Pages

18, డిసెంబర్ 2025, గురువారం

ఎంబసీ, హై కమీషన్, కాన్సులేట్ వీటి మధ్య తేడా ఏమిటి ?


మనం తరచుగా ఎంబసీ, హై కమీషన్ ఇంకా కాన్సులేట్ కార్యాలయం అనే మాటల్ని వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా విదేశాల్లో ఉండే రాయబార కార్యాలయాలకి ఉండే పేర్లు అని మనం భావిస్తాం. మరి అయితే వాటి మూడిటి మధ్య తేడా ఏమీ లేదా అంటే ఉన్నది. కామన్ వెల్త్ దేశాల్లో ఉండే మన రాయబార కార్యాలయాల్ని ఎంబసీ అని పిలిస్తాము. అలాగే నాన్ కామన్ వెల్త్ దేశాల్లో ఉండే వాటిని హై కమీషన్ అని వ్యవహరిస్తాము. పై రెండు కార్యాలయాలు చేసే పని ఒకటే.వివిధ రంగాల్లో మన దేశ ప్రయోజనాల్ని ఇతర దేశాల్లో సమ్రక్షించడం, ఆయా దేశాల్లో మన దేశ పౌరుల కి అవసరం ఏర్పడినపుడు సాయం చేయడం, ఇతర దేశాలతో అనుసంధానం గా పని చేయడం ఇలాంటివి చేస్తుంటాయి.

ఇక కాన్సులేట్ కార్యాలయం అంటే దిగువ స్థాయి రాయబార కార్యాలయాలు వంటివి. ఉదాహరణకి అమెరికా కి న్యూ ఢిల్లీ లోని చాణక్యపురి లో ఎంబసీ ఉన్నది. దానికి అనుసంధానంగా హైదరా బాద్, చెన్నై,ముంబాయ్,కోల్కతా నగరాల్లో కూడా కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి.పాస్ పోర్ట్,వీసాలు,విదేశీ వ్యాపార కార్యకలాపాలు ఇంకా రకరకాల విషయాలకి సంబంధించి వత్తిడిని తట్టుకుని పనిచేయడానికి రాజధాని నగరాలు కానప్పటికీ ఆయా ముఖ్య నగరాల్లో ఆ బ్రాంచ్ ఆఫీస్ లు లాంటివి పెట్టారన్నమాట. అయితే ప్రతి దేశానికి ఒకటి కంటే ఎక్కువ ఎంబసీ లు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు.

నిజానికి మన దేశానికి ప్రపంచం లోని అన్ని దేశాల్లో రాయబార కార్యాలయాలు లేవు. కేవలం 150 దేశాల్లో మాత్రమే ఉన్నాయి. సోమాలియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నౌరు, కాంగో,ఎస్తోనియా,అల్బేనియా , జార్జియా ఇలాంటి చాలా  దేశాల్లో మనకి రాయబార కార్యాలయాలు లేవు. అలాంటప్పుడు వ్యవహరం జరపడానికి వాటికి దగ్గరలోని మన దేశ ఎంబసీలు సహకారం అందిస్తాయి. రాయబార కార్యాలయాల్ని నడపడానికి చాలా ఖర్చులు అవుతాయి. కనుక అవసరం లేని దేశాల్లో అవి ఉండవని చెప్పాలి. రాజకీయంగా, వాణిజ్యపరంగా,వ్యూహాత్మకంగా అవసరమైన దేశాల్లో మాత్రమే పూర్తి సిబ్బంది తో పని చేస్తుంటాయి.

రాయబార కార్యాలయాలు ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు చేపట్టడం ఈ రోజుల్లో మనం చదువుతూనే ఉన్నాం. అలాంటి పరిణామాల నేపథ్యం లో రాయబార కార్యాల సిబ్బందిని బహిష్కరించడం కూడా జరుగుతుంది. మిత్ర దేశాల లో రాయబార సిబ్బందికి పెద్ద ప్రమాదం ఉండదు కాని ఉద్రిక్త సంబంధాలు ఉన్న దేశాల్లో దాడులు జరగడం కద్దు.వీటికి సంబంధించి అంతర్జాతీయ చట్టాలు ఉన్నా రక్షణ లేని సందర్భాలు ఉన్నాయి. ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయిన ఈ కాలం లో టూరిస్టులు అనేకమంది వివిధ దేశాలకి క్యూ కడుతుండటం తో ఇన్నాళ్ళపాటు ఏమీ పట్టనున్న కొన్ని దేశాలు కూడా ఇతర దేశాల్లో తమ రాయబార కార్యాలయాల్ని తెరుస్తున్నాయి. 


----- మూర్తి కెవివిఎస్              

5, అక్టోబర్ 2025, ఆదివారం

రస్కిన్ బాండ్ రాసిన ఓ చక్కని పుస్తకం

 రస్కిన్ బాండ్ రాసిన ద బ్లూ అంబరెల్ల అనే పుస్తకాన్ని చాలా వేగంగా చదివిన పుస్తకం గా చెప్పాలి. దీనికి రెండు ప్రధాన కారణాలు. బాండ్ యొక్క రచనలు మన బాల్యాన్ని కళ్ళ ముందు చూపుతాయి. అదే సమయం లో కథ నడిపే విధానం చాలా సహజంగా ఉంటుంది. ప్రకృతి వర్ణనలు ఎంతో గమనించితే తప్పా అంత అందంగా రాయలేరు.ముఖ్యంగా హిమాలయాల పర్వతాల కి చేరువ లో ఉన్న గ్రామాలు అక్కడి జీవితం మనకి అర్ధమవుతుంది. నిజానికి ఈ పుస్తకం పేజీల పరంగా చూస్తే చిన్నది.కానీ ఇందులోని పాత్రలు చదివిన తర్వాత చాలా రోజుల వరకు గుర్తుండిపోతాయి. బిన్యా,బిజ్జూ,రాం భరోసా,రాజారాం ప్రధాన పాత్రలు. ఈ కథ గఢ్వాల్ కొండ ప్రాంతం లోని ఓ గ్రామం లో నడుస్తూంది.


ఆ గ్రామం లో ఈ రకమైన అందంగా ఉండే గొడుగు ఎవరివద్దా లేదు. దానితో ప్రతి ఒక్కరు దానికేసి చూస్తుంటారు.బిన్యా ఎంతో అపురూపంగా దాన్ని కాపాడుకుంటూంది. తన ఫ్రెండ్స్ కి మాత్రం కాసేపు పట్టుకుండానికి ఇస్తుంది. నీలు ని మేపడానికి అడివి కి వెళ్ళినపుడు కూడా ఈ గొడుగు ఉండవలిసిందే. అలాంటి సమయం లో ఈ గొడుగు గాలీ దుమ్మూ లేచినపుడు కొట్టుకు పోయి పొడవైన గుట్ట మీద పడిపోతుంది.మొత్తానికి ఎంతో కష్టపడి గొడుగు ని దక్కించుకుంటుంది.

అలాంటి గొడుగు మీద రాం భరోసా అనే దుఖాణదారుని కళ్ళు పడతాయి. ఎన్నో రకాలుగా ఆశ చూపించి ఆ గొడుగు ఇమ్మన్నా బిన్యా ఇవ్వదు. అతని దగ్గర పని చేసే రాజారాం అనే కుర్రాడు బిన్యా పొలం పని లో ఉండగా దాన్ని కొట్టేస్తాడు.

అదే సమయం లో బిన్యా వాళ్ళ అన్న బిజ్జూ వీడిని పట్టుకుని నాలుగు పీకి గొడుగు తీసుకుంటాడు. రాం భరోసా నే ఈ సంఘటన వెనక ఉన్నదని గ్రామం అంతా తెలిసిపోతుంది. దాంతో ఈ వ్యాపారి దుఖాణానికి కొనడానికి గ్రామస్తులు ఎవరూ రారు. దాంతో జాలిపడి బిన్యా,బిజ్జూలు ఏ విధంగా మళ్ళీ అతనికి సాయం చేశారు అన్నది సస్పెన్స్. 

దానితో ఆ వ్యాపారి ఎంతో సంతోషించి వీళ్ళద్దరినీ ఎలా చక్కగా చూసుకున్నాడన్నది చివరిలో మనకి తెలుస్తుంది. కథ అంతా బోరు కొట్టకుండా ఏకబిగిన చదవాలనిపిస్తుంది. హిమాలయ గ్రామాల్లోని పూల చెట్లు,ఊరిలో ఉండే మొక్కలు ఇలాంటివి అన్నీ సందర్భానుసారంగా మనకి తెలుస్తాయి.అర్చనా శ్రీనివాసన్ వేసిన బొమ్మలు ఎంతో హాయిగా ఉన్నాయి.   

బిన్యా అనే చిన్న అమ్మాయి. సుమారు పదకొండు ఏళ్ళు. ఆమెకి బిజ్జూ అనే అన్నయ్య , వాడికి ఇంకో రెండేళ్ళు ఎక్కువ. వాళ్ళు పుట్టినప్పుడు ఎలాంటి తారీకులు నమోదు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి చదువులేదు కదా.వారి కుటుంబానికి కొద్ది భూమి ఉంటుంది.కొన్ని ఆవులు ఉంటాయి.వాటి మీదనే వారి జీవనం సాగుతుంది.ఒక ఆవు పేరు నీలు. ఆ ఆవు ని బిన్యా అడవి లో మేపుతుండగా , ఢిల్లీ నుంచి ఓ కుటుంబం ఆ అడివి లోకి వచ్చి విహార యాత్ర చేస్తుంటారు. 

దాంట్లో ఒకరి దగ్గర చక్కని నీలం రంగు లో ఉన్న గొడుగు కనబడుతుంది. అది బిన్యా కి ఎంతో నచ్చుతుంది. అలాగే ఆశ గా చూస్తూ నిలబడగా , విహార యాత్ర కి వచ్చిన వాళ్ళు ఆమెకి దాన్ని బహూకరిస్తారు. ఆ అమ్మాయికి ఎంతో ఆనందం కలిగి ,ఆమె దగ్గర ఉన్న పులిగోరు తో చేసిన వస్తువు ని ఇస్తుంది.       

 ఆ గ్రామం లో ఈ రకమైన అందంగా ఉండే గొడుగు ఎవరివద్దా లేదు. దానితో ప్రతి ఒక్కరు దానికేసి చూస్తుంటారు.బిన్యా ఎంతో అపురూపంగా దాన్ని కాపాడుకుంటూంది. తన ఫ్రెండ్స్ కి మాత్రం కాసేపు పట్టుకుండానికి ఇస్తుంది. నీలు ని మేపడానికి అడివి కి వెళ్ళినపుడు కూడా ఈ గొడుగు ఉండవలిసిందే. అలాంటి సమయం లో ఈ గొడుగు గాలీ దుమ్మూ లేచినపుడు కొట్టుకు పోయి పొడవైన గుట్ట మీద పడిపోతుంది.

మొత్తానికి ఎంతో కష్టపడి గొడుగు ని దక్కించుకుంటుంది.అలాంటి గొడుగు మీద రాం భరోసా అనే దుఖాణదారుని కళ్ళు పడతాయి. ఎన్నో రకాలుగా ఆశ చూపించి ఆ గొడుగు ఇమ్మన్నా బిన్యా ఇవ్వదు. అతని దగ్గర పని చేసే రాజారాం అనే కుర్రాడు బిన్యా పొలం పని లో ఉండగా దాన్ని కొట్టేస్తాడు.

అదే సమయం లో బిన్యా వాళ్ళ అన్న బిజ్జూ వీడిని పట్టుకుని నాలుగు పీకి గొడుగు తీసుకుంటాడు. రాం భరోసా నే ఈ సంఘటన వెనక ఉన్నదని గ్రామం అంతా తెలిసిపోతుంది. దాంతో ఈ వ్యాపారి దుఖాణానికి కొనడానికి గ్రామస్తులు ఎవరూ రారు. దాంతో జాలిపడి బిన్యా,బిజ్జూలు ఏ విధంగా మళ్ళీ అతనికి సాయం చేశారు అన్నది సస్పెన్స్. 

దానితో ఆ వ్యాపారి ఎంతో సంతోషించి వీళ్ళద్దరినీ ఎలా చక్కగా చూసుకున్నాడన్నది చివరిలో మనకి తెలుస్తుంది. కథ అంతా బోరు కొట్టకుండా ఏకబిగిన చదవాలనిపిస్తుంది. హిమాలయ గ్రామాల్లోని పూల చెట్లు,ఊరిలో ఉండే మొక్కలు ఇలాంటివి అన్నీ సందర్భానుసారంగా మనకి తెలుస్తాయి.అర్చనా శ్రీనివాసన్ వేసిన బొమ్మలు ఎంతో హాయిగా ఉన్నాయి.   

( A book I have read the fastest)

22, సెప్టెంబర్ 2025, సోమవారం

మళయాళ చిత్రసీమ లో కేవలం ఇద్దరే ఆ అవార్డ్ పొందారంటే చిత్రమే!


 ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఈ నెల 20 తేదీన 2023 ఏడాదికి గాను ఆయనకి ఈ అవార్డ్ ని ప్రదానం చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. విచిత్రం ఏమిటంటే ఇప్పటిదాకా మళయాళ చిత్రసీమ లో కేవలం ఇద్దరు మాత్రమే ఈ సినిమా రంగానికి చెందిన అత్యున్నత అవార్డ్ ని పొందారు. మొదటి వ్యక్తి ప్రఖ్యాత మళయాళ దర్శకుడు ఆడూర్ గోపాల కృష్ణన్ కాగా రెండవ వ్యక్తి ప్రస్తుతం మోహన్ లాల్. అనేకమంది ఉద్ధండులైన దర్శకులు, నటులు ఉన్న ఆ చిత్రసీమ లో కేవలం ఇద్దరు మాత్రమే పొందడం చాలామందిని ఆశ్చర్యపరిచే అంశం.

ఈ రోజు ఫాల్కే పురస్కారం అందుకోబోతున్న మోహన్ లాల్ తన 60 ఏళ్ళ జీవితం లో 350 కి పైగా సినిమాల్లో, అదీ వివిధ భాషలకి చెందిన సినిమాల్లో నటించారు. తమిళ, మళయాళ ఇంకా ఇతర సినీ అభిమానులు ఓ వైపు పొగడ్తలతో ముంచెత్తుతుండగా, మరో వైపు ఆయన్ని విమర్శ చేస్తున్నవారూ ఉన్నారు. 74 ఏళ్ళ మమ్మూట్టి కి దాదా సాహెబ్ ఫాల్కే ఎప్పుడో ఇవ్వవలసి వుందని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో బాధ వ్యక్తం చేస్తున్నారు. అయితే మమ్మూట్టి మటుకు మోహన్ లాల్ కి ఫాల్కె రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మెసేజ్ చేశారు. తమిళ ప్రేక్షకులు కమల్ హాసన్ కి ఈ అవార్డ్ ఇంకా ఇవ్వకపోడం దారుణం అని పోస్టులు పెడుతున్నారు.  

మోహన్ లాల్ విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయి లో ఉత్తమ నటుడిగా నాలుగుసార్లు అవార్డులు అందుకున్నారు. పద్మశ్రీ,పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. ఇండియన్ ఆర్మీ ఆయనకి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ని 2009 లో ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని పొందిన ఏకైక దక్షిణాది నటుడు మోహన్ లాల్. కాలడి యూనివర్శిటి గౌరవ డాక్టరేట్ ని 2010 లో ప్రదానం చేసింది. సంస్కృత భాష లో నాటకాలు వేసి ఆయన ఆ భాషకి చేసిన సేవ కి గాను ఆ గౌరవం దక్కింది. కొంతకాలం సంస్కృత భాష లో వార్తలు కూడా చదివారు.

మోహన్ లాల్ నటించిన 350 కి పైగా సినిమాల్లో తప్పనిసరిగా చూడవలసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. మళయాళం లో వచ్చిన తన్మాత్ర, వానప్రస్థం, భ్రమరం, కిరీడం, బాలెట్టాన్, కిరీడం, భరతం వంటి సినిమాలు ఆయన నటనా జీవితం లో ఆణిముత్యాలు లాంటివి. దృశ్యం పేరు తో వచ్చిన రెండు సినిమాలు అబాలగోపాలాన్ని అలరించడమే గాక,తెలుగు ఇంకా హిందీ లో కూడా రీమేక్ అయ్యాయి.ప్రస్తుతం దృశ్యం కి మూడవ ఎపిసోడ్ తయారవుతోంది. అదీ కూడా హిట్ అయి అందర్నీ అందర్నీ అలరించాలని కోరుకుందాం.      

22, జూన్ 2025, ఆదివారం

దక్షిణ కొరియన్లు భారతీయుల్ని చిన్నచూపు చూస్తున్నారా ?


దక్షిణ కొరియన్లు భారతీయుల్ని చిన్నచూపు చూస్తున్నారా ? 

-------------------------------------------------------------------------

 ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. దక్షిణ కొరియా దేశస్తులు భారతీయుల్ని చిన్న చూపు చూస్తున్నారని, వారు ఆసియా వాసులే అయినప్పటికీ మనల్ని అలా ట్రీట్ చేయడం ఏమిటి అని ఎవరికైనా కోపం వస్తుంది. మన దేశం లో వాళ్ళ పరిశ్రమలు ఉన్న చోట వాళ్ళ క్యాంటిన్ ల లోకి కూడా అడుగుపెట్టనివ్వరని కూడా చదివాము. ఈ మాట నిజమే అయినప్పటికీ దీని వెనుక కొన్ని నిజాలు ఉన్నాయి. అవి మనం అర్థం చేసుకోవాలి. 50 వ దశకం వరకు పెద్దగా అభివృద్ధి చెందని ఈదేశం, ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రగతి పథం లో పయనిస్తూ ఎల్.జి., హ్యూండాయ్, సాం సంగ్, పోస్కో లాంటి వ్యాపార దిగ్గజాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగిపోతోంది.

అంతేకాదు కొరియన్ సినిమాలు, డ్రామాలు, మ్యూజిక్ ఈ మధ్య మన దేశం లో బాగా ఆదరణ పొందుతున్నాయి. దక్షిణ కొరియా దేశం మొత్తం మీద ఒకే భాష,ఒకే సంస్కృతి లా ఉంటుంది.మొన్న మొన్నటి దాకా ఇంగ్లీష్ భాష కూడా ఎవరికీ రాదు. ఈ తరం వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పోటీ పడుతున్నారు. దాని కోసం ఇబ్బడి ముబ్బడి గా సంస్థలు ఆవిర్భవించి డబ్బు చేసుకుంటున్నాయి. మరి మీరు ఇండియన్స్ ని చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు, రంగు తక్కువ అని అహంకారం ప్రదర్శిస్తున్నారా అని మన వాళ్ళు అడిగితే వాళ్ళ సమాధానం ఏమిటంటే , మా దేశస్తులు తరతరాలుగా విదేశాలు వెళ్ళింది తక్కువ. మా కంటే భిన్నంగా ఉన్నవారిని ఎలా ట్రీట్ చేయాలి అనేది తెలియదు.

వియాత్నం , ఫిలిప్పిన్స్ వాళ్ళని కూడా చిన్న చూపు చూస్తారు ,ఎందుకంటే ఆర్ధికంగా వాళ్ళు వెనకబడి ఉన్నందువల్ల అలా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నవాళ్ళలో అలా ఎవరూ లేరు. ఉంటే గింటే చాలా తక్కువ. ఇండియన్స్ చాలా కాలం నుంచి విదేశాలకి వెళ్ళడం,ఇంగ్లీష్ నేర్చుకొని ఎక్కువ బయటి ప్రపంచం తో మెలగడం ఇవన్నీ ఉన్నాయి,కానీ మా దక్షిణ కొరియా వాళ్ళకి అలాంటి కోణం లేదు. నిజానికి మాకు ఇండియా గురించి చాలా తక్కువ తెలుసు. గత తరాల వాళ్ళ విషయానికొస్తే మరీ దారుణం. బుద్ధుడు , యోగా లాంటి ఏవో కొన్ని అంశాలు తప్పా ఇంకేమీ తెలియదు. చైనా , జపాన్ వాళ్ళ ని కూడా ఇండియన్స్ మాదిరిగానే చూస్తాం అంటూ దక్షిణ కొరియా వ్యక్తి చెప్పుకొచ్చాడు.         

 ప్రస్తుతం దక్షిణ కొరియా దేశం లో యువత కి ప్లాస్టిక్ సర్జరీ మోజు బాగా ముదిరింది. ఏ మాత్రం అవయవం బాగా లేదనుకున్నా ఆపరేషన్ తో సరిజేయించుకుంటున్నారు. సియోల్ లో ఈ కాస్మటిక్ సర్జరీ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా ఉన్నది. ప్రపంచం లో అతి తక్కువ ఒబేసిటి ఉన్న జనాలు ఈ దేశం లోనే ఉన్నారు.శరీరం గురించి అంత శ్రద్ధ అన్నమాట. మగవాళ్ళు గానీ ఆడవాళ్ళు గానీ మేకప్ లేనిదే బయటకి రారు. బాగా పరిశీలించి చూసినట్లయితే సాంస్కృతికంగా మన దేశానికి దక్షిణ కొరియా కి దగ్గరి బాంధవ్యం ఉన్నది. 

తరతరాలుగా ఇక్కడ ఆచారం ఏమిటంటే తమ కన్నా పెద్ద వయసు వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడతారు. అందుకే ఎదుటి వారిని కలిసిన వెంటనే వాళ్ళ వయసు అడుగుతారు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు బయట విడుస్తారు. ఏదీ ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా రెండు చేతులతో చేస్తారు. ఒక్క చెయ్యి ఉపయోగిస్తే అమర్యాద గా భావిస్తారు. పౌర్ణమి రోజున బుద్ధ జయంతి జరుపుకుంటారు. కంఫ్యూషియస్ బోధనల ప్రభావం ఎక్కువ గా ఆ సమాజం మీద ఉన్నది. 

----- మూర్తి కెవివిఎస్ 

19, మే 2025, సోమవారం

కొకైన్ తయారి లో ఆ మూడు దేశాల పాత్ర

కొకైన్ తయారి లో ఆ మూడు దేశాల పాత్ర

------------------------------------------------------

 ఈ మధ్య కాలం లో ఓ మహిళా వైద్యురాలు 53 గ్రాముల కొకైన్ తో పట్టుబడడం తో అసలు ఈ మత్తు పదార్థానికి ఇంతటి అధికారం ఏమిటి మానవ దేహం మీద, అనే అనుమానం రాకమానదు. కొకైన్ డోస్ 30 నుంచి 70 మిల్లీగ్రాములు తీసుకుంటే చాలు, రెండు లేదా మూడు నిమిషాల్లో మెదడు లో స్వైర కల్పనలు మొదలయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. పోను పోను అలవాటు ముదిరితే 1 గ్రాము వరకు ఒకే దెబ్బ లో తీసుకోగలరు. అంతకి మించి 2 గ్రాముల వరకు ఒకేసారి తీసుకుంటే చావు బ్రతుకుల మధ్య ఉన్నట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు.

ప్రతిరోజు 5 గ్రాముల దాకా విడతలు విడతలుగా తీసుకునే వారి శరీరం లో అనేక అవయవాలు దెబ్బతింటాయి.కిడ్నీలు, ప్రేవులు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కేంద్ర నాడీమండల వ్యవస్థ పాడయి మానసిక భ్రాంతులు కలగడం,వణుకు రావడం,ఊపిరి పీల్చడం లో ఇబ్బందులు ఇలా ఎన్నో రుగ్మతలు వస్తాయి. సాధారణం గా కొకైన్ ని ముక్కు తో పీల్చడం ద్వారా,ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా, సిగరెట్లలో పెట్టి తీసుకుంటారు. తీసుకున్నతర్వాత ఒక్కొక్కరికి రకరకాల తేడాలతో భ్రాంతులు కలుగుతాయి. ఆ హాయి కోసమే ముందు అలవాటయి అది ముదిరిన తర్వాత వారి జీవితం ఎలా ముగుస్తుందో తెలియని దశ కి చేరుకుంటారు.

కోకా ఆకులు నుంచి కొకైన్ ని తయారు చేస్తారు. కొలంబియా, పెరూ, బొలీవియా వంటి దేశాల్లో ఈ కోకా పంట విరివిగా పండుతుంది.మొట్టమొదట స్థానికులు అజీర్ణానికి, చురుకు గా ఉండటానికి ఈ ఆకుల్ని మందుగా నమిలేవారు.అయితే జర్మన్ రసాయన శాస్త్రవేత్త అల్బర్ట్ నీమన్ ఒకసారి ఈ ఆకుల్ని నమలగా విచిత్ర అనుభూతి కలిగింది. దాంతో ఆయన కోకా ఆకుల్లోనుంచి రసాన్ని పిండి , దానికి కొన్ని రసాయనాలు కలిపి కొకైన్ అనే తెల్లటి పదార్థాన్ని 1860 లో తయారు చేశాడు.ఆ విధం గా ఇపుడు మనం చూసే కొకైన్ పుట్టింది. ఫ్రెంచ్ రసాయన శాస్రవేత్త ఏంజిలో మరియాని దీనితో ఓ టానిక్ ని తయారు చేశాడు.

మొదట్లో కోకా కోల పానీయం లో కూడా వాడేసిన కోకా ఆకుల్ని వినియోగించేవారు.1920 తర్వాత నుంచి దీన్ని నిలిపివేశారు.ఒక కిలోగ్రాం కొకైన్ తయారు చేయాలంటే వెయ్యి కిలోగ్రాముల కోకా ఆకులు కావాలి. దానికి మరిన్ని రసాయనాలు కలుపుతారు.ప్రపంచం లోని మొత్తం కొకైన్ లో 70 శాతం పైగా ఒక్క కొలంబియా లోనే తయారవుతుంది. ఆ తర్వాత స్థానం పెరూ, బొలీవియా దేశాలది. కేవలం ఈ కొకైన్ వల్లనే కొలంబియా దేశం వారానికి 400 మిలియన్ డాలర్లు ఆర్జిస్తుంది. దక్షిణ అమెరికా ఖండం లోని ఆ మూడు దేశాలు కొకైన్ ని బయటకి పంపిన తర్వాత ప్రపంచ మార్కెట్ లో దాని విలువ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది.           

మత్తు పదార్థాలు అన్నిటిలోనూ దీనికి గల ప్రాముఖ్యత వల్ల షాంపేన్ ఆఫ్ డ్రగ్స్ అని ముద్దుగాపిలుస్తారు. 1970 వరకు కేవలం మందుల తయారీ లోనే ఎక్కువగా వాడేవారు. అమెరికా లో కొకైన్ కి లభించిన పాపులారిటీ వల్ల , ముఖ్యంగా పాప్ సంగీతకారులు, ప్రముఖులు తీసుకోవడం వల్ల మీడియా లో హైప్ వచ్చి దేశదేశాలు విస్తరించింది. ఒక దశలో అంటే 1982 ప్రాంతం లో కోటి నలభై లక్షల మంది అమెరికా లోని ప్రజలు దీనికి బానిసలయ్యారు. ప్రస్తుతం ఈ కొకైన్ డ్రగ్ మాఫియా ప్రపంచం లోని చాలా దేశాలకి విస్తరించింది. వివిధ మత్తు పదార్థాల సేవనం లో ఉత్తర్ ప్రదేశ్, బీహార్,కేరళ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర వరుసగా ముందంజ లో ఉన్నాయి. 

----- మూర్తి కెవివిఎస్ 

30, ఏప్రిల్ 2025, బుధవారం

నారాయణింటె మూణ్ణాన్ మక్కల్ (మళయాళ సినిమా రివ్యూ)

 


ఈ సినిమా ప్రస్తుతం ప్రైం అమెజాన్ లో ఉంది. ఈ సినిమా టైటిల్ అర్థం ఏమిటంటే నారాయణి యొక్క ముగ్గురు కుమారులు అని. చాలా వాస్తవికంగా, రోజువారీ మన చుట్టూ జరిగే సంఘటనలతో మంచి కథ అల్లుకుని ఒక దృశ్యకావ్యంగా చిత్రీకరించారు. ఒక చక్కని గ్రామం. తెలుసు కదా,కేరళ గ్రామాలు పచ్చదనం తో ఎంత కనువిందుగా ఉంటాయో. అలాంటి ఓ గ్రామం లో ,కొయిలాండి అనే గ్రామం లో , నారాయణి అనే వృద్ధురాలు ఉంటుంది. ఆమె చివరి దశకి వస్తుంది.అన్నీ మంచం మీదనే అనేంత అనారోగ్యం తో ఉంటుంది.

ఆమెకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఆ గ్రామం లోనే ఉన్న ఆస్తిపాస్తుల్ని చూసుకుంటూ గడుపుతుంటాడు. అతని పేరు విశ్వనాథన్.తనకి భార్య, ఓ కుమార్తె ఉంటారు. రెండవ కొడుకు సేతు ,అతను అదే ఊళ్ళో కిరాణా షాపు నడుపుతుంటాడు. ఇక మూడవ కొడుకు భాస్కరన్. మతాంతర వివాహం చేసుకుని లండన్ లో సెటిల్ అవుతాడు. తల్లి కి బాగా లేకపోవడం తో ఈ ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఆమె కోసమే భాస్కరన్ లండన్ నుంచి వస్తాడు.

వీరికి అంతకు ముందే దాదాపు అన్ని కుటుంబాల్లో ఉన్నట్లు చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి. తప్పక ఒక గూటి కింద ఉంటూంటారు. మళ్ళీ అవి సెగలు రేపుతుంటాయి.కాని రెండో కొడుకు వాటిని సరిదిద్దుతుంటాడు. భాస్కరన్ కొడుకు , విశ్వనాథన్ కుమార్తె తో ప్రేమ లో పడటం దుమారం లేపుతుంది. ఈ ఇద్దరు పిల్లలు అంతకు ముందు ఓసారి ప్రేమ లో పడి ఫెయిల్ అయి ఉంటారు. తల్లి తొందరగా మరణిస్తే తను విమానం ఎక్కొచ్చని భాస్కరన్ చూస్తుంటాడు. ఈ మధ్య కాలం లో జరిగిన సంఘటనల్ని ఫేమిలీ డ్రామా గా తీర్చిదిద్దాడు దర్శకుడు శరణ్ వేణుగోపాల్. 

ఈ సినిమా లో చెప్పుకోవలసినదేమిటంటే మన జీవితాల్లో ఎదురయ్యే వాస్తవిక ఘటనల్ని ఎలా చక్కని కథ గా మలుచుకోవచ్చు అని. ప్రత్యేకించి హీరోలు గాని విలన్లు గాని ఎవరూ ఉండరు. జీవితం లోని కొన్ని ముక్కలు ఏరి ఆసక్తిదాయకంగా మలిచారు. మళయాళీ సమాజం లోని జీవన వైఖరి ని , చక్కని లొకేషన్లు ఉన్న గ్రామం లో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సినిమాటోగ్రఫీ జ్యోతి స్వరూప్ పండా , సంగీతం రాహుల్ రాజ్ సినిమాకి తమ పనితనం తో నిండుతనం కలిగించారు. సేతు గా నటించిన జోజు జార్జ్ అదనం గా మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చు. సూరజ్, అలెన్షియర్ లే లోపెజ్ వారి పాత్రల్ని గుర్తుండిపోయేలా నటించారు.  

--- murthy

1, ఏప్రిల్ 2025, మంగళవారం

బీహారీలు ఎందుకు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారు?


బీహారీలు ఎందుకు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారు? 

---------------------------------------------------------------------------------

 బీహార్ రాష్ట్రానికి చెందిన శ్రామికులు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో బాగా కనిపిస్తున్నారు. మొత్తం వలస వెళ్ళిన ఆ రాష్ట్రీయులు రెండు కోట్ల డబ్భై రెండు లక్షల పై చిలుకు ఉన్నారు.ఇది 2011 గణాంకాల ప్రకారం చెబుతున్నది. అంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయవచ్చు. బుద్దుడు జ్ఞానోదయం పొందిన భూమి,చాణక్యుడు నడయాడిన నేల,నలంద వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు వర్ధిల్లిన చోట ఏమిటి ఈ వైపరీత్య పరిస్థితులు అంటే అనేక కారణాలు ఉన్నాయి. వలస బాట పడుతున్న వారి లో ఎక్కువ గా అహిర్,కుర్మీ,కల్వర్,భర్,దుసాద్,నునియ, బైండ్, చమర్ వంటి సామాజిక వర్గాల వారు ఉన్నారు.

బ్రిటీష్ వారి హయాం లో వర్ధిల్లిన జమీందారీ వ్యవస్థ లో దీనికి అంకురార్పణ జరిగింది. అప్పటి జమీందారులు కింది స్థాయి లో ఉన్న రైతులకి నీటి వనరులు కల్పించడం లో గాని,పంటలు పండించే విషయం లో విత్తనాలు,పెట్టుబడి లాంటివి అందించడం చేయలేదు.క్రమేణా గ్రామీణా వ్యవస్థ కుప్ప కూలుతూ వచ్చింది. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చిన తర్వాత కూడా సరైన ముందుచూపు ఉన్న రాజకీయ నాయకులు రాలేదు.దానికి తోడు కరుడు కట్టిన కులతత్వ ప్రయోజనాలు చూసుకునే వారి హయాం లో కింది, మధ్య తరగతి వర్గాలు దారిద్ర్యం లో కునారిల్లాయి. ధనం కోసం హత్యలు,కిడ్నాపులు చేయడం రోజువారీ కార్యక్రమాలయ్యాయి. వారందరికీ ప్రభుత్వం లోని పెద్దల ఆశీస్సులు ఉండేవి.

బీహార్ లో పరిశ్రమలు పెట్టడం అంటే కత్తి మీద సాము వంటిది. చిన్న, పెద్ద ఏ బిజినెస్ నడవాలన్నా లోకల్ మాఫియా కి రంగ్ ధారి అనే టాక్స్ చెల్లించాలి.లేకపోతే ఏ వ్యాపారాన్ని చేసుకోనివ్వరు. ఒకప్పుడు రాజ్ పుత్ ల, భూమి హార్ బ్రాహ్మణుల హవా నడిచేది. ప్రస్తుతం యాదవ్ లేదా కుర్మీ వర్గాల హవా నడుస్తున్నది. లల్లూ ప్రసాద్,నితీష్ కుమార్ వంటి వెనుకబడిన వర్గాల నేతలు ముఖ్యమంత్రులు అయిన తర్వాత కొంత మార్పు వచ్చినప్పటికీ పెట్టుబడులు మిగతా రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నట్లుగా ఇక్కడ జరగడం లేదు. దానితో జీవనోపాధి కోసం ప్రజలు వలస బాట పడుతున్నారు.

కేరళ వంటి రాష్ట్రం లో ఈరోజున బీహారీలు 30 లక్షల మంది దాకా ఉన్నారు. నిర్మాణ రంగం లోనూ, ఇతర రోజువారీ పనులు చేయడం లోనూ ఉపాధి పొందుతున్నారు.అక్కడి యువత గల్ఫ్ దేశాలకి,ఇతర ప్రాంతాలకి ఎక్కువగా వెళుతుండటం తో వారి లేని లోటు ని బీహారీలు పూరిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్,అస్సాం,ఢిల్లీ, మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్,ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాల్లోనూ గణనీయం గా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పనుల్లోకి కూడా ఆయా సీజన్ లలో వస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లో 12 లక్షలమంది బీహారీలు నివసిస్తున్నారు.      

పరిశ్రమలు పెద్దగా లేకపోవడం,కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ గా వరదలు రావడం,సరైన మౌలిక వసతులు లేకపోవడం,రాజకీయాల్లో నేరస్వభావం ఎక్కువగా పెరగడం ఇలా అనేక కారణాల వల్ల చదువుకున్న వాళ్ళు , చదువుకోని వాళ్ళు కూడా రాష్ట్రం విడిచిపెట్టి వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేవారు ఎక్కువ సంఖ్య లో ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి స్వగ్రామం వచ్చేటపుడు కూడా బీహారీలు ఒంటరిగా రారు. గుంపు గా వస్తారు. 

లేదంటే దారి కాచి దోపిడీ చేసే దొంగలు వీరు సంపాదించినదంతా తుపాకీ చూపించి దోచుకుంటారు. భూమి తగాదాల్లో ఎక్కువ మర్డర్లు,కిడ్నాప్ లు జరిగేది ఇక్కడే. డబ్బున్న కుటుంబం అని తెలిస్తే చాలు పిల్లల్ని,మహిళల్ని కిడ్నాప్ లు చేస్తారు. చాలా వరకు తగినంత సెక్యూరిటీ లేకుండా బయటకి రావడానికి సాహసించరు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తమ రాష్ట్రం కూడా అభివృద్ధి లో ముందుకు సాగాలని , శాంతి భద్రతలు మెరుగుపడాలని వలసవెళ్ళిన ఆ బీహారీలకి మాత్రం అనిపించదా? ఆ మంచి రోజులు రోజులు రావాలని ఆశిద్దాం.

----- మూర్తి కెవివిఎస్