Pages

14, జులై 2024, ఆదివారం

"కల్కి " సినిమా పై నా అభిప్రాయం

 "కల్కి 2898"  అనే సినిమా ని ఎట్టకేలకు నిన్న చూశాను. తర్వాత ఈ నా అభిప్రాయాన్ని రాయలేకుండా ఉండలేకపోతున్నాను. కాశీ-కాంప్లెక్స్-శంబల ...మొత్తానికి మూడు ప్రదేశాల్ని అడ్డు పెట్టి మనల్ని ఏవో లోకాలకి తీసుకుపోయారు.

 ప్రతి పాత్ర అదేమిటో అప్పుడే తెలుగు నేర్చుకుని వచ్చి , వచ్చీ రాని భాషలో ఏదో మాట్లాడిపోయారు. ఆ యాస ఓరి నాయనో. ఒక్క ప్రభాస్ మాత్రం ప.గో.జీ. యాస లో యమ స్పీడు గా మాట్లాడుకుంటూ పోయాడు,కొన్ని డైలాగులు స్పీడు లో అర్థమవ్వవు. 

అదంతే. ఇక గ్రాఫిక్స్ గురించి, ఇలాంటివి హాలీవుడ్ లో ఎన్ని వచ్చాయి, ఎన్ని చూశాం...కానీ ప్రపంచం లో ఇంతవరకు ఎక్కడా రానట్టు ప్రచారాలు.


అశ్వత్థామ కి సంభందించిన మహా భారతం లోని ఎపిసోడ్ ని కల్కి కి ముడిపెట్టి ,ఆపై కాంప్లెక్స్ లో జరిగే ప్రయోగాలు ఈ రెంటికీ ముడివేసి చేసిన ప్రయోగం పరమ కృతకం గానూ,ఎబ్బెట్టు గానూ తోచింది.

సినిమా లో సంగీతం గురించి చెప్పాలంటే ,అసలు ఆ పాటలు ఒక్కటీ మనకి అర్థం కావు.అది తెలుగా ,తెలుగు లాంటి మరో భాషా అనిపిస్తుంది. 

పెద్ద తారల్ని ఖర్చు కి వెరవకుండా పెట్టారు బానే ఉంది గాని అసలైన ఆత్మ అది మాత్రం ఘోరంగా మిస్ అయింది.సినిమా మొత్తం అంతు పొంతూ లేని కలగా పులగం లా ఉంది.

మిలటరీ ట్రక్కుల్లాంటి టక్కు టమార వాహనాలు వాటి మధ్య జరిగే పోరాటాలు చందమామ కథ ల్ని తలపింపజేస్తాయి. ఆసక్తి కరం గా ఏ మాత్రం లేకుండా గ్రాఫిక్స్ ని, పెద్ద తారల్ని నమ్ముకుని సినిమా తీశారు. 

ఆ రెండూ ఏ మాత్రం రంజింప జేయవు సరికదా పరమ బోర్ పుట్టిస్తాయి.ఎంతో హైప్ క్రియేట్ చేసిన మూవీ ప్రేక్షకుడిని సంతృప్తి పరచలేకపోయింది.బాహుబలి తో పోల్చడం అవివేకం. 

దీపికా పడుకునే ఇంకా కాంప్లెక్స్ దృశ్యాలు వెగటు పుట్టిస్తాయి. అసలు సినిమా కథ నే తలా తోక లేని యవ్వారం లా అనిపిస్తే అది చూసేవాళ్ళ తప్పు కాదు.  

20, మే 2024, సోమవారం

రస్కిన్ బాండ్ ఇంగ్లీష్ లో రాసినప్పటికీ భారతీయ సాహిత్యం లో మరువరాని ఓ ప్రత్యేక సంతకమని చెప్పకతప్పదు.

 కేంద్ర సాహిత్య అకాడెమీ ఇటీవల రస్కిన్ బాండ్ అనే రచయిత కి అత్యున్నతమైన ఫెలోషిప్ ని ఇచ్చి గౌరవించింది. రస్కిన్ బాండ్ అనగానే ఇంగ్లీష్ పాఠకులకి వేరే చెప్పనవసరం లేదు. కానీ మన తెలుగు పాఠకులకి తెలియవలసినంత తెలియదేమో ! 

కావలసినన్ని అనువాదాలు కాకపోవడమే కారణం కావచ్చు. ఈ నెల లో 90 వ యేటి లోకి ప్రవేశిస్తున్న ఆయన మౌలికంగా పిల్లల కోసం రాసినప్పటికీ పెద్దవాళ్ళని కూడా బాగా ఆకట్టుకుంటాయి. 

దాదాపుగా 500 కథలు రాశారు.ఇవి కాక నవలలు,ట్రావెలోగ్ లు,వ్యాసాలు ఇలా ఇతర ప్రక్రియల్లోనూ సిద్ధహస్తులు.

1938 లో బ్రిటీష్ దంపతులకి హిమాచల్ ప్రదేశ్ లోని కాసూలి లో జన్మించారు. అయితే మన దేశాన్నే ఆవాసంగా చేసుకున్నారు.

 ప్రస్తుతం ముస్సోరి లో హిమాలయ సానువుల్లో నివసిస్తున్నారు.ఆయన రచనలన్నీ ఆ అడవులు,జంతువులు,కీటకాలు,పక్షులు అన్నీ ఆ ప్రాంతాలనుంచే ఆధారంగా చేసుకొని రాయబడ్డాయి. 

బ్రిటీష్ వారు ఉన్నప్పటి కాలం లోకి వెళ్ళి మనకి అప్పటి జీవితాన్ని చూపిస్తారు. తన జీవితాన్నే చాలామటుకు తన రచనల్లో వెల్లడించారు. ద రూం ఇన్ ద రూఫ్ అనే నవలిక ద్వారా ఆయనకి మంచి ప్రొత్సాహం లభించింది.

ఇక ఆ తర్వాత నుంచి ఆపకుండా రాస్తూనే ఉన్నారు. ముంబాయి నుంచి వచ్చే ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక కి సంపాదకులు గా పనిచేశారు. ఆ తర్వాత దాన్ని విరమించుకొని పూర్తి స్థాయి రచయిత గా ఉండిపోయారు. 

అనేక ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల్లో ఆయన కథలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి ఓ నాస్టాల్జిక్ అనుభూతి ఉంటుంది.కొన్ని నవలల్ని ,కథల్ని సినిమాలుగా తీశారు.జునూన్ సినిమా ఆ కోవలోనిదే. బాండ్ ఇంగ్లీష్ భాష కూడా సింపుల్ గా ఉంటుంది. 

అదే విషయాన్ని ప్రస్తావిస్తే క్లారిటీ గా ఉండటం తనకి ముఖ్యమని దానిలో భాగం గానే నా రచనలు అలా ఉంటాయని అంటారు.

బాండ్ అభిమానులు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు.అంతా కలిసి ఆయన రచనల మీద ఓ డిజిటల్ పత్రిక నడుపుతున్నారు. ముస్సోరి లో ఉన్నకేంబ్రిడ్జ్ బుక్ డిపో లో ఆయన తన అభిమానుల్ని కలిసి ముచ్చటించడం, పుస్తకాలకి సైన్ చేయడం చేస్తుంటారు.

 ఈ మధ్య ఆరోగ్య కారణాల వల్ల ఇంటికే పరిమితమయ్యారని తెలుస్తోంది. అకాడెమీ అధికారులు కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఫెలోషిప్ ని అందజేశారు. రస్కిన్ బాండ్ ఇంగ్లీష్ లో రాసినప్పటికీ  భారతీయ సాహిత్యం లో మరువరాని ఓ ప్రత్యేక సంతకమని చెప్పకతప్పదు.   

2, మార్చి 2024, శనివారం

మొట్ట మొదటిసారిగా అమెరికా వెళ్ళేవారు ఈ విషయాల్ని గమనిస్తే మంచిది.

 మొట్ట మొదటిసారిగా అమెరికా వెళ్ళేవారు ఈ విషయాల్ని గమనిస్తే మంచిది. వీటిని రాసింది ఓ ఒరియా అమ్మాయి, తను నాలుగేళ్ళ కిందట ఆ దేశం వెళ్ళినపుడు పరిశీలించి రాసిన కొన్ని విశేషాలు.


1.అమెరికా లో ఎక్కువ గా ఉండేది చెక్క తో నిర్మించిన ఇళ్ళే.సిమెంట్,ఇటుకలు లాంటి వాటితో మన దేశం లో ఎక్కువ గా ఇళ్ళు నిర్మించుకున్నట్లే అక్కడ ఆ విధంగా నిర్మించుకుంటారు.


2. ప్రతి ఇంట్లో ఫ్లోర్ మీద రగ్గులు పరుస్తారు. కార్పెట్ ల మాదిరిగా అన్నమాట. బాత్ రూం లు అన్నిట్లో కూడా. తుడవడానికి మాపింగ్ కంటే వాక్యుమింగ్ కి ప్రాధాన్యత ఉంటుంది.


3.వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకోవడం అంటే మనకి మనం చేతితో కొట్టుకోవడమే. కార్డ్ తో చెల్లించాలి. సెల్ఫ్ సర్వీస్ అన్నమాట.


4. ట్రాఫిక్ రూల్స్ పాటించడం లో ఎలాంటి వాళ్ళకీ సడలింపులు ఉండవు. ఉల్లంఘిస్తే  ఫైన్ లు విపరీతంగా ఉంటాయి.


5. ఎక్కడో న్యూయార్క్ లాంటి నగరాల్లో తప్పా జనాలు చాలా తక్కువ గా రోడ్ల మీద కనిపిస్తారు. కార్లు ఎక్కువ గా కనిపిస్తాయి.


6.ఇంచు మించు చాలా చిన్న ఊర్లలో కూడా రోడ్లు చాలా వెడల్పుగా ఉండి మన నేషనల్ హైవే ల మాదిరిగా ఉంటాయి.


7. జనాలు స్ట్రైట్ గా ఉంటారు. మీరు నచ్చితే అడగడానికి వెనకాడరు. ఇతరత్రా సమయం వృధా చేయడం ఉండదు. 


8. హోటళ్ళ లో రేట్లు ఎక్కువ. ఆహారం ఎక్కువ క్వాంటిటి లో పెడతారు. 


9. హోటళ్ళ లో కాంప్లిమెంటరి వాటర్ బాటిల్స్ ఇవ్వరు.


10.హై ప్రొఫైల్ చూసి ప్రత్యేకం గా ఎవరికీ ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం ఉండదు. రెస్టారెంట్ లో క్లీనింగ్ పనిచేసే వ్యక్తికైనా, పెద్ద అధికారి అయినా సహజంగా సాటి మనిషికి ఇచ్చే గౌరవం ఇస్తారు.


11. పెంపుడు జంతువుల్ని మనుషులతో సమానం గా ట్రీట్ చేస్తారు.


12. కొత్త ఆలోచన దేన్నైనా స్వాగతిస్తారు.     


 

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

గద్దర్ పేరు మీద సినిమా అవార్డులా...ఓర్నీ

 

గద్దర్ పేరు ని సినిమా వాళ్ళ కి ఇచ్చే అవార్డ్ లకి పెడదామనే టాక్ ఒకటి బయటకి వచ్చింది. జన బాహుళ్యం లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. అసలు ఆ పేరు ని పెడదామనే ఊహ రావడమే విచిత్రం. ఆయన కొన్ని సినిమాల్లో పాటలు పాడాడు. కొన్ని సినిమాల్లో కనిపించాడు. కాని మౌలికంగా తెలుగు సినిమా కి చేసినది ఏముందని..? పెద్దగా ఏమీ లేదు. అంతకంటే సినిమా కి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

గద్దర్ ప్రధానంగా ప్రభుత్వ విధాన వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు. విప్లవ గీతాలతో ఉర్రూతలూగించి యువత ని అడవుల్లోకి వెళ్ళేలా చేశాడు.అనేకమంది చావులకి పరోక్షం గా కారణమయ్యాడు. తను వయసు లో ఉన్నప్పుడు అలా చేసి వయసు మళ్ళిన కాలం లో ఏ పార్టీలనైతే తిట్టాడో అదే పార్టీల్లో చేరాడు. ఇంకా ఆ తర్వాత జరిగినవి అన్నీ అందరకీ తెలిసినవే. భద్రం కొడుకో...అనే పాట గాని , మదనా సుందరి ..అనే పాటగాని...ఇంకా ఆయనకి పేరు తెచ్చిన చాలా పాటలు ఆయన రాసినవి కావు.

అంజయ్య ఇంకా మిగతా వాళ్ళు రాసినవి.కాని వాళ్ళు రాసినట్లు స్టేజ్ ల మీద ఎక్కడా చేప్పేవాడు కాదు. ఆ విధంగా చాలా పేరు తెచ్చిన పాటలు ఆయన సొంత రచనలే అనుకుంటారు చాలామంది. ఇక సొంత కుటుంబం లో పిల్లలు మాత్రం ఉద్యమం లోకి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. ఎంతో మంది చావులకి కారణమై,మళ్ళీ ఉద్యమం నుంచి బయటకి వచ్చి పాత పాపులారిటి తో కొత్త జీవితాన్ని గ్లామర్ ని సాధించుకునే వీళ్ళు , వీళ్ళ ప్రభావం వల్ల గర్భశోకం అనుభవించిన తల్లిదండ్రులకి ఏం సమాధానం చెబుతారు. 

కనక సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డ్ లకి గద్దర్ పేరు పెట్టడం నూటికి నూరు పాళ్ళు తలతిక్క పని. ఈ ఆలోచన ఎందుకు ఎవరకి వచ్చిందో మరి.సరైన వాళ్ళ పేర్లు దొరక్కపోతే ప్రభుత్వం పేరు మీద ఇవ్వండి. నష్టం ఏముంది.      

6, డిసెంబర్ 2023, బుధవారం

అమెరికా నుంచి ఒక గుజరాతి విద్యార్థి రాసిన అనుభవాలు

 


జెనిల్ దేశాయ్ అనే గుజరాతి విద్యార్థి అమెరికా లో ఎం.ఎస్. చదువుతూ తన అనుభవాల్ని ఈ విధంగా రాశాడు. ఇంకా రాయడానికి ఓ బుక్ అంత ఉంది గానీ ముఖ్య అంశాలు మాత్రం ప్రస్తావించడం జరిగింది.


యు.ఎస్. లో మీరు గొప్ప రాక్ స్టార్ అయినా, మామూలు మనిషి అయినా గొప్ప తేడా ఏమీ ఉండదు.మామూలు గానే చూస్తారు.

ప్రతి విషయాన్ని సొంతగానే నేర్చుకోవాలి.

జీవితం ఇక్కడ స్ట్రగుల్ గా ఉంటుంది. కాని దానికి తగ్గ వినోదం కూడా ఉంటుంది. నిజమైన ప్రపంచం ఏ సూత్రాల మీద పని చేస్తుందో అర్థమవుతుంది.
ఏ ఫీల్డ్ లో గానీ అనుభవం అనేదానికి ఎక్కువ విలువ ఉంటుంది.

లైబ్రరీ లో చదువుతూ ఎక్కువ సమయం గడపవలసిందే. ప్రతి చిన్న విషయాన్ని ప్రొఫెసర్స్ చెప్పరు.

ఏదీ ఉచితం గా రాదు. ప్రతిదాన్ని శ్రమించి పొందవలసిందే.

చాలామందికి మనకన్నా ఎక్కువ విషయాలు తెలిసిఉంటాయి.అది మనకి తెలిసిపోతూనే ఉంటుంది.

ఇక్కడ ఏ భారతీయునికి ఇంకో భారతీయుడు సాయపడడు. ఇదొక చేదు నిజం.
సీనియర్స్ ముందు కొద్దిగా హెల్ప్ చేసినా, సెమిస్టర్ మొదలయితే వాళ్ళు ఆ తర్వాత హెల్ప్ చేయరు.కాబట్టి సీనియర్స్ మీద ఎక్కువ ఆధారపడకూడదు.

మనతో ఏదైనా పని ఉంటేనే జనాలు పిలుస్తారు. దేనికి ప్రతిస్పందించాలో మనం నిర్ణయించుకోవాలి.

29, నవంబర్ 2023, బుధవారం

మెడిసిన్ చదవడానికి కిర్గిస్తాన్ వెళుతున్నారు, సరే... అక్కడ క్వాలిటి ఎలా ఉందో ?


 ఈ మధ్య వైద్యశాస్త్రం చదవాలంటే చాలామంది విదేశాలు వెళ్ళిపోతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. మన దేశం లోని చాలా మెడికల్ కాలేజీలు ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు వసూలు చేసే ఫీజులు భయంకరం గా ఉండి మధ్య తరగతి కుటుంబాలు భరించలేని స్థితిలో విదేశాలకి వెళ్ళిపోతున్నారు.  ప్రతి ఏటా ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు నీట్ పాసవుతున్నారు. కానీ ఉన్న సీట్లు దేశం మొత్తం మీద తొంభై వేలు మాత్రమే..!

హంగరీ,కజాన్, బెలారస్, కిర్గిస్థాన్, చైనా ,ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకి మన వాళ్ళు వైద్యవిద్య కోసం వెళుతున్నారు. కిర్గిస్తాన్ లాంటి దేశాల్లో ఒక సంవత్సరం కి గాను మూడన్నర నుంచి అయిదు లక్షలు చెల్లించవలసి ఉంటుంది.ఎక్కువ లో ఎక్కువ ఇరవై లేదా పాతిక లక్షల్లో వైద్య విద్య మొత్తం అయిపోతుంది. కానీ అదే మన దగ్గర ఒక్క సంవత్సరానికి గాను పాతిక లక్షల నుంచి కోటి రూపాయలకి పైగా ప్రైవేట్ కాలేజీల్లో చెల్లించాలి.కిర్గిస్తాన్ లో వైద్యవిద్య అభ్యసించిన గ్రాడ్యుయేట్ కి ఎం సి ఐ, డబ్ల్యు హెచ్ ఓ  లాంటి సంస్థలు సైతం గుర్తింపు నిస్తున్నాయి.

మన నీట్ స్కోర్ ని  కూడా ఆ దేశాలు గుర్తిస్తున్నాయి. నాణ్యత పరంగా కూడా మంచి విద్యనే అవి తక్కువ ధర లో అందిస్తున్నాయి.కనుకనే మనవాళ్ళు క్యూ కడుతున్నారు.ఆసియా దేశాల్లో పాకిస్తాన్,బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళుతున్నారు. ప్రతి ఏటా సుమారు పాతికవేలమంది వైద్యవిద్య నిమిత్తం మన దేశం నుంచి బయటకి వెళుతున్నారు. అదే విధం గా మన మెడికల్ గ్రాడ్యుయట్ లు ప్రతి ఏటా అయిదువేల మంది ఇతర దేశాలకి ఉద్యోగనిమిత్తం వెళుతున్నారు.ఆస్ట్రేలియా,కెనడా,ఇంగ్లాండ్,అమెరికా,నెదర్ లాండ్స్ లాంటి దేశాల్లో మెరుగైన వేతనాల కోసం వెళుతున్నారు.   




    

1, అక్టోబర్ 2023, ఆదివారం

ఆయన అరెస్ట్ అయిన తర్వాత బాల కృష్ణ గారి ధోరణి సినిమా మూస లోనే .....

 అప్పుడప్పుడు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. చంద్రబాబు జైలు కెళతారని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే అలా అనిపించడం సహజం. న్యాయ వ్యవస్థ లో తిరుగులేని పట్టు కలిగి ఇదిగో ఈ విషయం లో దొరికిపోతాడు అనుకునేలోపు దాంట్లోచి బయటకి రాగలగడం మనం అనేకసార్లు చూడలేదా..? స్వతహగా ఎన్ టీ ఆర్ లాగా గొప్ప స్పీచ్ లు అవీ ఇచ్చే చరిష్మా లేకపోయినా తన మనుషుల్ని ఎక్కడ ప్లాంట్ చేయాలో అక్కడ ప్లాంట్ చేసి కార్యాల్ని గంధర్వుల మాదిరి గా మూడో కంటికి తెలియకుండా నడిపించడం బాబు గారి చతురత కి నిదర్శనం.

ఆయన అరెస్ట్ అయిన తర్వాత బాల కృష్ణ గారి ధోరణి సినిమా మూస లోనే తప్పా మారకపోవడం చిత్రం. మమ్మల్ని ఏమీ పీకలేవు అంటూ బూతులు అందుకోవడం అసెంబ్లీ లో అలాంటి చేతి సైగలు చేయడం ఆయన రాజకీయ అపరిపక్వత కి నిదర్శనం. ఆల్ రెడీ అక్కడ పీకి చూపించాడు ప్రత్యర్థి ...అయినా ఏం పీకుతావు అంటూ మాట్లాడటం ఏమిటో అర్థం కావట్లేదు. ఇక పవన్ పయనం ఏమిటో గందరగోళం గా ఉంది.

రాజకీయ క్షేత్రం లో పవర్ ఎప్పుడూ ఒకే వైపు ఎల్లకాలం ఉండదు. గతం లో జగన్ ని అరెస్ట్ చేయడం , అతని కుటుంబాన్ని వేధించడం కళ్ళున్న ప్రతి ఒక్కరు చూశారు. ప్రస్తుతం జరిగింది దానికి టిట్ ఫర్ టాట్ లాంటిది తప్పా మరొకటి కాదన్నట్లు సామాన్యుడు భావిస్తున్నాడు. అందుకనే పవర్ చేతి లో ఉన్నప్పుడు ఎదుటి పక్షాన్ని ఒక స్థాయి దాటి వేధించరు నిజం గా తెలివైనవాళ్ళు. ఎందుకంటే పవర్ చేతులు మారినపుడు పదింతలై వెనక్కి తిరిగి వస్తుంది. తల్చుకుంటే సోనియమ్మ ని,రాహుల్ బాబు ని జైల్లో పెట్టించలేరా మోడీ షాలు...కానీ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు పవర్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదని.