Pages

30, ఏప్రిల్ 2025, బుధవారం

నారాయణింటె మూణ్ణాన్ మక్కల్ (మళయాళ సినిమా రివ్యూ)

 


ఈ సినిమా ప్రస్తుతం ప్రైం అమెజాన్ లో ఉంది. ఈ సినిమా టైటిల్ అర్థం ఏమిటంటే నారాయణి యొక్క ముగ్గురు కుమారులు అని. చాలా వాస్తవికంగా, రోజువారీ మన చుట్టూ జరిగే సంఘటనలతో మంచి కథ అల్లుకుని ఒక దృశ్యకావ్యంగా చిత్రీకరించారు. ఒక చక్కని గ్రామం. తెలుసు కదా,కేరళ గ్రామాలు పచ్చదనం తో ఎంత కనువిందుగా ఉంటాయో. అలాంటి ఓ గ్రామం లో ,కొయిలాండి అనే గ్రామం లో , నారాయణి అనే వృద్ధురాలు ఉంటుంది. ఆమె చివరి దశకి వస్తుంది.అన్నీ మంచం మీదనే అనేంత అనారోగ్యం తో ఉంటుంది.

ఆమెకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఆ గ్రామం లోనే ఉన్న ఆస్తిపాస్తుల్ని చూసుకుంటూ గడుపుతుంటాడు. అతని పేరు విశ్వనాథన్.తనకి భార్య, ఓ కుమార్తె ఉంటారు. రెండవ కొడుకు సేతు ,అతను అదే ఊళ్ళో కిరాణా షాపు నడుపుతుంటాడు. ఇక మూడవ కొడుకు భాస్కరన్. మతాంతర వివాహం చేసుకుని లండన్ లో సెటిల్ అవుతాడు. తల్లి కి బాగా లేకపోవడం తో ఈ ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఆమె కోసమే భాస్కరన్ లండన్ నుంచి వస్తాడు.

వీరికి అంతకు ముందే దాదాపు అన్ని కుటుంబాల్లో ఉన్నట్లు చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి. తప్పక ఒక గూటి కింద ఉంటూంటారు. మళ్ళీ అవి సెగలు రేపుతుంటాయి.కాని రెండో కొడుకు వాటిని సరిదిద్దుతుంటాడు. భాస్కరన్ కొడుకు , విశ్వనాథన్ కుమార్తె తో ప్రేమ లో పడటం దుమారం లేపుతుంది. ఈ ఇద్దరు పిల్లలు అంతకు ముందు ఓసారి ప్రేమ లో పడి ఫెయిల్ అయి ఉంటారు. తల్లి తొందరగా మరణిస్తే తను విమానం ఎక్కొచ్చని భాస్కరన్ చూస్తుంటాడు. ఈ మధ్య కాలం లో జరిగిన సంఘటనల్ని ఫేమిలీ డ్రామా గా తీర్చిదిద్దాడు దర్శకుడు శరణ్ వేణుగోపాల్. 

ఈ సినిమా లో చెప్పుకోవలసినదేమిటంటే మన జీవితాల్లో ఎదురయ్యే వాస్తవిక ఘటనల్ని ఎలా చక్కని కథ గా మలుచుకోవచ్చు అని. ప్రత్యేకించి హీరోలు గాని విలన్లు గాని ఎవరూ ఉండరు. జీవితం లోని కొన్ని ముక్కలు ఏరి ఆసక్తిదాయకంగా మలిచారు. మళయాళీ సమాజం లోని జీవన వైఖరి ని , చక్కని లొకేషన్లు ఉన్న గ్రామం లో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సినిమాటోగ్రఫీ జ్యోతి స్వరూప్ పండా , సంగీతం రాహుల్ రాజ్ సినిమాకి తమ పనితనం తో నిండుతనం కలిగించారు. సేతు గా నటించిన జోజు జార్జ్ అదనం గా మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చు. సూరజ్, అలెన్షియర్ లే లోపెజ్ వారి పాత్రల్ని గుర్తుండిపోయేలా నటించారు.  

--- murthy

1, ఏప్రిల్ 2025, మంగళవారం

బీహారీలు ఎందుకు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారు?


బీహారీలు ఎందుకు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారు? 

---------------------------------------------------------------------------------

 బీహార్ రాష్ట్రానికి చెందిన శ్రామికులు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో బాగా కనిపిస్తున్నారు. మొత్తం వలస వెళ్ళిన ఆ రాష్ట్రీయులు రెండు కోట్ల డబ్భై రెండు లక్షల పై చిలుకు ఉన్నారు.ఇది 2011 గణాంకాల ప్రకారం చెబుతున్నది. అంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయవచ్చు. బుద్దుడు జ్ఞానోదయం పొందిన భూమి,చాణక్యుడు నడయాడిన నేల,నలంద వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు వర్ధిల్లిన చోట ఏమిటి ఈ వైపరీత్య పరిస్థితులు అంటే అనేక కారణాలు ఉన్నాయి. వలస బాట పడుతున్న వారి లో ఎక్కువ గా అహిర్,కుర్మీ,కల్వర్,భర్,దుసాద్,నునియ, బైండ్, చమర్ వంటి సామాజిక వర్గాల వారు ఉన్నారు.

బ్రిటీష్ వారి హయాం లో వర్ధిల్లిన జమీందారీ వ్యవస్థ లో దీనికి అంకురార్పణ జరిగింది. అప్పటి జమీందారులు కింది స్థాయి లో ఉన్న రైతులకి నీటి వనరులు కల్పించడం లో గాని,పంటలు పండించే విషయం లో విత్తనాలు,పెట్టుబడి లాంటివి అందించడం చేయలేదు.క్రమేణా గ్రామీణా వ్యవస్థ కుప్ప కూలుతూ వచ్చింది. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చిన తర్వాత కూడా సరైన ముందుచూపు ఉన్న రాజకీయ నాయకులు రాలేదు.దానికి తోడు కరుడు కట్టిన కులతత్వ ప్రయోజనాలు చూసుకునే వారి హయాం లో కింది, మధ్య తరగతి వర్గాలు దారిద్ర్యం లో కునారిల్లాయి. ధనం కోసం హత్యలు,కిడ్నాపులు చేయడం రోజువారీ కార్యక్రమాలయ్యాయి. వారందరికీ ప్రభుత్వం లోని పెద్దల ఆశీస్సులు ఉండేవి.

బీహార్ లో పరిశ్రమలు పెట్టడం అంటే కత్తి మీద సాము వంటిది. చిన్న, పెద్ద ఏ బిజినెస్ నడవాలన్నా లోకల్ మాఫియా కి రంగ్ ధారి అనే టాక్స్ చెల్లించాలి.లేకపోతే ఏ వ్యాపారాన్ని చేసుకోనివ్వరు. ఒకప్పుడు రాజ్ పుత్ ల, భూమి హార్ బ్రాహ్మణుల హవా నడిచేది. ప్రస్తుతం యాదవ్ లేదా కుర్మీ వర్గాల హవా నడుస్తున్నది. లల్లూ ప్రసాద్,నితీష్ కుమార్ వంటి వెనుకబడిన వర్గాల నేతలు ముఖ్యమంత్రులు అయిన తర్వాత కొంత మార్పు వచ్చినప్పటికీ పెట్టుబడులు మిగతా రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నట్లుగా ఇక్కడ జరగడం లేదు. దానితో జీవనోపాధి కోసం ప్రజలు వలస బాట పడుతున్నారు.

కేరళ వంటి రాష్ట్రం లో ఈరోజున బీహారీలు 30 లక్షల మంది దాకా ఉన్నారు. నిర్మాణ రంగం లోనూ, ఇతర రోజువారీ పనులు చేయడం లోనూ ఉపాధి పొందుతున్నారు.అక్కడి యువత గల్ఫ్ దేశాలకి,ఇతర ప్రాంతాలకి ఎక్కువగా వెళుతుండటం తో వారి లేని లోటు ని బీహారీలు పూరిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్,అస్సాం,ఢిల్లీ, మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్,ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాల్లోనూ గణనీయం గా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పనుల్లోకి కూడా ఆయా సీజన్ లలో వస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లో 12 లక్షలమంది బీహారీలు నివసిస్తున్నారు.      

పరిశ్రమలు పెద్దగా లేకపోవడం,కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ గా వరదలు రావడం,సరైన మౌలిక వసతులు లేకపోవడం,రాజకీయాల్లో నేరస్వభావం ఎక్కువగా పెరగడం ఇలా అనేక కారణాల వల్ల చదువుకున్న వాళ్ళు , చదువుకోని వాళ్ళు కూడా రాష్ట్రం విడిచిపెట్టి వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేవారు ఎక్కువ సంఖ్య లో ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి స్వగ్రామం వచ్చేటపుడు కూడా బీహారీలు ఒంటరిగా రారు. గుంపు గా వస్తారు. 

లేదంటే దారి కాచి దోపిడీ చేసే దొంగలు వీరు సంపాదించినదంతా తుపాకీ చూపించి దోచుకుంటారు. భూమి తగాదాల్లో ఎక్కువ మర్డర్లు,కిడ్నాప్ లు జరిగేది ఇక్కడే. డబ్బున్న కుటుంబం అని తెలిస్తే చాలు పిల్లల్ని,మహిళల్ని కిడ్నాప్ లు చేస్తారు. చాలా వరకు తగినంత సెక్యూరిటీ లేకుండా బయటకి రావడానికి సాహసించరు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తమ రాష్ట్రం కూడా అభివృద్ధి లో ముందుకు సాగాలని , శాంతి భద్రతలు మెరుగుపడాలని వలసవెళ్ళిన ఆ బీహారీలకి మాత్రం అనిపించదా? ఆ మంచి రోజులు రోజులు రావాలని ఆశిద్దాం.

----- మూర్తి కెవివిఎస్

 

16, మార్చి 2025, ఆదివారం

ఏనుగు గురించి తెలుసుకుందాం!


ఏనుగు గురించి తెలుసుకుందాం!

-------------------------------------------------------

 భూమి మీద నడిచే అతి పెద్ద జంతువు ఏది అంటే ఏనుగు అని చెప్పవలసిందే! ఎన్నో వందల ఏళ్ళ క్రితం నుంచే మనిషికి, ఏనుగు కి విడదీయరాని అనుబంధం ఉంది.ఇతిహాసాల్లో, పురాణాల్లో సైతం ప్రముఖ స్థానమున్నది.పూర్వం రాజులు గజబలం పేరిట ఏనుగుల్ని యుద్ధాల్లో వినియోగించేవారు. ఒక్క మన దేశం లోనే కాదు థాయ్ లాండ్ వంటి దేశాల్లో ఏనుగు కి ఎంతో గౌరవం ఇస్తారు. బౌద్ధ మతం లో కూడా గజరాజు కి పవిత్ర స్థానం ఉన్నది. బుద్ధుడు జన్మించడానికి కొన్ని రోజులు ముందు ఆయన తల్లిగారికి ఓ తెల్ల ఏనుగు స్వప్నం లో దర్శనమిచ్చినందున బౌద్ధ సాహిత్యం లో,శిల్పాల్లో ఏనుగు కి ఎనలేని ప్రాముఖ్యమున్నది. ఇహ మన వినాయక స్వామి గురించి తెలియనిదెవరికి? 

అటువంటి ఏనుగు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఏనుగు కి ఉండే దంతాలు నిజానికి దానికి ఉండే పండ్లు, కాకపోతే అవి పెద్దగా బయటకి వచ్చి కనబడతాయి.దానివల్ల ఆ జంతువు కి ఎన్ని ఉపయోగాలో !ఏనుగు కి మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది.మీరు అద్దం లో దాని రూపాన్ని చూపిస్తే అది తనదే అని గుర్తుపడుతుంది.కేవలం అయిదు జంతువులు మాత్రమే అలా గుర్తుపడతాయి.స్పర్శించడం ద్వారా,శబ్దం చేయడం ద్వారా మిగతా వాటితో మాట్లాడతాయి.ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఆడ ఏనుగు గుంపు కి పెద్ద గా ఉంటుంది. 14 లేదా 15 ఏళ్ళు వచ్చినతర్వాత మగ ఏనుగులు ఆ మంద కి దూరం గా వెళ్ళిపోతాయి.

ఏనుగు మెదడు అయిదు కిలోల పైనే ఉంటుంది. సాధ్యమైనంత వరకు నీటి కి దగ్గర లో నివసిస్తాయి.వాటి దంతాల కోసం చాలా కాలం నుంచి మానవుడు వేటాడుతూనే ఉన్నాడు. అడవి లో 70 ఏళ్ళ పాటు జీవిస్తుంది. తోటి ఏనుగు కి దెబ్బ తగిలినా,జబ్బు చేసినా అవి బాధపడతాయి.తమ మంద లో ఉన్న ఏనుగు ఏదైనా చనిపోతే ,ఆ ప్రదేశానికి తరచు వెళ్ళి అంజలి ఘటించినట్లు ప్రవర్తిస్తాయి. ఏనుగులు తమ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాయి. ఏనుగు పిల్ల పుట్టిన తర్వాత మంద లో మిగతా ఏనుగులు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి. ఏనుగులు అడవి లో అయితే 200 కిలోల ఆహారం ,40 లీటర్ల నీటిని రోజూ తీసుకుంటాయి.

మూడు లేదా నాలుగు గంటల నిద్ర చాలు.అవి నిలబడి కూడా జోగుతుంటాయి. పుట్టిన అరగంట లోనే ఏనుగు పిల్ల నడుస్తుంది.కాని సరిగ్గా పాదం మోపడం,తొండం తో తినడం,నీళ్ళు తాగడం అనేవి చేయడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది.  అంటే తొమ్మిది నెలల దాకా ఆగవలసిందే. బుల్లి ఆడ ఏనుగులు ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ ఆటాడుకుంటాయి. బుల్లి మగ ఏనుగులు మాత్రం ఫైటింగులు చేసుకుంటూంటాయి. అయితే మంద లోని పెద్ద ఏనుగులన్నీ వీటి మీద ఓ కన్ను వేసి ఉంచుతాయి. ఆసియా జాతి ఏనుగులు,ఆఫ్రికా జాతి ఏనుగులు అని ప్రపంచం లోని ఏనుగుల్ని రెండు రకాలుగా విడదీశారు.

మనం తరచూ ఏనుగు మనుషుల మీద దాడిచేసినట్లు వార్తల్లో చూస్తుంటాం. ఏనుగు ఆకారం లో భారీ గా ఉన్నప్పటికీ సున్నిత స్వభావం గల జంతువు. స్ట్రెస్,ఆందోళన,రక్షణ లేకపోవడం,వాటి పిల్లల కి హాని కలుగుతుందనే భావన ఇలాంటి కారణాల వల్ల ఏనుగులు మనుషుల మీద దాడి చేస్తాయి.మన ఆసియా ఖండం లోని ఏనుగుల్ని శ్రీలంక,బోర్నియా,ఇండియా,సుమత్రా రకాలుగా విభజించారు. ఆఫ్రికా ఖండం లోని ఏనుగుల్ని పొదల్లో,అడవుల్లో నివసించే రకాలుగా విభజించారు.ఆఫ్రికా ఏనుగులు నాలుగు లక్షల పదిహేనువేల దాకా ఉండగా ఆసియా రకం ఏనుగులు నలభైవేల నుంచి యాభై వేలు మాత్రమే ఉన్నాయి.

----- మూర్తి కెవివిఎస్ 

9, మార్చి 2025, ఆదివారం

పానీ పూరి కి సైతం ఓ చరిత్ర ఉంది

పానీ పూరి కి సైతం ఓ చరిత్ర ఉంది

-------------------------------------------------

 పానీ పూరి అంటే తెలియనిది ఎవరికి ? రోడ్డు పక్కన అమ్మే ఈ తినుబండారాన్ని  యువతీ యువకులు ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. అసలు ఈ పానీ పూరి ఎక్కడ పుట్టిందో తెలుసా, ఖచ్చితం గా దక్షిణాది లో మాత్రం కాదని చాలా మందికి తెలుసు.అవును, ఇది ఉత్తర్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఆవిర్భవించింది. అక్కడి జానపదులు మహా భారతం లోని కుంతీ దేవికి,ద్రౌపది కి దీని తయారీ లో చోటిచ్చారు అంటే ఈ పానీ పూరి అనేది కొన్ని వందల ఏళ్ళ నుంచే తయారింపబడుతున్నదని అర్థం. 

ఒకరోజున కుంతీ దేవి కొంత గోధుమ పిండి,చిక్కుళ్ళు,కొత్తిమీర,ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు కోడలైన ద్రౌపది కి ఇచ్చి పాండవులందరికి నచ్చేలా ఏదైన వంటకం చేయమన్నదట. దాంతో ఆ కోడలు ఈ పానీ పూరి ని చేయడం తో అందరికీ విపరీతం గా నచ్చడం తో , నీ ఈ వంటకం ఎప్పటికీ భూలోకం లో నిలిచిపోతుందని కుంతీ దేవి ఆశీర్వాదం ఇచ్చిందని ఉత్తరాది లో ఓ కథ ఉన్నది.

అలా ప్రయాణం మొదలు పెట్టిన పానీ పూరి ముంబాయి,ఢిల్లీ,కోల్కత,బెంగళూరు,హైదరా బాద్,అహ్మదా బాద్,పూనే ఇలా మన దేశం లో అన్ని నగరాలకి పరుగులు తీసి , అంతటితో ఆగకుండా చిన్న పట్టణాలకి ,గ్రామాలకి సైతం వ్యాపించి ఎంతోమంది కి ప్రీతిపాత్రమైన స్ట్రీట్ ఫుడ్ గా నిలిచింది. చక్కని శుభ్రమైన నీరు,తాజా ఆలు,గోధుమ పిండి,చింతపండు, ఇంకా అవసరమైన కొత్తిమీర,ఉల్లి లాంటివి వాడితే పానీ పూరి తినడానికి చాలా బాగుంటుంది. అలా కాకుండా చవక రకం వి వాడితే మటుకు రుచి లో తేడా వస్తుంది. అంతే కాదు కడుపు లో నొప్పి కూడా వస్తుంది. దీంట్లో 51 కిలోకేలరీల శక్తి ఉంటుంది.58.3 శాతం కార్బో హైడ్రేట్స్,9.3 శాతం ప్రోటీన్స్ ఉంటాయి.

చాలా రాష్ట్రాల్లో రోడ్డు పక్కనే కాకుండా హోటల్స్ లా పెట్టి కూడా అమ్ముతుంటారు. కొన్ని ప్రాంతాల్లో గోల్ గప్పా అని అంటారు. మధ్య ప్రదేశ్ లో దీన్ని ఫుల్కీ అని,అస్సాం లో పుస్కా అని, బెంగాల్ లో పుచుక అని వ్యవహరిస్తారు. బీహార్ లో మాత్రం జల్ పూరీ అంటారు.గోధుమ పిండి తో చేసిన గుండ్రటి బంతి ,దాంట్లో ఉపయోగించే ఉడికించి నలిపేసిన ఆలు ,చిన్న చిక్కుళ్ళు,తరిగిన కొత్తిమీర,ఉల్లి ఇంకా ఇతర పదార్థాలు పానీ పూరి లో ఉపయోగిస్తారు. 

దీంట్లోనూ ఎన్నో ప్రయోగాలు చేసినవారున్నారు. చిన్నా పెద్ద,పేద ధనిక అనే తేడా లేకుండా ఎంతోమంది ఈ పానీ పూరి ని లాగిస్తుంటారు. దీనివల్ల సాఫీ విరోచనం అవుతుందని ప్రతీతి. ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళ లలో ఈ తినుబండారాన్ని అతిథులకి సప్లయ్ చేస్తారు.అలాంటి కాంట్రాక్టులు పొంది ఇబ్బడి ముబ్బడిగా సంపాదించిన వ్యాపారస్తులు ఎందరో!

మహారాష్ట్ర లోని జల్నా అనే పట్టణం లో  అలాంటి ఓ వ్యాపారి కాశీనాథ్ వామన్ రావు గాలీ! ఈయన గత 18 ఏళ్ళుగా ఈ పానీ పూరి వ్యాపారం చేస్తూ కోటీశ్వరుడయ్యాడు. వ్యాపారం పెట్టిన మొదట్లో 250 రూపాయల దాకా వచ్చేవి. క్రమేణా నాణ్యమైన వస్తువుల్ని ఉపయోగిస్తూ, ప్రయోగాలు చేస్తూ కష్టమర్లని ఆకట్టుకున్నాడు.అంతే గాక ఆ చుట్టుపక్కల ఎక్కడ పెళ్ళి ఉన్నా ఈయనే పానీపూరి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. 

ఈయన గూర్చి ఎన్నో జాతీయ పత్రికల్లో కథనాలు వచ్చాయి. కాబట్టి పానీ పూరి ని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే! రుచికరం గా చేయాలే గాని కష్టమర్ల రద్దీ మామూలుగా ఉండదు. ఆ విషయం మనకి రోడ్ల పక్కన కొన్ని పానీ పూరి బండ్లని చూస్తుంటేనే తెలిసిపోతుంది. 

----- మూర్తి కెవివిఎస్ 

20, ఫిబ్రవరి 2025, గురువారం

కాకి ని తక్కువ అంచనా వేస్తున్నారా ?

కాకి ని తక్కువ అంచనా వేస్తున్నారా ?

-------------------------------------------------


 కాకి ని చూడని వారు అంటూ బహుశా ఎవరూ ఉండరు. కాకి మీద ఎన్నో సామెతలు ఉన్నాయి. ఆ పక్షి మన పిట్టగోడ మీద నుంచి అరిస్తే చాలు ఈరోజు మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నట్లు భావిస్తాం. అంతే కాదు,పితృ దేవతలకి మనకి సంధానకర్త గా అనుకోవడం కద్దు. మనం పెట్టిన పిండం కాకి ముట్టకపోయినట్లయితే పై లోకం లో ఉన్న పెద్దలు మనపై కోపం గా ఉన్నారేమో అనుకుంటాం. ఇవన్నీ నిజమా,కావా అన్నది అటుంచితే కాకి తో మానవుడి జీవితం ఎంతగా పెనవేసుకుపోయిందో ఈ ఉదంతాలు తెలుపుతాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత గల ఆ జీవులు గూర్చి కొంతైన తెలుసుకోవాలి. కాకులు మంద లోనూ, ఒంటరి గానూ జీవిస్తాయి. వీటి జీవిత కాలం రమారమి ఇరవై ఏళ్ళు.

ఇవి మనుషుల మొహాల్ని బాగా గుర్తుంచుకోగలవు. దాదాపు అయిదేళ్ళ పాటు గుర్తుంచుకుంటాయంటే ఆశ్చర్యం గా లేదూ!ఏడు ఏళ్ళ పిల్లలకి ఉండేంత తెలివి వీటికి ఉంటాయి.అంటే ముఖ్యం గా సమస్య ని పరిష్కరించుకోవడం లో,కమ్యూనికేట్ చేయడం లో కాకి కి ఉండే నైపుణ్యం ఆ స్థాయి లో ఉంటుంది. దాని మెదడు లో కూడా మనకి మల్లే  చిక్కగా అల్లుకుని ఉండే న్యూరాన్లు ఉంటాయి. మనుషులు చేసే మంచి పనులు,చెడ్డ పనులు కూడా అవి గుర్తు పెట్టుకోగలవు. అంటే కాకి కి మీరు అన్నం పెట్టినా,ప్రేమ గా చూసినా అవి మిమ్మల్ని చాలా కాలం గుర్తుంచుకుంటాయి. మీకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తాయి.

మీరు గనక వాటి పిల్లల కి రాళ్ళు వేసినా లేదా వాటి గూడు కి దగ్గరగా వెళ్ళినా, పాడు చేసినా మిమ్మల్ని గుర్తు పెట్టుకుని తగిన గుణపాఠం కూడా చెబుతాయి. అప్పుడప్పుడు పేపర్ల లో చదువుతుంటాం. కాకి పగబట్టి వేధిస్తున్నదని,బయటకి వచ్చినప్పుడల్లా కాళ్ళతో నెత్తి మీద తన్ని పోతున్నాయని ఆవేదన తో ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు కూడా ఉన్నారు.   

మరి అలాంటి సమయం లో ఏం చేయాలి అంటే మనం ఉండే ప్రదేశాన్ని గాని, ఊరిని గాని మార్చడమే చేయగల పని. అంతే తప్పా వేరే దారి లేదు. ఒక్కోసారి కాకులు బాగా అరుస్తుంటాయి. రొద పెడుతుంటాయి. వాటిలో వాటికి కోపం వచ్చినప్పుడు  లేదా ఇతర సంగతుల్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి అలా అరిచి గోల చేస్తుంటాయి. రాత్రి పూట ఆలశ్యంగా గూళ్ళకి వచ్చిన కాకులు చెట్టు కి కింద ఉన్న కొమ్మల మీద కి వెళ్ళవలసిందిగా మిగతా వాటిని అడుగుతుంటాయి.అవి మనకి గోల గా అనిపించడం సహజమే.

సాధారణం గా కాకులు మర్రి చెట్ల మీద,ఇతర పెద్ద చెట్ల మీద, తోటల్లో నివసిస్తాయి.పండ్లను,చిన్న పురుగుల్ని,ధాన్యాల్ని,చేపల్ని తింటాయి. కోడి పిల్లల్ని ఎత్తుకుపోతుంటాయి. ఇతర పక్షుల గూళ్ళని పాడు చేసి వాటి గుడ్లని కూడా తినేస్తాయి.మనం వాటికి ఏదైనా ఆహారం వేసినా గుర్తు పెట్టుకుని అవి మనల్ని విష్ చేస్తాయి.అయితే వాటి భాష మనం అర్థం చేసుకోలేము కనక పట్టించుకోము. ఏ కాకి అయినా మనల్ని చూసి తల ని బౌ చేసినట్లుగా ఊపితే థాంక్యూ అని అర్థం అన్న మాట. అంతే కాదు, వాటికి బాగా నచ్చినట్లయితే కొన్ని బహుమతుల్ని కూడా మనకి ఇస్తుంది. రంగు రంగుల చిన్న రాళ్ళు,మెరిసే ఆకులు ఇలాంటి వాటిని మనకి దగ్గర్లో పారేసి పోతుంది. చూశారా, మనం రోజూ చూసే కాకి వెనుక ఎంత కథ ఉన్నదో !     


19, జనవరి 2025, ఆదివారం

Game Changer సినిమా గురించి రెండు ముక్కలు


 Game changer  ఏం చేంజ్ చేశాడో అని వెళ్ళాను. తెలుగు సినిమా కథ పెద్దగా ఏం మారలేదు. కాకపోతే పొలిటికల్ మాయా మంత్రాలు ,వాటిని తెలివి గా తనకి అనుకూలంగా మార్చుకునే బ్యూరోక్రాట్. అసలు ఇది ఇప్పట్లో సాధ్యమా ? మనం చూస్తూనే ఉన్నాం...ఎంత గొప్ప సివిల్ సర్వెంట్ అయినా రాజకీయ వ్యవస్థ కి మడుగులు ఒత్తవలసిందే లేదా వాళ్ళని జైల్లోకి పంపించి లేదా కేసుల్లో ఇరికించే రోజులు ఇవి. ఎన్ని రాష్ట్రాల్లో చూడటం లేదూ? అలాంటిది ...కొద్దిగా అయినా వాస్తవానికి దగ్గరగా ఉండద్దా..?

సినిమా ని సినిమా గా చూడాలి.ఈకలూ పీకలూ ఇలా లాగితే ఎట్లా అనేవాళ్ళూ మనపక్కనే ఉంటారు. అలా చూస్తూ పోతే బాగా డబ్బులు ఖర్చు పెట్టి పాటల్ని రిచ్ గా తీసిన సినిమా గా తోచింది. ఒక్క పాటా గుర్తు ఉండదు.అది వేరే మాట.ఈ బోటి దానికి కార్తీక్ సుబ్బరాజ్ కథ,శంకర్ డైరెక్షన్ ఏంటో వాళ్ళ గత సినిమాలకి దీనికీ పొంతనే లేదు. హీరోయిన్ అందాల ఆరబోత షరా మామూలే. మామూలు మషాళా సినిమా కొద్ది పాటి తేడాలతో, అని చెప్పాలి.

ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు.ఇంతే సంగతులు.చిత్తగించవలెను.     

13, జనవరి 2025, సోమవారం

థాయ్ లాండ్ లోని మరో కోణం

 థాయ్ లాండ్ లోని మరో కోణం


ఇటీవల థాయ్ లాండ్ వెళ్ళే పర్యాటకులు బాగా పెరిగారు. గత ఏడాది మన దేశం నుంచి 12,55,358 మంది ఆ దేశాన్ని సందర్శించారు.ఆ దేశం లో లభించే విహార,వినోద కార్యక్రమాలు నచ్చడం తో వెళ్ళిన వాళ్ళే వెళుతుండడం గమనించవచ్చు. చక్కని బీచ్ లు, రాత్రి పూట విందులు,అబ్బురపరిచే గతకాలపు నిర్మాణాలు ఇలాంటివి అన్నీ ఆ దేశానికి వెళ్ళేలా చేస్తున్నాయి. అన్నిటికీ మించి అందర్నీ నవ్వుతూ పలకరించే థాయ్ ప్రజల స్వభావం మరింతగా ఆకట్టుకునే అంశం. మన గోవా లో జరిగే టూరిస్టుల దోపిడి అక్కడ లేదు.టాక్సీలు,హోటల్స్ ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.దానివల్ల కూడా మన వాళ్ళు థాయ్ లాండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ఆ దేశం 59.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని టూరిజం వల్ల పొందగలిగింది.


పట్టాయ, ఫుకెట్, బ్యాంకాక్ నగరాలు అనేక సౌకర్యాల్ని టూరిస్ట్ లకి అందిస్తున్నాయి. పట్టాయ లో 24 గంటలు సందడిగానే ఉంటుంది. నిద్రపోని ప్రదేశం అని దీన్ని పిలుస్తారు.ఫుకెట్ గూర్చి చెప్పాలంటే అందమైన బీచ్ లు,సాహసోపేత క్రీడలకి నిలయం. ఇంకా కొన్ని ఆసక్తికరమైన పట్టణాలున్నాయి. మన దేశం నుంచి రమారమి ఫ్లైట్ ద్వారా నాలుగున్నర గంటల ప్రయాణం ,కనుక ఏ మాత్రం ఖాళీ దొరికినా చాలామంది వెళ్ళివస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే థాయ్ లాండ్ కి మన దేశానికి ఉన్న మరో కోణం ఏమిటంటే ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఉన్న సాంస్కృతిక అనుబంధం. దీన్ని మరి ఎంత మంది పట్టించుకుంటున్నారో తెలియదు గానీ కొన్ని విశేషాలు ఇక్కడ చెప్పక తప్పదు.


థాయ్ లాండ్ రాజవంశం ఇప్పటికీ తాము రాముని వారసులు గా పరిగణించుకుంటుంది. రామా అనే బిరుదు తో వారి కి అభిషేకం జరుగుతుంది. ప్రస్తుతం రామా - 10 గా పరిగణింపబడే వాజీరా లాంగ్కోర్న్ 2019 లో రాజు గా అభిషిక్తుడయ్యాడు. బ్రిటన్ లో మాదిరి గానే ఇక్కడి రాజవంశానికీ సంప్రదాయపరమైన గౌరవం లభిస్తుంది. ప్రపంచం లోని ధనిక కుటుంబాల్లో ఒకటి. రాజు కి అభిషేక కార్యక్రమాల్ని నిర్వహించే వారిని బ్రాం లువాంగ్ లుగా పిలుస్తారు.వీరు ఒకానొక కాలం లో భారత దేశం నుంచి వచ్చిన బ్రాహ్మణులుగా వాళ్ళు భావించుకుంటారు. రామాయణాన్ని థాయ్ రామాకియాన్ అనే పేరు తో వ్యవహరిస్తారు. హనుమంతుని శిల్పాలు అనేక చోట్ల కనిపిస్తాయి.శక్తికి,విజయానికీ గుర్తుగా ఆయన పేరు ని చెబుతారు.


ఇక్కడి సాహిత్యం లో థాయ్ రామాకియన్ కి విశిష్ట స్థానం ఉన్నది. ఆయుర్వేదం ని అభివృద్ది చేయడానికి కట్టిన పట్టణానికి అయోధ్య అనే పేరు పెట్టారు. బౌద్ధ మతాన్ని పాటించేవారు దాదాపు 94 శాతం మంది ఉన్నప్పటికీ బౌద్ధ,హిందూ సంప్రదాయాలు కలగలిసిపోయి కనిపిస్తాయి. శివుడు,విష్ణువు,బ్రహ్మ ఈ ముగ్గురు తమ పేర్లు మార్చుకుని ఇక్కడ కనిపిస్తారు.వాళ్ళ ముగ్గురుని ఫ్రా కువాన్,ఫ్రా నరాయ్, ఫ్రా ఫరోన్ గా వ్యవహరిస్తారు. గణేషుడు సైతం నాట్యం చేస్తూన్న భంగిమ లో కనిపిస్తాడు. థాయ్ వంటకాలు ప్రపంచ ప్రసిద్ది పొందాయి. ఆ దేశం ప్రత్యేకంగా తమ చెఫ్ ల్ని ఇతర దేశాలకి అంబాసిడర్ లుగా పంపిస్తుంది. అంటే వారి ద్వారా తమ దేశానికి టూరిజం ఇంకా పెరుగుతుందని వాళ్ళ ప్రణాళిక.


ఆసియా, యూరపు దేశాలతో పోలిస్తే బంగారం ఖరీదు ఇక్కడ తక్కువ. అయితే విదేశీయులు కొనడానికి పరిమితి ఉన్నది.సుగంధద్రవ్యాలు,థాయ్ సిల్క్, స్పా ప్రోడక్ట్స్, షర్టులు,ఇలా చాలా వాటిని మన వాళ్ళు ఎక్కువ గా కొనుగోలు చేస్తుంటారు. అరవై రోజుల దాకా ఎలాంటి వీసా లేకుండా థాయ్ లాండ్ లో భారతీయులు ఉండవచ్చు. గతం లో ఈ పరిమితి తొంభై రోజులుగా ఉండేది. బ్యాంకాక్ లో ఎనభై వేలకి పైగా భారతీయ మూలాలు ఉన్న ప్రజలు ఉన్నారు. థాయ్ కరెన్సీ ని భాట్ అంటారు. మన రూపాయికి రెండు భాట్ లు వస్తాయి.ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల పరంగా చెప్పాలంటే థాయ్ దేశానిది 26 వ స్థానం. 1970 లో టూరిజం ని ప్రధాన వనరు గా ఎన్నుకున్న ఆ దేశం అప్పటి నుంచి ఇప్పటిదాకా వెనక్కి చూడకుండా పురోగమిస్తున్నదనే చెప్పాలి. 


-----