కనక పట్టించుకోము. ఏ కాకి అయినా మనల్ని చూసి తల ని బౌ చేసినట్లుగా ఊపితే థాంక్యూ అని అర్థం అన్న మాట. అంతే కాదు, వాటికి బాగా నచ్చినట్లయితే కొన్ని బహుమతుల్ని కూడా మనకి ఇస్తుంది. రంగు రంగుల చిన్న రాళ్ళు,మెరిసే ఆకులు ఇలాంటి వాటిని మనకి దగ్గర్లో పారేసి పోతుంది. చూశారా, మనం రోజూ చూసే కాకి వెనుక ఎంత కథ ఉన్నదో !